ఎలిహు యేల్: భారతీయులను బానిసలుగా మార్చి సంపన్నుడిగా ఎదిగిన ఈయన అసలు చరిత్ర ఏమిటి?

ఎలిహు యేల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 18వ శతాబ్దానికి చెందిన ఎలిహు యేల్ (మధ్య) చిత్రపటంలో ఒక బాల బానిసను చూడొచ్చు
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

యేల్ యూనివర్సిటీ తమ పూర్వ నాయకులు, దాతలకు బానిసత్వంతో ఉన్న సంబంధాల దృష్ట్యా గత నెలలో అధికారికంగా క్షమాపణలు చెప్పింది.

అప్పటినుంచి భారత్‌లో ‘‘ఎలిహు యేల్’’ అనే పేరు తెర మీదకు వచ్చింది. ఐవీ లీగ్ యూనివర్సిటీకి ఈయన పేరునే పెట్టారు.

17వ శతాబ్దంలో మద్రాస్ (ప్రస్తుత చెన్నై)లోని బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి యేల్ ఒక సర్వ శక్తిమంతమైన గవర్నర్-ప్రెసిడెంట్‌గా పనిచేశారు.

ఆయన ఇచ్చిన 1,162 పౌండ్ల విలువ చేసే బహుమతి ఆయనకు గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఆయన పేరును ఒక యూనివర్సిటీకి పెట్టేలా చేసింది.

‘‘ప్రస్తుతం దీని విలువ రూ. 2 కోట్ల పైమాటే’’ అని చరిత్రకారుడు, ప్రొఫెసర్ జోసెఫ్ యాన్నెల్లీ బీబీసీతో చెప్పారు.

బర్మింగ్‌హామ్‌లోని ఆస్టన్ యూనివర్సిటీలో ఆయన ఆధునిక చరిత్ర బోధిస్తారు. హిందూ మహాసముద్ర బానిస వ్యాపారంతో యేల్‌కు ఉన్న సంబంధాల గురించి ఆయన అధ్యయనం చేశారు.

నేటి ప్రమాణాల ప్రకారం చూస్తే, ఇదేమంత భారీ మొత్తం కాదు. కానీ, అది కాలేజీకి పూర్తిగా కొత్త భవనం నిర్మాణంలో సహాయపడింది.

యేల్ యూనివర్సిటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాలోని ప్రముఖ ఐవీ లీగ్ యూనివర్సిటీల్లో యేల్ ఒకటి

యేల్ యూనివర్సిటీ: బానిసల పాత్ర

ఒక మంచి అభిరుచి గల, పరోపకారి, మంచి వస్తువుల సేకర్త, చర్చిలు-చారిటీలకు ఉదారంగా విరాళాలు ఇచ్చే వ్యక్తిగా ఎలిహు యేల్‌కు ఒకప్పుడు పేరుండేది. కానీ, ఇప్పుడు ఒక వలసవాదిగా, భారత్‌ను దోచుకున్న వ్యక్తిగా, బానిసలతో వ్యాపారం చేసిన వ్యక్తిగా ఆయన పేరు వార్తల్లో నిలిచింది.

యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన చీకటి గతంపై పరిశోధన జరిగిన మూడేళ్ల తర్వాత ఆ యూనివర్సిటీ నుంచి ఇప్పుడు ఈ క్షమాపణ వచ్చింది. యేల్ చరిత్రకారుడు డేవిడ్ బ్లైట్ సారథ్యంలో ఒక పరిశోధక బృందం యూనివర్సిటీపై పరిశోధన చేసింది.

‘‘బానిసత్వంతో కూడిన యూనివర్సిటీ చరిత్ర, యేల్ భవన నిర్మాణంలో బానిసల పాత్ర, బానిసలు చేసిన శ్రమ అనేక మందిని ప్రముఖ నాయకులుగా తీర్చిదిద్దింది. వారు యేల్‌కు బహుమతులు అందించారు’’ అని యూనివర్సిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

క్షమాపణతోపాటు 448 పేజీలున్న ‘‘యేల్ అండ్ స్లేవరీ: ఎ హిస్టరీ’’ అనే పుస్తకాన్ని కూడా విడుదల చేశారు.

ఈ పుస్తకాన్ని ప్రొఫెసర్ డేవిడ్ బ్లైట్ రాశారు. బానిసత్వం నుంచి ఎలిహు యేల్ ఎంతగా లబ్ధి పొందాడో ఈ పుస్తకం వివరిస్తుంది.

‘‘హిందూ మహాసముద్రంలో బానిసల వాణిజ్యం పరిధి, పరిమాణాలు అట్లాంటిక్ బానిసల వ్యాపారంతో సరితూగాయి. అయితే, ఇది 19వ శతాబ్దం వరకు ఇది మరీ అంత విస్తృతం కాలేదు. కానీ, భారత ఉపఖండం లోపల, తీర ప్రాంతాల్లో, దీవుల్లో మానవుల వ్యాపారం అనేది చాలా పురాతనమైనది. ఈస్టిండియా కంపెనీ తరపున బానిసల విక్రయాలు, తీర్పులు, అకౌంటింగ్ పనులను యేల్ పర్యవేక్షించారు’’ అని ఆయన పుస్తకంలో రాశారు.

ఎలిహు యేల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈస్టిండియా కంపెనీ క్లరికల్ ఉద్యోగిగా 1672లో మద్రాసులోని తెల్లజాతీయుల కాలనీ ఫోర్ట్ సెయింట్ జార్జికి యేల్ వచ్చారు

హిందూ మహాసముద్రంలో జరిగిన బానిసల వాణిజ్యం ఎంత?

అట్లాంటిక్‌లో 400 ఏళ్లలో 120 లక్షల మంది బానిసల వాణిజ్యం జరిగిందని ప్రొఫెసర్ జోసెఫ్ యాన్నెల్లీ చెప్పారు. కానీ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో బానిసల వాణిజ్యం ఇంతకంటే ఎక్కువగా జరిగి ఉండొచ్చని ఆయన నమ్ముతున్నారు. ఎందుకంటే అట్లాంటిక్‌తో పోలిస్తే ఈ భౌగోళిక ప్రాంతం చాలా పెద్దది.

ఈ ప్రాంతం ఆగ్నేయాసియాతోపాటు మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలను కవర్ చేయడంతో పాటు ఇక్కడ చాలా కాలం పాటు వాణిజ్యం సాగిందని చెప్పారు.

ఈ యూనివర్సిటీ గతానికి సంబంధించిన పరిశోధన చాలా ముఖ్యమైనది. 1701లో కనెక్టికట్‌లోని న్యూ హావెన్‌లో ఏర్పాటైన యేల్ యూనివర్సిటీ, అమెరికాలో ఉన్నతస్థాయి విద్యను అందించే మూడో పురాతన విద్యా కేంద్రం. ఈ యూనివర్సిటీ పూర్వవిద్యార్థుల్లో పలువురు అమెరికా అధ్యక్షులుగా పనిచేశారు. ఇంకా విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ యూనివర్సిటీ నుంచే వచ్చారు.

ఎలిహు యేల్ 1713 నుంచి వందల థియాలజీ, లిటరేచర్, మెడిసిన్, హిస్టరీ, ఆర్కిటెక్చర్ పుస్తకాలతో పాటు కింగ్ జార్జ్‌1 చిత్రపటాన్ని, టెక్స్‌టైల్స్‌, ఇంకా ఇతర విలువైన బహుమతులను ఈ కాలేజీకి పంపినట్లు డాక్యుమెంట్‌లలో పేర్కొన్నారు.

ఈ బహుమతులన్నింటినీ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును మూడు అంతస్తుల కొత్త కాలేజీ భవనాన్ని నిర్మించడానికి వాడారు. ఈ భవనానికే ఆయన గౌరవార్థం ‘‘యేల్ కాలేజ్’’ అని పేరు పెట్టారు.

ఎలిహు యేల్ కుటుంబానికే చెందిన హిస్టారియన్ రోడ్నీ హోరాస్ యేల్ 19వ శతాబ్దంలో యేల్ జీవితచరిత్రను రాశారు.

యేల్ యూనివర్సిటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒకప్పుడు మద్రాస్ సెటిల్మెంట్ ఈస్టిండియా కంపెనీ హెడ్ క్వార్టర్స్‌గా ఉన్న ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి

పేరు మార్పు గురించి ప్రస్తావించని యూనివర్శిటీ

యేల్ కాలేజీకి ఎలిహు యేల్ ఇచ్చిన విరాళం ఆయన పేరును చిరకాలం నిలిచిపోయేలా చేసింది. ఎలిహు యేల్‌కు వారసులు లేకపోవడంతో, ఐవీ లీగ్ యూనివర్సిటీ ఆయన పేరును చిరస్థాయిగా మార్చింది.

యూనివర్సిటీ తన క్షమాపణలో, ‘‘వైవిధ్యాన్ని పెంచడానికి, సమానత్వానికి మద్దతు ఇవ్వడానికి, సమ్మిళిత, గౌరవపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహించడానికి కృషి చేస్తాం. జనాభాలో 30 శాతం నల్లజాతీయులున్న న్యూ హావెన్‌లో సమ్మిళిత ఆర్థిక వృద్ధికి తోడయ్యే చర్యలు చేపడతాం’’ అని చెప్పింది.

అయితే, పేరు మార్పు గురించి యూనివర్సిటీ ఎలాంటి ప్రస్తావనా చేయలేదు. దీనిపై వచ్చిన వాదనలను కూడా గతంలో యూనివర్సిటీ కొట్టిపారేసింది.

1649 ఏప్రిల్‌లో బోస్టన్‌లో జన్మించిన ఎలిహు యేల్, మూడేళ్ల వయస్సులో కుటుంబంతో కలిసి ఇంగ్లండ్‌కు తరలి వెళ్లారు. ఈస్టిండియా కంపెనీలో క్లరికల్ ఉద్యోగిగా 1672లో మద్రాసులోని తెల్లజాతీయుల కాలనీ ఫోర్ట్ సెయింట్ జార్జ్‌కు యేల్ వచ్చారు.

‘‘ఈస్టిండియా కంపెనీ ఇచ్చే జీతాలు చాలా తక్కువ. గవర్నర్లకు 100 పౌండ్ల (రూ.10,533) నుంచి అప్రెంటీస్‌లకు 5 పౌండ్ల (రూ.526) వరకు కంపెనీ ఇచ్చే జీతాలు హాస్యాస్పదంగా ఉండేవి’’ అని రోడ్నీ హోరాస్ యేల్ తన పుస్తకంలో రాశారు.

అందుకే ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులు ప్రైవేటు లాభం కోసం సొంతంగా అన్ని రకాల వాణిజ్యాలు చేసేవారని రోడ్నీతో పాటు ఇతర చరిత్రకారులు చెప్పారు.

యేల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎలిహు యేల్

మద్రాసులో ఆయనకు ఎలాంటి పేరుంది?

యేల్ చాలా త్వరగానే అనేక హోదాలకు ఎదిగి, చివరకు 1687లో గవర్నర్-ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. అయిదేళ్ల పాటు అంటే 1692 వరకు ఆయన ఈ పదవిలో ఉన్నారు. కంపెనీ నిధులను స్వలాభాలకు ఉపయోగించడం, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండటం వంటి కారణాలతో ఆయనను తర్వాత ఆ పదవి నుంచి తప్పించారు.

1699లో ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లేనాటికి 51 ఏళ్ల యేల్ అత్యంత సంపన్నుడిగా ఎదిగారు. క్వీన్స్ స్క్వేర్‌లోని గ్రేట్ ఆర్మాండ్ స్ట్రీట్‌లో ఆయన ఒక భారీ ఇల్లును నిర్మించి, అత్యంత విలువైన కళాఖండాలతో ఆ ఇంటిని నింపారు.

1721 జులైలో ఆయన మరణించినప్పుడు బ్రిటిష్ వార్తాపత్రికలు ఆయనను ‘‘విస్తృతమైన దాతృత్వానికి ప్రసిద్ధి చెందిన ఒక పెద్ద మనిషి’’గా అభివర్ణించాయి.

కానీ, మద్రాసులో ఆయనకు క్రూరుడిగా, దురాశపరుడిగా పేరుందని చరిత్రకారులు చెబుతారు.

యేల్ తర్వాత గవర్నర్ పదవిని అధిష్టించినవారు ఆయన గవర్నర్‌గా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని, ఆయన హయాంలో అనేక మంది కౌన్సిల్ సభ్యులు అసాధారణంగా చనిపోయారని ఆరోపించారు.

అనుమతి లేకుండా తనకు ఇష్టమైన గుర్రాన్ని స్వారీ చేసినందుకు గుర్రాల నిర్వహణ చూసుకొనే ఒక వ్యక్తి (స్టేబుల్ గ్రూమ్)’ను ఉరి తీసినట్లు యేల్‌పై ఆరోపణలు ఉన్నాయని రోడ్నీ హోరాస్ యేల్ రాశారు.

భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ అధికారి వైభవం

ఫొటో సోర్స్, HERITAGE IMAGE PARTNERSHIP LTD ALAMY

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ అధికారి వైభవం

‘యేల్ విజయవంతమైన బానిసల వ్యాపారి’

ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యంలో కొంత అనుమానం ఉంది. కానీ, ఆయన ప్రవృత్తిపరంగా చూస్తే ఇదేమీ విభేదించే అంశం కాదని రోడ్నీ పేర్కొన్నారు.

‘‘మద్రాసులో అధికారంలో ఉన్నప్పుడు ఆయన క్రూరత్వం, అహంకారం, దురాశలు బయటపడకుండా అక్కడి పరిసరాలు కచ్చితంగా చాలా పటిష్ఠ రక్షణ కల్పించేలా ఉంటాయి’’ అని రోడ్నీ రాశారు.

కానీ, బానిసల వ్యాపారంలో యేల్ పూర్వీకుల పాత్ర గురించి కూడా రోడ్నీ ప్రస్తావించారు. ఇతర చరిత్రకారులు, ఎలిహు యేల్ జీవితకథను రాసిన ఇతరులు కూడా ఈ వ్యాపారం గురించి ఆరోపించారు.

‘‘ఎలిహు యేల్ ఒక చురుకైన, విజయవంతమైన బానిస వ్యాపారి అని చెప్పందుకు దానితో విభేదించే అంశాలేమీ అందులో లేవు’’ అని ఫోర్ట్ సెయింట్ జార్జిలోని వలసవాద రికార్డులన్నీ పరిశీలించిన ప్రొఫెసర్ జోసెఫ్ చెప్పారు.

‘‘డబ్బు సంపాదనలో ఆయన సామర్థ్యం అపారమైనదని నేను చెప్పగలను. హిందూ మహాసముద్ర బానిస వ్యాపారానికి ఆయన ఇన్‌చార్జిగా పనిచేశారు. 1680లలో దక్షిణ భారతాన ఏర్పడిన వినాశకర కరవు పరిస్థితులను యేల్‌తోపాటు కంపెనీకి చెందిన ఇతర అధికారులు తమకు అనుకూలంగా వాడుకొని లబ్ధి పొందారు. వందల మంది బానిసల్ని కొనుగోలు చేసి వారిని సెయింట్ హెలెనాలోని ఇంగ్లిష్ కాలనీకి తరలించారు’’ అని ప్రొఫెసర్ జోసెఫ్ చెప్పారు.

‘‘బయటకు వెళ్లే ప్రతీ యూరప్ నౌకలో కనీసం 10 మంది బానిసల్ని పంపించాలని తీర్మానించిన ఒక సమావేశంలో యేల్ పాల్గొన్నారు. 1687లో కేవలం ఒక నెలలోనే ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుంచి 665 మందికిపైగా బానిసలను ఎగుమతి చేశారు. మద్రాస్ ఏరియా గవర్నర్-ప్రెసిడెంట్‌గా యేల్ ‘ప్రతీ నౌకకు 10 మంది బానిసలు’ అనే నియమాన్ని అమలు చేశారు’’ అని ఆయన వెల్లడించారు.

భారతదేశంలో భోజనం చేస్తున్న బ్రిటిష్ వారు

ఫొటో సోర్స్, DINODIA PHOTOS ALAMY

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో భోజనం చేస్తున్న బ్రిటిష్ వారు

ఆ చిత్రపటంలో ఏముంది?

యేల్ యూనివర్సిటీ మాజీ విద్యార్థి అయిన ప్రొఫెసర్ జోసెఫ్ మొదటగా దశాబ్దం కిందట బానిస వ్యాపారంతో యేల్ అనుబంధం గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. ఒక బానిస, గవర్నర్ యేల్‌కు వడ్డిస్తున్న చిత్రపటాన్ని చూసినప్పటి నుంచి బానిసత్వంతో యేల్ అనుబంధం గురించి జోసెఫ్ పరిశోధించడం మొదలుపెట్టారు.

బానిసత్వంతో యేల్‌కు ఉన్న సంబంధాన్ని చూపే అత్యంత హేయమైన సాక్ష్యాలలో ఈ ప్రముఖ చిత్రపటం ఒకటని జోసెఫ్ అన్నారు.

1719-1721 మధ్య చిత్రించిన ఈ పటం, యేల్‌తో పాటు మరో ముగ్గురు తెల్లజాతీయులకు ఒక బానిస సపర్యలు చేస్తున్నట్లు చూపిస్తోంది.

‘‘ఆ సమయంలో ఇంగ్లండ్‌ అంతటా బానిసలు వ్యాప్తి చెందారు. ఆ ఫోటో ఫ్రేమ్‌లో బానిస అయిన ఒక చిన్నారి, యేల్‌తో పాటు ఇతరులకు వైన్ అందించడం అనేది యేల్ రోజువారీ జీవితంలో బానిసలు ఒక భాగమనే సంగతిని తెలుపుతుంది’’ అని జోసెఫ్ అన్నారు.

యేల్ గవర్నర్‌గా ఉన్నప్పుడు మద్రాసు నుంచి బానిస వ్యాపారాన్ని నిషేధించాలని ఆదేశించిన నిర్మూలనవాది అనే వ్యాఖ్యలను జోసెఫ్ కొట్టిపారేశారు.

‘‘ఆయన బానిసత్వాన్ని అంతం చేయడానికి ప్రయత్నించారని చెప్పడం ఆయన అసలు చరిత్రను చెరిపివేసే ప్రయత్నమే అవుతుంది. మీరు అసలైన పత్రాలను చూస్తే, బానిస వ్యాపారాన్ని ఆపేయాలని కంపెనీకి చెప్పిన వ్యక్తి భారత్‌కు చెందిన మొఘల్ పాలకుడు అనే విషయం అర్థం అవుతుంది. కానీ, యేల్ వెంటనే మడగాస్కర్ నుంచి ఇండోనేసియాకు బానిసలను రవాణా చేయాలంటూ ఆదేశించారు.

బానిసత్వం, సామ్రాజ్యవాదానికి ప్రతిఘటన 15వ శతాబ్దంలో మొదలైంది. దీన్ని నిర్మూలించాలని కోరినవారు ఉన్నారు. కానీ, యేల్ మాత్రం కచ్చితంగా ఈ జాబితాలో లేరు’’ అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)