టైటానిక్: నాజీలు 80 ఏళ్ల కింద తీసిన సినిమా అంతా కట్టుకథలు, కుట్ర సిద్ధాంతాలేనా?

ఎస్‌ఎస్ క్యాప్ ఆర్కోనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1927లో ఎస్‌ఎస్ క్యాప్ ఆర్కోనా
    • రచయిత, ఫెర్నాండో డ్యూరెట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

టైటానిక్ సినిమా ఎవరైనా మర్చిపోగలరా? 1997లో జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో లియోనార్డో డికాప్రియో, కేట్ విన్‌స్లెట్ జంటగా నటించిన ఈ సినిమా అనేక ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. 

1912లో టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోవడం చరిత్రలో సంభవించిన పెను విషాదం.

ఈ ఘటన ఆధారంగా నాజీలు కూడా 80 ఏళ్ల క్రితం ఇలాంటి కథనే తెరకెక్కించారు. అందులో కూడా టైటానిక్ లాగే ఒక షిప్ సముద్రంలో మునిగిపోతుంది. ఈ సినిమాను నాజీలు తమ ప్రచారానికి వాడుకున్నారు. బహుశా చాలా తక్కువమందికి ఈ సినిమా గురించి తెలిసి ఉండవచ్చు.

1942 ప్రారంభంలో, అతి విశాలమైన, లగ్జరీ సౌకర్యాలతో కూడిన ‌ఎస్‌ఎస్ క్యాప్ ఆర్కోనా (SS Cap Arcona) నౌక బాల్టిక్ సముద్రం తీరంలోని జర్మన్ నేవల్ బేస్‌లో పనిలేక తుప్పుపట్టి పోతూ ఉండేది.

ఈ నౌకను 'క్వీన్ ఆఫ్ సౌత్ అట్లాంటిక్' అని పిలిచేవారు.

అంతకు రెండేళ్ల క్రితం, అడాల్ఫ్ హిట్లర్ నౌకాదళం ఆ ఓడను స్వాధీనం చేసుకుని నౌకాదళ బ్యారక్‌గా మార్చింది. 

కానీ, ఆ సంవత్సరం క్యాప్ ఆర్కోనా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. టైటానిక్ షిప్ లాంటి డిజైన్ కలిగిన క్యాప్ అర్కోనా నౌకకు నాజీలు తాము నిర్మిస్తున్న చిత్రంలో ప్రధాన పాత్ర కల్పించారు.

నాజీ టైటానిక్ సినిమాలో ఓ దృశ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాజీ టైటానిక్ సినిమాలో ఓ దృశ్యం

ఈ సినిమాకు డబ్బు నీళ్లలా ఖర్చు చేశారు

ఆర్ఎమ్ఎస్ టైటానిక్ నౌక కథ తొలి ప్రయాణంలోనే ముగిసిపోయింది. 1912 ఏప్రిల్‌లో సౌతాంప్టన్ నుంచి న్యూయార్క్ బయలుదేరిన టైటానిక్ నాలుగు రోజుల్లో అట్లాంటిక్ మహాసముద్రంలో మంచుకొండను ఢీకొని నీళ్లల్లో మునిగిపోయింది.

1940ల నాటికి, అంటే నాజీలు సినిమా నిర్మాణానికి పూనుకున్న కాలానికి టైటానిక్ కథ చాలా పాతబడిపోయింది. అప్పటికే ఈ ఘటనపై ఎన్నో సినిమాలు వచ్చేశాయి. 1912లోనే పలు సినిమాలు విడుదల అయ్యాయి.

అయితే, హిట్లర్ ప్రోపగాండా మంత్రి జోసెఫ్ గోబెల్స్ టైటానిక్ ప్రమాదానికి కొత్త కోణాలు జోడించి ఓ కథ రాసుకొచ్చారు. బ్రిటన్, అమెరికాల దురాశ వల్లే ఆ ప్రమాదం జరిగినట్లు చిత్రీకరించారు. 

"అప్పటికే గోబెల్స్ పర్యవేక్షణలో నాజీలు వందలకొద్దీ ప్రోపగాండా చిత్రాలు నిర్మించారు. కానీ, ఈసారి ఇంకా కొత్తగా ఏదైనా చేయాలనుకున్నారు" అని 'ది నాజీ టైటానిక్' పుస్తకాన్ని రాసిన అమెరికన్ చరిత్రకారుడు ప్రొఫెసర్ రాబర్ట్ వాట్సన్ బీబీసీతో చెప్పారు.

"1942 నాటికి జర్మనీ యుద్ధంలో వెనుకబడిపోతోంది. అందుకే కొత్తగా ఏదైనా ప్రచారం చేసి, ముందుకు దూసుకెళ్లాలని గోబెల్స్ భావించారు" అని ఆయన చెప్పారు.

అదే ఏడాది 'కాసబ్లాంకా' అనే సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. ఫాసిస్ట్ వ్యతిరేక కథనంతో వచ్చిన ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ నాజీలకే విస్మయాన్ని కలిగించింది.

టైటానిక్ విషాదానికి నాజీ కోణాన్ని జోడించి ప్రత్యర్థులకు తమ సత్తా చూపాలనుకున్నారు గోబెల్స్.

"కాసబ్లాంకా చిత్రానికి సమాధానంగా రూపొందించిన ఆ చిత్రానికి డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేశారు. టైటానిక్ షిప్‌కు ప్రతిబింబం లాంటి క్యాప్ ఆర్కోనా నౌకను ఇందుకోసం వినియోగించారు. 

"ఈ రెండు నౌకలూ దాదాపు ఒకలాగే ఉంటాయి. ఒకే ఒక్క తేడా ఉంది. టైటానిక్‌కు నాలుగు పొగగొట్టాలు (చిమ్నీలు) ఉన్నాయి. క్యాప్ ఆర్కోనాకు మూడు ఉండేవి. కానీ నాజీల సినిమా కోసం దానికి ఒక నకిలీ చిమ్నీ తగిలించారు" అని ప్రొఫెసర్ వాట్సన్ వివరించారు.

జర్మనీ యుద్ధంలో సంక్షోభాలు ఎదుర్కొంటున్నప్పటికీ, గోబెల్స్ ఈ చిత్రానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు.

అప్పట్లో ఈ సినిమాకి జర్మన్ కరెన్సీలో 40 లక్షల బడ్జెట్ కేటాయించారని ప్రొఫెసర్ వాట్సన్ తన పుస్తకంలో రాశారు. నేటి కాలంలో ఇది 180 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1,471 కోట్లు)కి సమానం. అలా చూస్తే ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటి. 

ఈ చిత్రంలో అదనపు నటుల కోసం వందలాది జర్మన్ సైనికులను యుద్ధ రంగం నుంచి రప్పించారు. అలాగే ఆనాటి ప్రసిద్ధ జర్మన్ నటులు 'సిబిల్ ష్మిత్' వంటివారు ఈ సినిమాలో నటించారు. 

అయితే సినిమా నిర్మాణం అస్తవ్యస్తంగా సాగింది. సైనికులు ఇందులో నటించిన మహిళలను వేధించారని, మిత్రరాజ్యాలు ఈ చిత్రం సెట్స్‌పై బాంబులు వేయవచ్చన్న వార్తలు గుప్పుమన్నాయి.

ఇంతకన్నా తీవ్రమైన ఘటనలు జరిగాయి. చిత్ర దర్శకుడు హెర్బర్ట్ సెల్పిన్‌కు నాజీ అధికారులకు మధ్య పొరపొచ్చాలు తలెత్తాయి. అధికారులు సినిమా షూటింగ్‌లో తలదూరుస్తున్నారని హెర్బర్ట్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. గోబెల్స్ స్వయంగా హెర్బర్ట్‌ను విచారించారు. 

కొన్ని రోజుల తరువాత హెర్బర్ట్ జైలు గదిలో ఉరి వేసుకుని కనిపించారు.

చిత్ర దర్శకుడు హెర్బర్ట్ సెల్పిన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చిత్ర దర్శకుడు హెర్బర్ట్ సెల్పిన్‌

అసలు కథను మార్చి...

సినిమా ఎలాగోలా పూర్తయింది కానీ, కథ మారిపోయింది.

బ్రిటిష్ యజమానుల దురాశ ఫలితంగా టైటానిక్ మునిగిపోయినట్టు, నౌక సిబ్బందిలో ఉన్న ఒక జర్మనీ దేశస్థుడు.. అట్లాంటిక్ సముద్రంలో మంచు కొండ ఎదురైనప్పుడు నౌక వేగాన్ని తగ్గించి, దాన్ని కాపాడడానికి ప్రయత్నించినట్టు చిత్రీకరించారు.

"లాభాలను ఆర్జించాలన్న బ్రిటిష్ దురాశే టైటానిక్ ప్రమాదంలో 1500 మందికి పైగా ప్రజలు మరణించడానికి కారణం" అంటూ సినిమా చివర్లో జర్మన్ భాషలో ఓ సందేశాన్ని జతచేశారు. 

ఇలాంటి సందేశాలతో నాజీలు పలు ప్రోపగాండా చిత్రాలు నిర్మించారు. కానీ, ప్రచారం కోసం నాజీలు ఎంతకు తెగించగలరో ఈ టైటానిక్ చిత్రం చూపించింది. ఇలాంటి ప్రోపగాండా ద్వారా ప్రజలను తమవైపు లాక్కోగలిగితే యుద్ధంలో విజయం సాధించవచ్చని వారు భావించారు. తరువాత ఈ చిత్రం ఏమైందన్నది మరింత ఆసక్తికరం" అని జర్మన్ చరిత్రకారుడు అలెక్స్ వాన్ లూనెన్ అన్నారు. 

సినిమా పూర్తయిన తరువాత దాన్ని చూసి గోబెల్స్ తలకొట్టుకున్నారు. ఇంత డబ్బు ఖర్చు పెట్టి తీసిన సినిమాను జర్మనీలో ప్రసారం కాకుండా బ్యాన్ చేశారు.

సినిమాలో ఓడ మునిగిపోతున్న దృశ్యాలను ఎంత వాస్తవికంగా చిత్రీకరించారంటే, అవి జర్మన్ల గుండెల్లో గుబులు పుట్టించే ప్రమాదం ఉందని గోబెల్స్ భావించారు. అప్పటికే మిత్రదేశాల నుంచి ఎప్పుడు ఎక్కడ బాంబులు పడతాయోనన్న భయంతో జర్మన్లు జీవిస్తున్నారు.

"ఇంకో సమస్య ఏమిటంటే, చిత్రంలో ఓడ సిబ్బందిలో ఉన్న జర్మన్ ఆఫీసర్ పాత్ర తన పై అధికారుల మాట వినదు. వాళ్లు అనైతికంగా ప్రవర్తిస్తునారని భావించి, వాళ్ల ఆదేశాలు పాటించేందుకు నిరాకరిస్తాడు ఆ జర్మన్ ఆఫీసర్. వాస్తవంలో అలాంటి సందేశం జర్మన్ ఆఫీసర్లకు వెళ్లడం మంచిది కాదని నాజీలు భావించారు" అని వాన్ లూనెన్ వివరించారు. 

ఈ చిత్రాన్ని మొదట జర్మనీ ఆక్రమించిన ప్రాంతాలలో మాత్రమే విడుదల చేశారని, 1949లో నాజీ ఆర్కైవ్‌ల నుంచి ఈ సినిమాను సంగ్రహించిన తరువాత జర్మనీలో ప్రదర్శించారని వాట్సన్ తన పుస్తకంలో రాశారు.

"అందులో ఇచ్చిన సందేశం ఎలా ఉన్నా, టెక్నాలజీ పరంగా ఆకట్టుకునే రీతిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1958లో టైటానిక్ కథ ఆధారంగా వచ్చిన బ్రిటిష్ మూవీ 'ఎ నైట్ టు రిమెంబర్'లో నాజీ టైటానిక్ సినిమాలోని సీన్లు ఉపయోగించడమే అందుకు నిదర్శనం" అని ప్రొఫెసర్ వాట్సన్ అన్నారు.

నాజీ టైటానిక్ సినిమా పోస్టర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాజీ టైటానిక్ సినిమా పోస్టర్

వాస్తవంలో నాజీ ఓడ విషాదం

నాజీ టైటానిక్ సినిమా ఫ్లాప్ అయిన తరువాత, క్యాప్ ఆర్కోనా నౌక ఓడరేవుకు చేరుకుని ఉండాల్సింది. కానీ, చరిత్రలో అది మరింత అపఖ్యాతి పాలైంది. 

తూర్పు వైపున ముందుకు వస్తున్న రష్యా దళాల నుంచి 25,000 మంది జర్మన్ సైనికులు, పౌరులను రక్షించడానికి ఉపయోగించిన ఈ ఓడ 1945 నాటికి బాల్టిక్ తీరాన ఒక జైలులా మారింది.

నాజీలు తమ నేరాలకు ఆధారాలను తుడిచేయడానికి వివిధ ప్రాంతాలలోని 'కాన్సంట్రేషన్ క్యాంపు'ల నుంచి ఖైదీలను తీసుకొచ్చి ఈ ఓడలో దాచిపెట్టారు.

మే 3 నాటికి ఈ ఓడలో కనీసం 5,000 మంది బందీలు ఉండి ఉంటారని ఇరు పక్షాలు రికార్డులలో పేర్కొన్నాయని ప్రొఫెసర్ వాట్సన్ చెప్పారు. 

ఆరోజు బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఈ షిప్‌పై బాంబుదాడి చేసింది. క్యాప్ ఆర్కోనా సహా ఇతర నౌకలలో నాజీ ఆఫీసర్లు దాక్కుని ఉంటారని నిఘావర్గాల నుంచి సమాచారం అందడంతో బ్రిటిష్ సైన్యం బాంబు దాడి చేసినట్టు వాట్సన్ తన పుస్తకంలో రాశారు.

"ఈ దాడిలో ఒక 300 మంది మాత్రమే బతికి బట్ట కట్టి ఉంటారు. యుద్ధ చరిత్రలో అత్యంత భయంకరమైన ఘటనలలో ఇదీ ఒకటి" అని ఆయన అన్నారు. 

ఇంకో రెండు నౌకలపై కూడా దాడి జరిగింది. అది కూగా కలుపుకుని, మొత్తం 7,000 మంది చనిపోయి ఉండవచ్చని అంచనా.

జర్మనీ లొంగిపోవడానికి నాలుగు రోజుల ముందు క్యాప్ ఆర్కోనాపై భయంకరమైన దాడి జరగడం తీవ్ర విషాదం.

ఇవి కూడా చదవండి: