బీజేపీ మేనిఫెస్టో 2019: 'ఆరు కోట్ల మంది ప్రజల అభిప్రాయాలతో హామీ పత్రం'

బీజేపీ మేనిఫెస్టో, మోదీ

ఫొటో సోర్స్, Twitter/bjp

సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ సీనియర్ నేత, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమ పార్టీ మేనిఫెస్టోను సోమవారం నాడు విడుదల చేశారు.

బీజేపీ తన మేనిఫెస్టోను "సంకల్ప పత్రం"గా అభివర్ణించింది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన కార్యక్రమంలో మేనిఫెస్టోను ప్రకటించిన పార్టీ నేతలు, జాతీయవాదమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాథమ్యమని చెప్పారు.

దేశభద్రత విషయంలో ఏవిధంగానూ రాజీపడే ప్రసక్తే లేదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

"వన్ మిషన్, వన్ డైరెక్టన్" వ్యూహంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. గత యాభై ఏళ్లలో పూర్తి చేయాల్సి ఉన్న పనులు తన అయిదేళ్ల పాలనలో పూర్తయ్యాయని అన్నారు.

సులభతరమైన, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన తమ ప్రభుత్వం క్షేత్ర స్థాయి సమస్యలను పరిష్కరించిందన్నారు. దేశంలో పేదరికాన్ని రూపుమాపడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Ani

సంకల్ప పత్రంలోని ముఖ్యాంశాలు:

  • తీవ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొనే విధానం. తీవ్రవాదులను ఎదుర్కోవడానికి సైనిక బలగాలను శక్తిమంతం చేస్తాం.
  • అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేస్తాం. రాజ్యాంగ పరిమితులకు లోబడి మందిర నిర్మాణానికి అన్ని అంశాలను పరిగణించి.. సామరస్యపూర్వక వాతావరణంలో నిర్మిస్తాం.
  • దేశంలోని రైతులందరికీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా లబ్ధి చేకూర్చడం.
  • 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం
  • దేశవ్యాప్తంగా 75 మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల స్థానం.
  • ప్రభుత్వ రంగంలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెంచడం.
  • వ్యవసాయ ఉత్పాదక సంస్థల ఏర్పాటు
  • 60 ఏళ్లు దాటిన పేద రైతులకు సామాజిక భద్రత కోసం పింఛన్ పథకం.
  • రైతులకు రూ.లక్ష వరకూ వడ్డీ లేని రుణాలు
  • వ్యవసాయ రంగానికి రూ. 25లక్షల కోట్ల కేటాయింపు
  • రెవెన్యూ రికార్డుల డిజిటలీకరణ
  • 100 శాతం మురుగు నీరు పునర్వినియోగం
  • ఐఐటీ, నల్సార్ వంటి ఉన్నత స్థాయి విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్, లా సీట్ల పెంపు.
  • ప్రతి కుటుంబానికీ పక్కా ఇల్లు
  • ప్రతి ఇంటికీ మరుగు దొడ్డి
  • గ్రామీణ పేద కుటుంబాలన్నింటికీ వంట గ్యాస్ కనెక్షన్
  • ఇంటింటికీ పరిశుభ్రమైన తాగు నీరు
  • భారత్ మాలా ప్రాజెక్టు తొలి దశ పూర్తి
  • ప్రధాన, ద్వితీయ శ్రేణి నగరాల్లో పైపు ద్వారా వంట గ్యాస్ సరఫరా
  • జాతీయ రహదారుల నిడివి రెట్టింపు
  • అన్ని గ్రామ పంచాయతీలకూ హైస్పీడ్ ఇంటర్నెట్
  • దేశంలో విమానాశ్రయాల సంఖ్యను 150కు పెంపు
  • "సులభతర వాణిజ్యం"లో దేశ ర్యాంకును మరింత మెరుగుపరచడం
  • 2022 నాటికి వీలైనంత వరకు అన్ని రైల్వే లైన్లనూ బ్రాడ్ గే‌జ్ లైన్లుగా మార్చడం
  • సరకు రవాణా కోసం 2022 నాటికి ప్రత్యేక రైల్వే లైన్ల ఏర్పాటు
  • ఆరుగురు గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంల ఏర్పాటు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)