అమెరికాలో బ్రిడ్జ్ కూలిపోవడానికి కారణమైన నౌకలో భారతీయులు... దీనిపై కంపెనీ ఏమంటోంది?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో నౌక ఢీకొనడంతో భారీ వంతెనే కూలిపోయింది. ఆ వంతెనపై ప్రయాణిస్తున్న వాహనాలు నదిలో పడిపోయాయి.
మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ నగరంలో పటాప్స్కో నదిపై ఉన్న 'ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి' పిల్లర్లను డాలీ అనే ఓడ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.
నౌక సిబ్బందిలో 22 మంది భారతీయులు ఉన్నారు.
ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఎక్కువే ఉండొచ్చని బాల్టిమోర్ సిటీ అగ్నిమాపక శాఖ ప్రతినిధి కెవిన్ కార్ట్రైట్ అంచనా వేశారు.
సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని, నదిలో పడిన వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యాయని సీబీఎస్ న్యూస్తో కెవిన్ చెప్పారు.
ఈ ఘటనలో అదృశ్యమైన 6గురు చనిపోయినట్లుగా భావిస్తున్నామని అమెరికా అధికారులు వెల్లడించారు.

ఫొటో సోర్స్, StreamTimeLive
ప్రమాదం ఎలా జరిగింది?
ఈ నౌక బాల్టిమోర్ నుంచి శ్రీలంక వైపు వెళుతోంది. దానిలో కంటైనర్లు లోడ్ చేశారు. అర్ధరాత్రి దాటాక స్థానిక కాలమానం ప్రకారం 12.44 గంటలకు బాల్టిమోర్ పోర్ట్ నుంచి నౌక బయలుదేరింది.
ప్రయాణ సమయంలో వంతెన వెళ్లాల్సిన మార్గం నుంచి కాకుండా మరో వైపు మళ్లింది.
ఆ సమయంలో నౌకలో లైట్లు వెలుగుతూ ఆగుతూ కనిపించాయి. ఆ తర్వాత నౌక నుంచి పొగ వచ్చింది.
అలా వెళ్లి వంతెనను ఢీకొట్టింది. ఈ ఓడ అలా దారి ఎందుకు మళ్లిందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాద సమయంలో వంతెనపై కొందరు నిర్మాణ కార్మికులు ఉన్నారని అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాదాన్ని అంచనా వేయలేకపోతున్న అధికారులు
ఈ వంతెన అనేక భాగాలు ఇప్పటికీ నీటిలో మునిగి ఉన్నాయి. సంబంధిత నౌక సంఘటన స్థలంలోనే ఉంది.
ఈ నౌకలో అనేక కంటైనర్లు లోడ్ చేసి ఉన్నాయి.
రెస్క్యూ బృందాలు ఒక్కొక్కటిగా ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపడుతున్నాయి.
కానీ వాతావరణం బాగా చలిగా ఉండడం వల్ల సహాయ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, BALTIMORE FIRE STATION
నీటిలో తేలుతూ కనిపిస్తున్న జనం..
'ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి' ప్రమాదంలో మృతుల సంఖ్య ఎక్కువ ఉండొచ్చని బాల్టిమోర్ అగ్నిమాపక శాఖ ప్రతినిధి అంచనా వేస్తున్నారు.
ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉష్ణోగ్రత -1 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉందని ఆ అధికారి చెప్పారు. మరోవైపు ఈ ఘటనకు అసలు కారణం ఇంకా తెలియరాలేదు.
ఘటనపై బాల్టిమోర్లోని వివిధ విభాగాల సీనియర్ అధికారులు మీడియాతో మాట్లాడారు.
వంతెన వద్దకు సహాయక బృందం చేరిందని, కొందరు నీటిలో తేలుతూ కనిపిస్తున్నారని బాల్టిమోర్ సిటీ ఫైర్ డిపార్ట్మెంట్ చీఫ్ వాలెస్ చెప్పారు.
నీటిలో పడిపోయిన ఇద్దరిని రక్షించి బయటకు తీసుకొచ్చామని, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
''ఓడ దారి తప్పి వంతెనను సమీపించడంతో హెచ్చరిక జారీ అయింది. అనంతరం వంతెన వైపు వెళ్లే వాహనాలు ఆగిపోయాయి. దీంతో చాలామంది ప్రాణాలు నిలిచాయి'' అని మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ అన్నారు.
ఇది ఒక విషాదకర ప్రమాదమని బాల్టిమోర్ మేయర్ బ్రాండన్ స్కాట్ అన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఓడ నుంచి ఆయిల్ లీకేజీ జరిగిందా లేదా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నట్లు బ్రాండన్ స్కాట్ తెలిపారు.
ఈ ఘటనలో ఉగ్రవాద ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, REUTERS
షిప్ కంపెనీ ఏమంటోంది?
డాలీ (ఐఎంఓ 9697428) అనే ఈ నౌక సింగపూర్కు చెందిన 'సినర్జీ మెరైన్ గ్రూప్' కంపెనీకి చెందినది.
నౌకలోని సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నట్లు ఒక ప్రకటనలో ప్రకటించింది.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'క్వాలిఫైడ్ ఇండివిజువల్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ సర్వీస్' ఏర్పాటుచేశామని స్పష్టంచేసింది.
రిటైర్డ్ స్ట్రక్చరల్ ఐరన్ వర్కర్ ప్రిసిల్లా థామ్సన్ ఈ ప్రమాదం గురించి బీబీసీకి వివరిస్తూ కన్నీరుపెట్టుకున్నారు.
"ఈ ప్రమాదం ధాటికి నా ఇల్లు కదిలిపోయింది. ఇది చాలా బలమైన వంతెన" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆఫీసులోని తెల్ల కాగితం కూడా సొంతానికి వాడని 'భారత ప్రధాని'
- ఏపీ, తెలంగాణ మహిళలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం ఎలా ఉంది? మహిళా ఎంపీల సంఖ్య పెరిగిందా?
- ఈడీ ఎవరినైనా అరెస్టు చేయొచ్చా? అన్ని అధికారాలు ఎలా వచ్చాయి?
- ఆమె 58 ఏళ్ల వయసులో మళ్లీ తల్లయింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వివరణ కోరింది...చట్టం ఏం చెబుతోంది?
- మనిషి మెదడులోకి పురుగులు ఎలా వస్తాయి?
బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














