ఉత్తర భారతదేశ మహిళలను రాహుల్‌గాంధీ అవమానించారా: FactCheck

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, TWITTER

    • రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
    • హోదా, బీబీసీ న్యూస్

దక్షిణ భారతదేశంలో ఓట్లు సంపాదించడానికి రాహుల్ గాంధీ ఉత్తర భారతదేశం మహిళలను అవమానించారంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

మితవాద సోషల్ మీడియా వినియోగదారులు.. తమ వాదనను సమర్థించుకోవడానికి 20సెకన్లు నిడివి ఉన్న ఒక వైరల్‌ వీడియోను కూడా పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో ఏముంది?

''ఈ విషయంలో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం కంటే ఎంతో మెరుగ్గా ఉంది. ఇది నిజం. మీరు ఉత్తర భారతదేశంలోని ఉత్తర్ ప్రదేశ్‌కు లేదా బిహార్‌కు వెళితే.. అక్కడ మహిళల పరిస్థితిని చూసి షాక్ అవుతారు'' అని మాట్లాడిన రాహుల్ ఆ వైరల్ వీడియోలో కనిపిస్తారు.

ప్రాంతాలవారిగా రాహుల్ గాంధీ దేశాన్ని విభజిస్తున్నారని కొందరు వాదిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కూడా ఈ ఆరోపణలున్న ఓ పోస్ట్‌ను షేర్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కానీ ఈ వీడియో క్లిప్‌ ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, రాహుల్ ప్రసంగంలోని కొంత భాగాన్ని కట్ చేసి, ఆ వీడియో క్లిప్‌తో వక్రీకరణ జరుగుతోందని మా అధ్యయనంలో తేలింది. బుధవారం నాడు చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజ్‌ విద్యార్థుల ఇష్టాగోష్టిలో రాహుల్ మాట్లాడారు.

అసలు రాహుల్ ఏమన్నారంటే..

స్టెల్లా మేరీస్ విద్యార్థులతో మాట్లాడుతూ రాహుల్.. పలు అంశాలను ప్రస్తావించారు. అందులో భాగంగా మహిళలకు సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడారు.

కాలేజ్ విద్యార్థుల్లో ఒకరు.. మహిళల పట్ల వివక్షత, అసమానతల గురించి రాహుల్‌ను ప్రశ్నించారు. అందుకు సమాధానమిస్తూ..

''భారతదేశంలో మహిళల సమానత్వం ఆశించిన స్థాయిలో లేదు. కానీ ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశం ఈ విషయంలో ఎంతో మెరుగ్గా ఉంది. ఇది నిజం. మీరు ఉత్తర భారతదేశానికి వెళితే, ఉత్తర్ ప్రదేశ్‌కు లేదా బిహార్‌కు వెళితే.. అక్కడ మహిళల పరిస్థితిని చూసి షాక్ అవుతారు. అందులో సాంస్కృతిక కోణం కూడా ఉంది. దక్షిణ భారతంలో మహిళలను ఎలా చూస్తారనడానికి తమిళనాడులో ఉన్న మహిళా నాయకత్వమే ఒక ఉదాహరణ. అప్పుడే సంబరపడకండి.. తమిళనాడులో కూడా అభివృద్ధి చెందాల్సింది ఇంకా చాలానే ఉంది'' అని రాహుల్ అన్నారు.

రాహుల్

ఫొటో సోర్స్, TWITTER

''ఎందులోనూ పురుషుల కంటే మహిళలు తక్కువ కాదు. పురుషులతో అన్నింటా సమాన స్థాయిలో మహిళలు ఉండాలి. పార్లమెంటులో, శాసన సభల్లో ఎక్కడ చూసినా అవసరమైన స్థాయిలో మహిళా నాయకత్వం లేదు. 2019లో మేం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా.. లోక్‌సభతోపాటు, అన్ని రాష్ట్రాల శాసన సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించేలా చూస్తాం. జాతీయ స్థాయిలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తాం'' అన్నారు.

దేశంలో మహిళా సాధికారత ఆవశ్యకత గురించి రాహుల్ మాట్లాడారు.

''నాయకత్వ పగ్గాలు చేపట్టేలా మహిళలను ప్రోత్సహించాలని విశ్వసించేవారిలో నేనూ ఒకడిని. సాధారణంగా పురుషులకంటే మహిళలే తెలివైనవారు'' అంటూ రాహుల్.. తన ప్రసంగాన్ని ముగించారు.

తాము అధికారంలోకి వస్తే, 2023-24నాటికి విద్యారంగం కోసం పెట్టే ఖర్చును స్థూల జాతీయోత్పత్తిలో 6శాతానికి పెంచుతామని కూడా రాహుల్ అన్నారు.

రాహుల్

ఫొటో సోర్స్, TWITTER

ఉత్తర్ ప్రదేశ్, బిహార్ గురించి రాహుల్ మాటల్లో వాస్తవం ఉందా?

తమిళనాడుతో ఉత్తర్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలను పోల్చితే, రాహుల్ వ్యాఖ్యలు సరైనవేనని గణాంకాలు చెబుతున్నాయి.

ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచి-2017 ప్రకారం, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, దిల్లీ, కర్నాటక, కేరళ రాష్ట్రాల పరిస్థితి మెరుగ్గా ఉంది.

జాతీయ నేరగణాంకాల సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, వరకట్న వేధింపులతోపాటు మహిళలపై జరుగుతున్న ఇతర వేధింపులు, హింస కేసుల్లో దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలకంటే ఉత్తర్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)