ఏడాదిన్నర తర్వాత రెపో రేటును తగ్గించిన ఆర్‌బీఐ: ఈఎంఐ భారం తగ్గుతుందా?

శక్తికాంత దాస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్

భారత రిజర్వు బ్యాంకు దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ ఇప్పుడు రెపో రేటును తగ్గించింది. గురువారం దీనిని 25 బేసిస్ పాయింట్లు (అంటే 0.25 శాతం) తగ్గిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకొంది.

ఆర్‌బీఐ నిర్ణయంతో రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని ఆర్‌బీఐ తెలిపింది.. ఈ తగ్గింపునకు అనుగుణంగా బ్యాంకులు నిర్ణయం తీసుకోవచ్చని, గృహ, వాహన రుణాలు తీసుకున్నవారికి ఈఎంఐల భారం తగ్గే అవకాశముందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.

బ్యాంకు ప్రాంగణం

ఫొటో సోర్స్, Ravisankar Lingutla/BBC

బ్యాంకులకు తాను ఇచ్చే స్వల్ప కాలిక నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటును 'రెపో రేటు' అని వ్యవహరిస్తారు. బ్యాంకుల వద్ద డబ్బు తీసుకున్నప్పుడు దానిపై ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ రేటును 'రివర్స్ రెపో రేటు' అంటారు. ఆర్‌బీఐ నిర్ణయం ప్రకారం రివర్స్ రెపో రేటు ఆరు శాతానికి చేరింది.

ఉర్జిత్ పటేల్ స్థానంలో డిసెంబరులో ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రెపో రేటును తగ్గించడం ఇదే తొలిసారి. ఇంతకుముందు చివరిసారిగా 2017 ఆగస్టులో ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఫొటో సోర్స్, Getty Images

రెండు నెలలకోసారి జరిపే విధాన సమీక్షలో భాగంగా ఆర్‌బీఐలోని ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) ఈ నిర్ణయం తీసుకొంది. సమీక్ష సమావేశంలో ఈ కమిటీలోని గవర్నర్ శక్తి కాంత దాస్ సహా నలుగురు సభ్యులు రెపో రేటు తగ్గించాలని చెప్పగా, మిగతా ఇద్దరు యథాతథ స్థితిని కొనసాగించాలని అభిప్రాయపడ్డారు.

ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, ఇతర అంశాల నేపథ్యంలో రెపో రేటును ఆర్‌బీఐ తగ్గిస్తుందనే అంచనాలు ఇంతకుముందు వెలువడ్డాయి.

2019-20 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 7.4 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.

ప్రస్తుత 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఇదే చివరి సమీక్ష. ఎంపీసీ తిరిగి ఏప్రిల్లో సమావేశం కానుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)