SLBC Tunnel: అసలు ఏమిటీ ప్రాజెక్టు, సొరంగం ఎందుకు, 20 ఏళ్లుగా ఎందుకు పూర్తి కాలేదు?

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ మధ్యనే పనులు మొదలైనట్లుగా నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది.
తెలంగాణలో సుదీర్ఘకాలంగా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును చెప్పుకోవచ్చు.
దీని నిర్మాణానికి సుమారు 42 ఏళ్ల కిందట ఆలోచన మొదలుకాగా, 20 ఏళ్ల కిందట నిధుల ఆమోదంతో పనులు కొనసాగుతూ వస్తున్నాయి.
అసలు ఏమిటీ ప్రాజెక్టు? దాదాపు 44 కిలోమీటర్ల మేర ఎందుకు సొరంగం తవ్వుతున్నారు? ఈ ప్రాజెక్టుతో ఏయే ప్రాంతాలకు ఉపయోగం, ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు సాగుతోంది? ఒకసారి చూద్దాం..

ఎస్ఎల్బీసీ టన్నెల్కు టర్నింగ్ పాయింట్
ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు పనులను 2005 ఆగస్టులో రూ.2813 కోట్లతో చేపట్టేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది.
ప్రాజెక్టుకు అప్పటి సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేయగా.. 2007లో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.
ఇందులో 43.93 కిలోమీటర్ల సొరంగం (టన్నెల్) మార్గం నిర్మించడం కీలకమైనది. టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)తో నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది.
రెండుచోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, రెండు లింక్ కెనాల్స్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు ప్రాజెక్టులో భాగంగా చేయాల్సి ఉంది.

ఫొటో సోర్స్, UGC
టన్నెల్స్ పొడవు ఎంతంటే..
శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన మొదటి సొరంగం (టన్నెల్-1) 9.2 మీటర్ల వ్యాసంతో 43.93 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా.. 34.37 కిలోమీటర్లు పూర్తయినట్లుగా నీటిపారుదల శాఖ ప్రకటించింది.
దీనికి సంబంధించి రెండు వైపుల నుంచి అంటే ఇన్లెట్, అవుట్లెట్ వైపు నుంచి పనులు చేసుకుంటూ వచ్చారు.
నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద పనులు చేపట్టి అచ్చంపేట మండలం మన్నెవారి పల్లి వద్ద టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా 9.56 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించాల్సి ఉంది.
మరో సొరంగం (టన్నెల్ -2) 8.75 మీటర్ల వ్యాసంతో 7.13 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయ్యింది. ఇది నల్లగొండ జిల్లా చందంపేట మండల తెల్దేవరపల్లి నుంచి నేరెడుగొమ్మ వరకు ఉంది.
డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లిపాకాల, ఉదయ సముద్రం రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది.
ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు ద్వారా సుమారు 30 టీఎంసీల నీటిని కృష్ణా నది నుంచి తరలించాలనేది ప్రణాళిక.
దీనిద్వారా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించాలని నిర్ణయించారు.
2010 నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా, కొనసాగుతూ వచ్చాయి.
ఈ విషయంపై తెలంగాణ జల సాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్దన్ బీబీసీతో మాట్లాడారు.
''ఈ ప్రాజెక్టు ఉమ్మడి ఏపీలోనే 52 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత గత పదిన్నరేళ్లలో 23 శాతం పనులు అయ్యాయి.'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
టన్నెల్స్ నిర్మాణం ఎందుకంటే..
ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం. పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని. అనుమతులు లభించే పరిస్థితి లేదని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు.
దీనికితోడు గ్రావిటీ దృష్ట్యా కూడా టన్నెల్ ద్వారా నీటిని తరలించాలనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రతిపాదన.
ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత రూట్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. దీనివల్ల అటవీ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో అనుమతులు ఇచ్చింది.
''రక్షిత అటవీ ప్రాంతం కావడంతో మొదట్లో ప్రతిపాదించినప్పటి నుంచి కూడా సొరంగం ద్వారానే నీటిని తరలించాలనే ప్రణాళిక ఉంది.'' అని తెలంగాణ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
40 సంవత్సరాల కిందటే బీజం
ఈ శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్కు దాదాపు నాలుగు దశాబ్దాల కిందటే బీజం పడింది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యయనానికి 1978లో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నిపుణుల కమిటీ వేశారు.
సర్వే చేసి సొరంగం ద్వారా నీటిని తరలించాలని కమిటీ తొలిసారిగా సూచన చేసింది.
1980లో అక్కమ్మ బిలం వద్ద సొరంగం నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుకు నాటి ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయించింది.
1983 మే నెలలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎడమగట్టు కాలువ, కుడి గట్టు కాలువకు శంకుస్థాపన చేశారు.
తర్వాత 1995లో సొరంగం నిర్మాణం ఆలస్యమవుతోందని భావించి.. ప్రత్యామ్నాయంగా నల్లగొండ జిల్లా పుట్టంగండి నుంచి ఎత్తిపోతల పథకం ప్రతిపాదించి చేపట్టింది ప్రభుత్వం.
దీనికి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టి...పుట్టంగండి నుంచి నీటిని తరలించడంతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీటితోపాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని అందిస్తున్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టును నిర్మించినప్పటికీ.. సొరంగం నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం దక్కుతుందనే వాదన దశాబ్దాలుగా ఉంది.
దీనికి తగ్గట్టుగానే 2005లో ప్రభుత్వం ముందుకు వచ్చింది.

ఫొటో సోర్స్, UGC
మరి, ఇంత జాప్యం ఎందుకంటే..
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 2010 నాటికే పూర్తి చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటివరకు ఆరు సార్లు ప్రాజెక్టు పూర్తికి గడువులు పొడిగించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం 2026 జూన్ లోపు పూర్తి చేయాలనేది లక్ష్యం.
ఇన్లెట్ వైపు టన్నెల్ నుంచి పెద్దఎత్తున సీపేజీ (ఊట) వస్తుండటంతో పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది. డీవాటరింగ్, డీ సిల్టింగ్ చేసుకుంటూ పనులు చేయాల్సిన పరిస్థితి.
''ప్రాజెక్టులో సీపేజీని నియంత్రించడం చాలా కష్టంతో కూడుకున్నది. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో జరుగుతున్న పనుల్లో ఊట భారీగా ఉంటుంది. ఆ నీటిని తోడిపోస్తూ పనులు చేయడం సవాలే.'' అని చెప్పారు నైనాల గోవర్దన్.
పెచ్చులూడి పడకుండా రింగులు ఏర్పాటు చేసి సిమెంటు పూత పూస్తూ పనులు చేస్తుంటారని వివరించారు.
ప్రాజెక్టుకు అవసరమైన టన్నెల్ బోరింగ్ మిషన్ పలుమార్లు పాడైనట్లుగా చెప్పింది నిర్మాణ సంస్థ.
''నిధుల సమస్య కూడా ఉంది. విద్యుత్తు బిల్లుల చెల్లింపులు సక్రమంగా జరగలేదు. అటు నిర్మాణ సంస్థ.. ఇటు ప్రభుత్వం.. ఇద్దరి వద్ద నిధుల సమస్యతో పనులపై తీవ్ర ప్రభావం పడింది.'' అని రిటైర్డు చీఫ్ ఇంజినీరు శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పారు. అలాగే షియర్ ట్రీట్మెంట్ కోసం ఏడాదిన్నరపాటు పనులు ఆగిపోయాయని ఆయన వివరించారు.
''మొత్తంగా ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.2647 కోట్లు ఖర్చు అయ్యింది. గత పదేళ్లలో రూ.500 కోట్లే కేటాయింపులు జరిగాయి. ముఖ్యంగా 2019, 2020, 2021లో చూస్తే మూడేళ్లలో రూ. 10 కోట్లే కేటాయించింది. ఈ నిధులు నిర్వహణకు కూడా సరిపోయే పరిస్థితి రాలేదు.'' అని నీటి పారుదల శాఖకు చెందిన అధికారి ఒకరు బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, UGC
అంచనాలు ఎలా పెరిగాయంటే..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు అంచనా మరోసారి కూడా పెంచింది. 2017లో రూ.3,152 కోట్లకు అంచనా వ్యయం పెరగగా.. దాన్ని రూ.4,637 కోట్లకు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం.
నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) అనిల్ కుమార్ సారథ్యంలో ప్రభుత్వం ఓ కమిటీ వేసింది.
తిరిగి ప్రాజెక్టు (సొరంగం) పనులు ప్రారంభించాలంటే సీపేజీ నివారణ, బోరింగ్ మెషిన్ బేరింగులు ఏర్పాటు చేయాల్సి ఉందని కమిటీ భావించింది. ఇందుకు ముందస్తుగా రూ.50 కోట్లను నిర్మాణ సంస్థకు కేటాయించేందుకు ప్రతిపాదించింది. ఈ మేరకు నిరుడు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
అలాగే 2024-25 బడ్జెట్లో రూ.800 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
రెండేళ్లలో పూర్తి చేసేలా చర్యలు చేస్తామని నిరుడు జులైలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
''ప్రస్తుతం నెలకు 300 మీటర్ల చొప్పున టన్నెల్ తవ్వాలనేది నిర్మాణ సంస్థ ప్రణాళిక. దానికి తగ్గట్టుగా రెండు, రెండున్నరేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుంది.'' అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
ఏళ్ల తరబడిగా టన్నెల్ పనులు జరుగుతుండటంతో సమస్యలు పెరుగుతూ వచ్చాయని నీటి పారుదల రంగ నిపుణులు చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
టన్నెల్ లోపల పనిలో చాలా సమస్యలు
ప్రాజెక్టుకు సమీపంలో టన్నెల్ లోపల పనిచేయడానికి ఎన్నో సమస్యలు ఉంటాయని బీబీసీతో నైనాల గోవర్దన్ చెప్పారు.
సొరంగం నిర్మాణ మార్గంలో భూమి 'లూజ్' గా ఉండే ప్రాంతాన్ని రాడార్ సాయంతో గుర్తించుకుంటూ వెళ్లాలి. సొరంగం లోపల కూలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
''టన్నెల్ మెషీన్ నడుస్తున్న సమయంలో పెద్ద శబ్దం వస్తుంది. శబ్దాన్ని గ్రహించే వాతావరణం అక్కడ ఉండదు. అది చెవులు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకు తగ్గట్టుగా జర్మన్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి.'' అని చెప్పారు.
సాధారణంగా ప్రతి 500 మీటర్లకు ఒక రక్షణ చాంబరు ఏర్పాటు చేసి గాలి, వెలుతురు వచ్చేలా చేయాల్సి ఉంటుందని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు.
కానీ, ఎస్ఎల్బీసీ విషయంలో రక్షిత అటవీ ప్రాంతం కావడంతో తవ్వకాలకు వీల్లేకుండా ఉంది.
''చాలా ఏళ్లుగా పనులు నడుస్తున్నందున కొన్ని వాయువులు కూడా ఏర్పడతాయి. ఊపిరి ఆడని పరిస్థితి తలెత్తుతుంది. బయట నుంచి ఎప్పటికప్పుడు గాలిని పంపిస్తుండాలి.'' అని నైనాల గోవర్దన్ బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














