మహారాష్ట్ర: 'కన్ను మూసినా తెరిచినా కనిపించేది నీటి సమస్యే.. పరిష్కరించేవారికే నా ఓటు' #MyVoteCounts

యశోద
ఫొటో క్యాప్షన్, యశోద

భారతదేశంలో సుమారుగా 46 శాతం మంది మహిళలు రోజులో కనీసం 15 నిమిషాలు, అంతకన్నా ఎక్కువ సమయం నీళ్లు తెచ్చుకోవడానికే కేటాయిస్తున్నారని ఐక్యరాజ్య సమితి నివేదికలు చెబుతున్నాయి. ఈ సమస్యపై యువ ఓటర్లేమంటున్నారు? బీబీసీ 'మై ఓట్ కౌంట్స్' సిరీస్‌లో భాగంగా- తొలిసారిగా ఓటుహక్కును వినియోగించుకోబోతున్న 18 ఏళ్ల మహారాష్ట్ర యువతి యశోద జోలేపై బీబీసీ ప్రతినిధులు అనఘా పాఠక్, పీయూష్ నాగ్పాల్ అందిస్తున్న కథనం ఇది.

''నా జీవితం ఈ నీటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నేను నిద్రలేవగానే గుర్తొచ్చే మొదటి విషయమూ అదే. నిద్ర పోయే ముందు గుర్తొచ్చే చివరి విషయమూ అదే'' అని యశోద చెప్పారు. తమకు ఎవరు నీటి సదుపాయం కల్పిస్తే వారికే రాబోయే ఎన్నికల్లో ఓటేస్తానని యశోద తెలిపారు. ''నేనొక్కదాన్నే కాదు మా గ్రామానికి చెందిన మహిళలందరూ వారికే ఓటేస్తారు'' అని చెప్పారు.

ఆమెది మహారాష్ట్రలోని జవహర్ ప్రాంతం. ఈ ప్రాంతంలో నాలుగు నెలలపాటు 3,287 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. సరైన నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడంతో మిగిలిన ఏడాదంతా నీటి కొరతతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.

వీడియో క్యాప్షన్, 'నిద్ర లేచిన వెంటనే, నిద్రపోయే ముందు ఆలోచించేది నీళ్ల సమస్యే' #MyVoteCounts

రోజులో చాలాసేపు నీళ్లు తోడటంతోనే గడిపేస్తుంటానని యశోద తెలిపారు.

''నాలుగేళ్ల పిల్లల దగ్గర నుంచి 70 ఏళ్ల ముసలివారు వరకు ప్రతి ఒక్కరూ ప్రతి రోజు ఇక్కడ అదే పనిచేస్తూ కనిపిస్తారు. వీరిలో గర్భిణులు కూడా ఉంటారు. ఇది కేవలం నీటి సమస్య మాత్రమే కాదు, లింగ భేదానికి సంబంధించిన విషయం. ప్రభుత్వం నీటికొరతను పెద్ద సమస్యగా భావించడం లేదు. ఎందుకంటే ముందు మా గ్రామంలోని పురుషులే దీనిని సమస్య అనుకోవడం లేదు కాబట్టి. ఈ నీళ్లు ఊరికే వస్తున్నాయని వాళ్లనుకుంటారు. మేం నీళ్ల పన్ను కూడా కట్టకపోవడంతో మా గ్రామంలో కుళాయిలన్నీ అలంకార ప్రాయమైపోయాయి'' అని ఆమె వివరించారు.

నీళ్లు తెచ్చుకుంటున్న మహిళలు

'పక్క గ్రామంలో గ్రామపెద్దే నీళ్లు ఆపేశారు'

పక్కనే ఉన్న మరో గ్రామంలో గ్రామపెద్దే ఇంటి దగ్గర కుళాయిలకు నీళ్లు ఆపేశారని యశోద చెప్పారు. ''ఎందుకంటే- ఇంటి ముందే నీళ్లు ఉంటే మహిళలు నీటిని వృథా చేస్తారని చెబుతున్నారు. ఆయన నీటిని ఆదాచేయాలనుకుంటున్నారు. వేసవి కాలంలో నీటి ఇబ్బందులు లేకుండా చూడాలనుకుంటున్నారు. కానీ ఏం చేస్తే బాగుంటుందనే విషయం మహిళలను ఆయనెప్పుడూ అడగలేదు'' అని ఆమె ఆక్షేపించారు.

ప్రభుత్వానిది కూడా ఇదే తీరని, వారెప్పుడూ మహిళల అభిప్రాయాన్ని తీసుకోరని, ఎందుకంటే కేబినెట్‌లో కూడా చాలా తక్కువ మంది మహిళలు ఉన్నారని యశోద వ్యాఖ్యానించారు.

''రాబోయే ఐదేళ్లలో నేను చదువు పూర్తిచేసి పోలీస్ కానిస్టేబుల్ కావాలనుకుంటున్నా. నేను జవహర్ ప్రాంతాన్ని వదిలి నీరు సమృద్ధిగా ఉన్న చోటకు వెళ్లి స్థిరపడాలనుకుంటున్నా'' అని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)