భోపాల్లో 90 డిగ్రీల మలుపుతో రైల్వే వంతెన నిర్మించిన ఇంజినీర్లు సస్పెన్షన్

ఫొటో సోర్స్, Shuraih Niazi
భోపాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ)ని 90 డిగ్రీ మలుపుతో నిర్మించిన ఇంజినీర్లపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కు చెందిన ఇద్దరు చీఫ్ ఇంజినీర్లు సహా ఏడుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేసింది.
"ఐష్బాగ్ పై వంతెన నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశించాం. నివేదిక ఆధారంగా, ఎనిమిది మంది పీడబ్ల్యుడీ ఇంజినీర్లపై చర్యలు తీసుకున్నాం, ఒక రిటైర్డ్ సీఈపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాం" అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఎక్స్లో తెలిపారు. వంతెనను డిజైన్ చేసి, నిర్మించిన కంపెనీలను బ్లాక్ లిస్ట్లో పెట్టినట్లు చెప్పారు.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రూ. 18 కోట్లతో నిర్మాణం
ఈవంతెనను 18 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారని ఎన్డీటీవీ కథనం పేర్కొంది. మహామై కా బాగ్, పుష్పా నగర్, స్టేషన్ ఏరియాల నుంచి న్యూ భోపాల్కు రవాణా సులభతరం చేసే ఉద్దేశంతో ఈ వంతెనను నిర్మించారు.
అయితే, ఈ బ్రిడ్జి 90 డిగ్రీల మలుపుతో ప్రమాదకరంగా ఉండటం విమర్శలకు కారణమైంది. బ్రిడ్జికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై మీమ్స్, జోక్స్ వచ్చాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
సమీపంలోనే మెట్రో స్టేషన్ ఉండటం, భూమి కొరత వల్ల ఈ విధంగా వంతెనను నిర్మించామని అధికారులు బదులిచ్చారు. కొంచెం అదనపు భూమి లభించినా, 90 డిగ్రీల మలుపును వక్రంగా మార్చేవారమని తెలిపారు.
జూన్ 18న పీడబ్ల్యుడీ మంత్రి రాకేష్ సింగ్ ఏఎన్ఐ వార్తాసంస్థతో బ్రిడ్జి గురించి మాట్లాడుతూ "ఇది 5 సంవత్సరాల కిందట జరిగింది. దీని డ్రాయింగ్ డిజైన్ చాలాకాలం కిందటే నిర్ణయించారు" అన్నారు.
పునరుద్ధరణ కోసం కమిటీ
విచారణ కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా, బాధ్యులుగా తేలిన ఏడుగురిని సస్పెండ్ చేసింది. అలాగే ఒక రిటైర్డ్ ఇంజినీర్పై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
"బ్రిడ్జికి తప్పుడు డిజైన్ అందించిన నిర్మాణ సంస్థ, డిజైన్ కన్సల్టెంట్ రెండింటినీ బ్లాక్లిస్ట్లో పెట్టాం" అని సీఎం మోహన్ యాదవ్ ఎక్స్లో తెలిపారు.
ఆర్ఓబీ పునరుద్ధరణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశామని, పని పూర్తయిన తర్వాతే బ్రిడ్జిని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














