తెలంగాణ: రాహుల్ గాంధీని కలిశాను కానీ కాంగ్రెస్లో చేరడం లేదన్న గద్దర్

ఫొటో సోర్స్, facebook/MadhuYaskhiGoud
ప్రజాయుద్ధ నౌకగా ’విప్లవాభిమానులు’ పిల్చుకునే గద్దర్ కుటుంబసభ్యులతో కలిసి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు.
గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ ఇప్పటికే కాంగ్రెస్లో చేరారని, పార్టీ ప్రచారానికి గద్దర్ తురుపుముక్కగా పనిచేస్తారని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ రామచంద్ర కుంతియా బీబీసీకి తెలిపారు.
సుదీర్ఘ కాలం నక్సలైట్ల భావజాలానికి బహిరంగ వాహికగా ఉన్న గద్దర్.. రాహుల్ గాంధీని కలవడంతో ఆయన కాంగ్రెస్లో చేరుతున్నారన్న వార్తలొచ్చాయి. కానీ, గద్దర్ దానిపై స్పష్టత ఇస్తూ తాను ఏ పార్టీలోనూ చేరలేదని చెప్పారు. తన కుమారుడు మాత్రం కాంగ్రెస్లో చేరినట్లు ఆయన వెల్లడించారు.
రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణకు తాము చేస్తున్న కార్యక్రమాలకు మద్దతివ్వాలని రాహుల్ గాంధీని కోరినట్లు ఆయన తెలిపారు.
సేవ్ ఇండియా, సేవ్ కాన్సిట్యూషన్ ప్రచారం గురించి ఆయనకు వివరించినట్లు చెప్పారు.
రాజకీయ పార్టీలు, ప్రజలు కోరుకుంటే తాను గజ్వేల్ నుంచి కేసీఆర్పై పోటీ చేయడానికి సిద్ధమేనని ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images










