మకాలా జైలు భూమి మీద ఉన్న ‘నరకమా’? రోజుకు ఒక్కసారే భోజనం, స్నానాల గదుల గోడలపై నిద్ర.. ఎక్కడుందీ దుర్భర ప్రదేశం

మకాలా జైలులో ఖైదీలకు ఇచ్చే ఆహారం

ఫొటో సోర్స్, Stanis Bujakera

ఫొటో క్యాప్షన్, మకాలా జైలులో ఖైదీలకు ఇచ్చే ఆహారం
    • రచయిత, వెడాలీ చిబెలుషి
    • హోదా, బీబీసీ న్యూస్

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని మకాలా జైలు నుంచి తప్పించుకోవడానికి ఇటీవల కొందరు ఖైదీలు విఫలయత్నం చేశారు. ఆ జైలు నరకాన్ని తలపిస్తుందని అక్కడ శిక్ష అనుభవించినవారు చెప్పారు.

డీఆర్ కాంగోలో అతిపెద్ద జైలు అయిన మకాలా గురించి అక్కడి మాజీ ఖైదీ, జర్నలిస్ట్ స్టానిస్ బుజకేరా బీబీసీతో చెప్పారు.

‘మకాలా నిజంగానే నరకం’ అని ఆయన అన్నారు.

ఓ ప్రతిపక్ష నేత మరణంలో సైన్యం ప్రమేయం ఉందన్న ఆరోపణలతో కథనం రాశారన్న అభియోగంపై అధికారులు బుజకేరాను మకాలా జైలుకు పంపారు.

ఆయన అక్కడ ఆరునెలలు గడిపారు.

‘‘మకాలా జైలు కాదు, కాన్సంట్రేషన్ క్యాంపులను తలపించే నిర్బంధ కేంద్రం అది. చనిపోయేలా చేయడానికే అక్కడికి పంపిస్తారు’ అని ఆయన చెప్పారు.

ఈ జైలు డీఆర్ కాంగో రాజధాని కిన్షాసాలో ఉంది. దీని సామర్థ్యం 1500 మంది ఖైదీలు. కానీ అంతకు పది రెట్ల సంఖ్యలో ఖైదీలను ఇందులో ఉంచినట్లు అంచనా.

చిన్నపాటి నేరాలు చేసేవారి నుంచి రాజకీయ ఖైదీలు, హంతకుల వరకు అందరూ ఇందులో ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బుజకేరా

ఫొటో సోర్స్, Stanis Bujakera

ఫొటో క్యాప్షన్, స్టానిస్ బుజకేరా డీఆర్‌ కాంగోకు చెందిన పాత్రికేయుడు. కొద్దికాలం మకాలా జైలులో ఉన్న ఆయన అక్కడి జీవితం దుర్భరంగా ఉంటుందని చెప్పారు.

129మంది మృతి

మకాలాలో ఖైదీలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై మానవ హక్కుల సంఘాలు ఎప్పటి నుంచో ఫిర్యాదులు చేస్తున్నాయి.

పరిమితికి మించి ఖైదీలను ఉంచడం, నాణ్యతలేని ఆహారం, పరిశుభ్రమైన మంచినీరు లేకపోవడం వంటి సమస్యలపై మానవ హక్కుల సంఘాలు మాట్లాడుతూనే ఉన్నాయి.

ఇటీవల ఈ జైలు నుంచి ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో మరోసారి అక్కడి పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి.

గత సోమవారం (సెప్టెంబర్ 2) తెల్లవారుజామున మకాలా నుంచి పెద్ద సంఖ్యలో ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నించారని.. 129 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారని డీఆర్ కాంగో మంత్రి జాక్వెమైన్ షబానీ తెలిపారు.

పారిపోయేందుకు ప్రయత్నించినవారిపై కాల్పులు జరపడంతో 24 మంది మరణించారని, ఇరుకైన ప్రదేశంలో తొక్కిసలాట కారణంగా ఊపిరాడక మరికొందరు చనిపోయారని ఆయన చెప్పారు.

ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన నలుగురు ఖైదీలు న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ జైలులోని దుర్భర పరిస్థితులను వివరించారు.

తాము తప్పించుకోవడానికి ప్రయత్నించడానికి రోజున్నర ముందు నుంచి మంచినీటి సరఫరా లేదని, కరెంటు లేక ఫ్యాన్లు తిరగలేదని వారు చెప్పారు.

ఆ ఉక్కపోత, వేడిని తట్టుకోలేక కొంతమంది ఖైదీలు తొలుత బయటకు వచ్చారని చెప్పారు.

మకాలా జైలులో పరిస్థితులు అసాధారణంగా ఉంటాయని, నీటి పంపులు ఎప్పుడూ ఎండిపోయి ఉంటాయని, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదని, ఖైదీలు రోజుల తరబడి చీకట్లోనే ఉండాల్సి వస్తుందని బుజకేరా తెలిపారు.

‘ఖైదీలను వారి ఖర్మానికి వదిలేస్తారు. విపరీతమైన రద్దీ, అపరిశుభ్రమైన వాతావరణం వల్ల వ్యాధులు వ్యాపిస్తాయి’ అని చెప్పారు.

కాంగోకు చెందిన మానవ హక్కుల సంస్థ ‘లా వోయిక్స్ డెస్ సాన్స్ వోయిక్స్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోస్టిన్ మాన్‌కేటా అనేకసార్లు మకాలా జైలును సందర్శించారు.

ఎవరినైనా ఆ జైలుకు పంపారంటే వారిని నరకానికి పంపినట్లేనని ఆయన చెప్పారు.

బుజకేరా వీడియో స్క్రీన్ గ్రాబ్

ఫొటో సోర్స్, Stanis Bujakera

ఫొటో క్యాప్షన్, బుజకేరా తీసిన వీడియోల స్క్రీన్ గ్రాబ్స్. స్నానాల గదుల గోడలపై నిద్రపోతున్న ఖైదీలు, కాలు చాపడానికి కూడా వీల్లేనంత రద్దీగా ఉన్న గది

స్నానాల గది గోడలపై నిద్ర

బుజకేరా మకాలాలో ఉన్న సమయంలో తీసిన వీడియోలు ఆ జైలులోని దుర్భర పరిస్థితులను కళ్లకు కట్టాయి.

కిక్కిరిసిపోయిన ప్రదేశంలో నేలపై అనేకమంది ఖైదీలు నిద్రపోతుండడం అందులో కనిపిస్తుంది.

కాలు చాపడానికి కూడా వీలులేని దుర్భర పరిస్థితి అది. కొందరు స్నానాల గదుల గోడలపైనా నిద్రపోతూ కనిపించారు.

‘అయితే మకాలా జైలులో వీఐపీల సెల్‌లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. అక్కడ మంచం, కొద్దిగా విశాలమైన స్థలం దొరుకుతాయి. కానీ చాలా కొద్దిమందికి మాత్రమే అవి దొరుకుతాయి’ అని బుజకేరా చెప్పారు.

వీఐపీ సెల్‌లో ఉండటానికి తనను 3 వేల అమెరికన్ డాలర్లు (సుమారు 2 లక్షల 50వేల రూపాయలు) అడిగారని.. తాను 450 అమెరికన్ డాలర్లు (సుమారు 38 వేల రూపాయలు) ఇచ్చి ఆ సౌకర్యాలు పొందానని బుజకేరా చెప్పారు.

‘మకాలాలో వార్డెన్ల ప్రమేయం తక్కువగా ఉంటుంది. జైలు లోపల శాంతిభద్రతల నిర్వహణను ఖైదీలకే అప్పగిస్తారు. ఖైదీలు వారిని వారే పాలించుకుంటారు’’ అని మానవ హక్కుల కార్యకర్త ఫ్రెడ్ బౌమా చెప్పారు.

మార్చి 2015 నుంచి ఆగస్టు 2016వరకు మకాలా జైలులో గడిపిన ఆయన ఈ వారం బీబీసీ ఫోకస్ ఆన్ ఆఫ్రికా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు.

ఖైదీల స్వయంపాలన వారి మధ్య గొడవలకు, హింసకు దారితీస్తోందని బుజకేరా చెప్పారు.

Makala Prison

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, మకాలా

డీఆర్ కాంగోలో ఒక్క మకాలా జైలే కాదు, ఆ దేశంలోని అన్ని జైళ్లు ఇలాగే పరిమితికి మించి భారీ సంఖ్యలో ఖైదీలతో, నిధుల కొరతతో దుర్భర స్థితిలో ఉన్నాయి.

‘వరల్డ్ ప్రిజన్ బ్రీఫ్ ప్రాజెక్ట్’ ప్రకారం ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే జైళ్లలో డీఆర్ కాంగో జైళ్లు ఆరో స్థానంలో ఉన్నాయి.

ఇటీవల ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నించిన సందర్భంలో డిప్యూటీ జస్టిస్ మినిష్టర్ సామ్యూల్ ఎంబెంబా మాట్లాడుతూ.. జైళ్లలో రద్దీ పెరిగిపోవడానికి మేజిస్ట్రేట్లు కారణమని నిందించారు. కేసుల్లో అనుమానితులను కూడా జైలుకు పంపుతున్నారు అని ఆయన అన్నారు.

నిజానికి చాలామంది ఖైదీలు నేరారోపణ రుజువై శిక్ష అనుభవించడం లేదు. కేవలం విచారణ కోసం ఎదురుచూస్తూ జైల్లో గడుపుతున్నారు.

డీఆర్ కాంగో జైళ్లలో ఆహారంపైనా విమర్శలు ఉన్నాయి.

మకాలాలో ఖైదీలకు ఒక్కపూటే భోజనం పెడతారు. కూరలలో పోషకాహార విలువలు చాలా తక్కువగా ఉంటాయి.

బుజకేరా తీసిన చిత్రాలు అక్కడ అందించే ఆహారంలో నాణ్యత లోపాన్ని బయటపెట్టాయి. ఈ ఆహారం తినలేక చాలామంది ఖైదీలు తమ బంధువులు తీసుకొచ్చే భోజనంపై ఆధారపడతారు. కానీ అందరికీ ఇలాంటి అవకాశం ఉండదు.

మకాలా జైలులో 17మంది ఖైదీలు ఆకలితో చనిపోయారని 2017నాటి ఓ నివేదిక పేర్కొంది.

ఇలాంటి కఠిన పరిస్థితులే ఖైదీలకు తప్పించుకోవాలనే ఆలోచన కలిగిస్తున్నాయని మాన్‌కేటా చెప్పారు.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కొత్త జైళ్లను నిర్మించాలని, ప్రస్తుత జైళ్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని ఆయన అధికారులను కోరారు.

ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న బుజకేరా ఈ మార్పు త్వరగా జరగాలని కోరుకుంటున్నారు.

‘ఇదొక రోగగ్రస్థ న్యాయ వ్యవస్థ. చికిత్స కోసం ఎదురుచూస్తూ ఇందులోని జనం చనిపోతున్నారు’ అని బుజకేరా చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)