మాంసం తినే స్క్రూవర్మ్..అమెరికాలో తొలిసారి మనిషి శరీరంలో గుర్తించిన వైద్యులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నార్డినే సాద్
- హోదా, బీబీసీ న్యూస్
మాంసం తినే స్క్రూవర్మ్ అనే పరాన్నజీవి అమెరికాలో తొలిసారిగా మానవ శరీరంలో బయటపడింది.
న్యూ వరల్డ్ స్క్రూవర్మ్ (ఎన్డబ్ల్యూఎస్) మైయాసిస్ను ఎల్ సాల్వడార్ నుంచి అమెరికాకు వచ్చిన ఒక రోగి శరీరంలో కనుగొన్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (హెచ్హెచ్ఎస్) ఆగస్టు 25న వెల్లడించింది.
ఈ కేసు ఆగస్ట్ 4న నిర్ధరణ అయింది.
ఈ రోగం ప్రధానంగా పశువులకు వ్యాపిస్తుంది. కానీ అమెరికాలో తొలిసారిగా మానవ శరీరంలో ఈ పరాన్నజీవులు కనిపించాయి.
అయితే ప్రస్తుతానికి అమెరికాలో ప్రజారోగ్యానికి ప్రమాదం 'చాలా తక్కువ'గా ఉందని అధికారులు తెలిపారు.
ఈ కేసును శోధించేందుకు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సంస్థ మేరీల్యాండ్ హెల్త్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తుంది.


ఫొటో సోర్స్, Reuters
ఈగల ద్వారా వ్యాపించే ప్రమాదం...
ఎన్డబ్ల్యూఎస్ మైయాసిస్కు సంబంధించిన మనుషుల్లో తొలి కేసు ఇదేనని హెచ్హెచ్ఎస్ ప్రతినిధి అండ్రూ నిక్సన్ చెప్పారు.
సజీవ కణజాలాన్ని తినే ఈ వినాశకరమైన పరాన్నజీవి సాధారణంగా దక్షిణ అమెరికా, కరేబియన్ ప్రాంతాలలో కనిపిస్తుంది.
ఇది వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ మెక్సికో సహా ప్రతి సెంట్రల్ అమెరికా దేశంలోనూ ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈగల ద్వారా వ్యాపించే ప్రమాదం...
ముఖ్యంగా శరీర భాగాలపై గాయాలైనవారు ఈగల వల్ల ఈ రోగం బారినపడే ప్రమాదం ఉంది.
ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణించినా, ఈగలు ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పరిసరాల్లో ఉండేవారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని సీడీసీ వెల్లడించింది.
''ఎన్డబ్ల్యూఎస్ ఫ్లై లార్వాలు ఏదైనా జంతువు గాయం నుంచి మాంసాన్ని కొరికినప్పుడు, అది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అవి ఆ జంతువుకు ప్రాణాంతకంగా మారతాయి. పశువులు, పెంపుడు జంతువులు, వన్యప్రాణులకు, అప్పుడప్పుడు పక్షులకు, అరుదుగా మనుషులకు ఎన్డబ్ల్యూఎస్ ప్రభావం చూపిస్తుంది'' అని యూఎస్డీఏ పేర్కొంది.
పశువుల్లో స్క్రూవర్మ్ వ్యాప్తి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ‘యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్’ ఈ నెల ప్రారంభంలోనే తెలిపింది.
పశువులు, పాడి పరిశ్రమతో ముడిపడిన ఆర్థిక లావాదేవీలపై 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,700 కోట్లు) మేర నష్టం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














