కుటుంబంలో 7గురు ఒకేరోజు ఆత్మహత్య...పోలీసులు ఏం చెప్పారు?

సూరత్‌లో సామూహిక ఆత్మహత్య

ఫొటో సోర్స్, SHEETAL PATEL/BBC

ఫొటో క్యాప్షన్, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం, అంబులెన్స్ సిబ్బంది

గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాలో ఒకే కుటుంబంలోని ఏడుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి, స్థానిక పోలీసు అధికారులు చెప్పిన ప్రాథమిక సమాచారం ప్రకారం..పాలన్‌పూర్‌లోని సిద్ధేశ్వర్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే సోలంకి కుటుంబానికి చెందిన వ్యక్తుల్లో ఆరుగురు విషపదార్థం మింగి చనిపోగా, ఒకరు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

చనిపోయిన వారిలో మనీష్ సోలంకి (37) ఫర్నీచర్ కాంట్రాక్టర్‌‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య రీతా(35), మనీష్ సోలంకి తండ్రి కనూ (72), తల్లి శోభన (70)తోపాటు 6 నుంచి 13 ఏళ్ల వయసు మధ్య ఉన్న ముగ్గురు పిల్లలు దీక్ష, కావ్య, కుశల్‌లు ఉన్నారు.

సోలంకి కుటుంబం రాసినదిగా భావిస్తున్న సూసైడ్ నోట్‌ను ఘటనా స్థలంలో గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.

ఆ లేఖలో రాసిన వివరాలను చూస్తే, ఆర్థిక సమస్యల కారణంతోనే సోలంకి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.

పోలీసులు ఏం చెప్పారంటే....

‘‘కుటుంబానికి పెద్దగా భావిస్తున్న మనీష్ సోలంకి ఫర్నీచర్ వ్యాపారి. 30 నుంచి 35 మంది ఆయన కింద పనిచేస్తున్నారు. శనివారం ఉదయం నుంచి మనీష్‌ను సంప్రదించేందుకు వారు ప్రయత్నించారు. కానీ స్పందన లేకపోవడంతో ఇంటికి వెళ్లి చూసి, పోలీసులకు సమాచారం అందించారు.

సూసైడ్ నోట్‌ను చూస్తుంటే వారికి ఎవరి దగ్గరి నుంచో డబ్బు అందాల్సి ఉందని, కానీ అందలేదని రాశారు. అయితే ఎవరి పేరూ ఆ లేఖలో రాయలేదు’’

సూరత్ డీసీపీ రాకేష్ బరోత్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో ఈ సంఘటనను ధ్రువీకరించారు.

“చనిపోయిన వారి దగ్గర సూసైడ్ నోట్ లభించింది. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలపై మేం దర్యాప్తు చేస్తున్నాం. ఆర్థిక సమస్యలే వల్లనే ఇలా చేసి ఉండొచ్చని భావిస్తున్నాం. తదుపరి విచారణలో పూర్తి విషయాలు తెలుస్తాయి” అని అన్నారు.

ఇవి కూాడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)