2024లో భారతీయ మహిళలు తీసిన ఈ సినిమాలు ప్రపంచం దృష్టిని ఎందుకు ఆకర్షిస్తున్నాయి?

బాలీవుడ్, సంతోష్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, పాయల్ కపాడియా, ఆమిర్ ఖాన్ , కిరణ్ రావు, లా పతా లేడీస్ All We Imagine As Light

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెండో అత్యున్నత పురస్కారం గెలుచుకున్న ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్ర దర్శకురాలు పాయల్ కపాడియా( ఎడమ నుంచి రెండో వ్యక్తి)
    • రచయిత, యాసిర్ ఉస్మాన్
    • హోదా, సినీ రచయిత

బాలీవుడ్ 2024లో క్లిష్ట పరిస్థితులలో ఉన్న సమయంలో, వైవిధ్యభరితమైన కథలతో భారతీయ మహిళలు రూపొందించిన చిన్న చిత్రాలు దేశీయంగానే కాక, అంతర్జాతీయంగాను పతాక శీర్షికల్లో నిలిచాయి.

భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ సినిమా 2024 మేలో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది.

అప్పటి నుంచి, ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ భారతీయ సినిమాకు బలమైన శక్తిగా మారింది. చలన చిత్రోత్సవాలు, అవార్డు ఫంక్షన్లలో సత్తా చూపిస్తోంది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్, టొరంటో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ వంటి ప్రసిద్ధ సంస్థలు ఈ సినిమాను ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రంగా నిర్ణయించాయి.

ఈ సినిమా ఉత్తమ దర్శకురాలితోపాటు రెండు గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లు దక్కించుకుంది.

ఈ ఏడాది బీబీసీ, న్యూయార్క్ టైమ్స్‌ రూపొందించిన ఉత్తమ చిత్రాల జాబితాలోనూ ఈ సినిమాకు స్థానం దక్కింది.

ఈ సినిమాకు తోడుగా ఇంకా అనేక సినిమాలు ఉన్నాయి.

డైరెక్టర్ సుచి తలతి దర్శకత్వం వహించిన ‘గాళ్స్ విల్ బి గాళ్స్’ సన్‌డాన్స్ చిత్రోత్సవంలో రెండు అవార్డులు గెలుచుకుంది. కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన ‘లాపతా లేడీస్’ ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ టాప్ టెన్ జాబితాలో రెండునెలలపాటు కొనసాగింది. ఈ సినిమాకు ఆస్కార్ అధికారిక ఎంట్రీ కూడా దక్కింది. (కానీ, అదివివాదంగా మారింది). అయితే లాపతా లేడీస్‌ సినిమా ఆస్కార్ అకాడమీ షార్ట్‌లిస్ట్‌లో చోటు సంపాదించలేకపోయింది.

బ్రిటిష్ ఇండియన్ డైరెక్టర్ సంధ్య సూరి నిర్మించిన హిందీ సినిమా సంతోష్ బ్రిటన్ నుంచి ఆస్కార్‌కు వెళ్లింది.

భారతీయ సినిమాకు లభించిన ఈ ఆకస్మిక విజయాలు అనూహ్యమైనవా, లేక ప్రపంచం చాలా కాలంగా ఎదురు చూస్తున్న మార్పులో భాగమా?

"ఇది ఆ రెండూ కావచ్చు" అని సినీ విమర్శకురాలు శుభ్రా గుప్తా చెప్పారు. ఈ సినిమాలేవీ "రాత్రికి రాత్రే తయారైనవి" కావన్నారు.

ఉదాహరణకు తీసుకుంటే, గాళ్స్ విల్‌బి గాళ్స్ సినిమా డైరెక్టర్ సుచి తలతి, సినిమా సహ నిర్మాత రిచా చద్దా కాలేజీలో ఉన్నప్పుడే ఈ సినిమా గురించి చర్చించుకున్నారు. "వాళ్లు ఈ సినిమా గురించి కొన్నేళ్లుగా పని చేస్తున్నారు" అని గుప్తా చెప్పారు.

"2024 ఈ సినిమాలు విడుదలైన సంవత్సరంగా మారడం, అవి అందరిలోనూ ఆలోచనలను రగిలించడం ఆనందం కలిగించే అంశం" అని ఆమె అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బాలీవుడ్, సంతోష్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, పాయల్ కపాడియా, ఆమిర్ ఖాన్ , కిరణ్ రావు, లా పతా లేడీస్ All We Imagine As Light

ఫొటో సోర్స్, Girls Will Be Girls

ఫొటో క్యాప్షన్, సుచి తలతి నిర్మించిన గాళ్స్ విల్ బి గాళ్స్ సన్‌డాన్స్ చిత్రోత్సవంలో రెండు అవార్డులు గెలుచుకుంది.

విశ్వజనీన కథలు

ఒంటరితనం, బంధాలు, లింగం, గుర్తింపు, కష్టాలను ఎదుర్కొని విజయం సాధించడం వంటి విశ్వజనీన అంశాల వల్ల ఈ చిత్రాలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.

మహిళల బలమైన గొంతుకగా, సంప్రదాయతేర స్త్రీవాద కథనాలతో ఈ సినిమాలు భారతీయ ప్రధాన సినిమా ఇంతవరకు నడవని దారులలో ప్రయాణిస్తున్నాయి.

‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ సినిమాను హిందీ, మరాఠీ, మలయాళంలో నిర్మించారు. ఈ చిత్రంలో ముంబయికి వలస వచ్చిన ముగ్గురు మహిళలు, దయ, తిరుగుబాటు, మానవ సంబంధాలకు ప్రతీకలుగా కథను నడిపారు. ఈ కథ ఒంటరితనం, సామాజిక రాజకీయ పరిధులు, హిందూ ముస్లిం సంబంధాలు, విశ్వాసాల గురించి షియాజ్( హ్రిదూ హరూన్)తో అను(దివ్యప్రభ) క్యారెక్టర్ల మధ్య బంధంలో చూపించారు.

తన చిత్రాల్లో మహిళలు ఆర్థికంగా స్వతంత్రులై ఉంటారని కపాడియా బీబీసీతో చెప్పారు. అయినప్పటికీ వారి వ్యక్తిగత జీవితాల్లో కొన్ని పరిమితులు ఉంటాయని, ప్రత్యేకంగా ప్రేమ విషయానికి వచ్చేసరికి అవి ఎదురవుతాయని ఆమె అన్నారు.

"నాకు సంబంధించినంత వరకు, భారతదేశంలో ప్రేమ సామాజిక అంశాలతో ముడిపడి ఉంటుంది. స్త్రీలను కులం, వంశం కుటుంబ గౌరవాన్ని నిలబెట్టేవారిగా చూస్తారు. ఆమె కులాంతర,లేదా మతాంతర వ్యక్తిని పెళ్లాడితే అదొక సమస్యగా మారుతుంది. ఇది మహిళలను నియంత్రించడానికి, వారిని ఎదగనివ్వకుండా చేయడానికి ఉపయోగించే విధానం అనిపిస్తుంది" అని ఆమె చెప్పారు.

తలతి తీసిన ‘గాళ్స్ విల్ బి గాళ్స్’ హిమాలయాలలోని ఒక బోర్డింగ్‌ స్కూల్‌లో చదువుతున్న యువతి కథ. ఈ పాత్రలో అమ్మాయిలు టీన్స్‌లో ఉన్నప్పుడు వారి ఆలోచనా ధోరణి, తిరుగుబాటు, తరాల మధ్య సంఘర్షణ లాంటివి కనిపిస్తాయి. పరిష్కరించలేని భావోద్వేగాలు, బలహీనతలతో బాధ పడుతున్న తన తల్లి అనీలతో ఆ యువతి సంబంధాల గురించి ఈ సినిమా చర్చిస్తుంది.

"ఇది కమింగ్ ఏజ్‌కు సంబంధించిన సినిమా. ఇప్పటి వరకు ఇండియాలో ఇలాంటివి రాలేదు. ఇది మహిళలను సానుభూతి, ఆర్థ్రత కోణంలో చూస్తుంది" అని గుప్తా చెప్పారు.

"కమింగ్ ఏజ్ అంటే ప్రేక్షకులు తమ శరీరం, మనసు లాంటి వాటితో సంబంధం ఉన్నా లేకున్నా భావోద్వేగాలను అనుభూతి చెందడం, ఇలాంటిది భారతీయ ప్రధాన స్రవంతి సినిమాల్లో ఎప్పుడూ లేదు" అని ఆమె చెప్పారు.

బాలీవుడ్, సంతోష్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, పాయల్ కపాడియా, ఆమిర్ ఖాన్ , కిరణ్ రావు, లా పతా లేడీస్ All We Imagine As Light

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కిరణ్‌రావు (కుడి) లాపతా లేడీస్‌ చిత్రంలో కొత్తవారు ప్రధాన పాత్రలలో నటించారు.

ఆస్కార్‌కు బ్రిటన్‌ నుంచి ‘సంతోష్’

కిరణ్ రావు నిర్మించిన లాపతా లేడీస్ కలెక్షన్ల విషయంలో నిరాశ పరిచినా, ఈ సినిమాకు మంచి రివ్యూలు విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుత సమయం "నిజంగా ఇది భారతదేశంలో మహిళలకు ప్రత్యేకం" అని డిసెంబర్‌లో లండన్‌లో జరిగిన బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్‌రావు చెప్పారు.

పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు వారు వేసుకున్న ముసుగు కారణంగా తారుమారు కావడంతో జరిగిన సంఘటనల మీద వేసిన వ్యంగ్యాస్త్రం లాపతా లేడీస్ సినిమా. ఇది పితృస్వామ్వం, గుర్తింపు, లింగపరమైన గుర్తింపు పై సునిశిత వ్యాఖ్య లాంటిది. అనేక ఏళ్లుగా పురుషుల కేంద్రంగా నడుస్తున్నభారతీయ సినిమాలో ఇదొక మార్పు అనుకోవచ్చు.

"మనలో చాలా మంది ఆలోచనలను పితృస్వామ కేంద్రంగా ఉంటాయి. మనల్ని కూడా అలాగే ఆలోచించేలా పెంచారు" అని బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చెప్పారు. లాపతా లేడీస్‌కు సహ నిర్మాత. "మనం కూడా అర్థం చేసుకోవాలి. కనీసం ఒకరికొకరు సాయం చేసుకోవాలి. అలాంటి ఆలోచనాధోరణి నుంచి బయటకు రావాలి" అని చిత్ర ప్రదర్శన తర్వాత అమీర్ ఖాన్ వ్యాఖ్యానించారు.

ఈ ఏడాదిలో బాగా ఆనందం కలిగించే వార్త బ్రిటన్ నుంచి వచ్చింది. బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్య సూరి దర్శకత్వం వహించిన ‘సంతోష్’ అనే హిందీ సినిమా బ్రిటన్ నుంచి ఆస్కార్‌కు వెళ్లింది. ఈ చిత్రం మొత్తం 44 రోజుల షెడ్యూల్‌లో ఇండియాలోనే చిత్రీకరించారు. సినిమా నిర్మాణంలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. భారతీయ నటులు షహానా గోస్వామి, సునీత రాజ్‌భర్ నటించిన ‘సంతోష్’ సినిమాకు బ్రిటన్‌, ఇండియా, జర్మనీ, ఫ్రాన్స్‌లో ప్రజలు, సంస్థలు సహ నిర్మాతలుగా ఉన్నారు.

మహిళల మీద హింసకు వ్యతిరేకంగా పకడ్బందీ కథనంతో రూపొందిన చిత్రం ఇది.

‘సంతోష్’, ‘ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్రాల విజయం సరిహద్దులను కలుపుతూ సినీ పరిశ్రమలను విస్తరింపజేస్తాయని గోస్వామి చెప్పారు.

"భారతీయ చిత్రాలకు సాంస్కృతిక సందర్భం అవసరమని మనం తరచూ అనుకుంటాం. అలాంటిదేమీ లేదు. భావోద్వేగాలతో కూడిన ఏ సినిమా అయినా, అది ఎక్కడ నుంచి వచ్చిందనే దానితో సంబంధం లేకుండా అంతర్జాతీయంగా ప్రతిధ్వనిస్తుంది" అని ఆమె బీబీసీతో చెప్పారు.

బాలీవుడ్, సంతోష్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, పాయల్ కపాడియా, ఆమిర్ ఖాన్ , కిరణ్ రావు, లా పతా లేడీస్ All We Imagine As Light

ఫొటో సోర్స్, Santosh

ఫొటో క్యాప్షన్, షహానా గోస్వామి నటించిన ‘సంతోష్’ బ్రిటన్ నుంచి ఆస్కార్‌ పోటీలోకి ప్రవేశించింది.

‘ఆల్ విమ్ ఇమాజిన్ యాజ్ లైట్’, ‘గాళ్స్ విల్ బి గాళ్స్’ , ‘సంతోష్’ ఈ మూడు సినిమాలకు ఒక సాధారణ లక్షణం ఉంది. ఈ చిత్రాల నిర్మాణంలో భారతీయేతర సంస్థల పాత్ర ఉంది.

రానున్న రోజుల్లో ఈ విధానం కీలకంగా మారవచ్చని గోస్వామి అంగీకరించారు.

"ఉదాహరణకు ఒక సినిమా కథ ఫ్రెంచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తే, ఆ చిత్ర నిర్మాణ బృందం ఫ్రెంచ్ నిర్మాత కోసం ప్రయత్నించవచ్చు, ఇది సినిమా పరిశ్రమను మరింత విస్తరించేలా చేస్తుంది. ఇది సినిమాను ప్రపంచ ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళుతుంది" అని గోస్వామి అన్నారు.

బాలీవుడ్‌లోనూ మహిళలు ప్రధాన పాత్రలుగా ఉన్న చిత్రాలు ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకున్నాయి. హారర్ కామెడీ చిత్రం ‘స్త్రీ’ సీక్వెల్ ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో ఉంది.

ఓటీటీల్లో సంజయ్ లీలా భన్సాలీ, నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి నిర్మించిన హీరామండీ స్వాతంత్య్రానికి ముందున్న పరిస్థితులకు అద్దం పట్టింది. ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన టీవీ షోస్‌లో ఇది ఒకటి.

ఈ విజయాలు ఇలాంటి కథల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారని చెబుతున్నాయి. మెయిన్ స్ట్రీమ్ సినిమా కూడా వినోదాన్ని పంచుతూనే సమస్యల్ని ప్రస్తావించవచ్చని చెప్పడానికి ఇవి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

వ్యవస్థాపరమైన సవాళ్లను తట్టుకుని, 2024 భారత్ నుంచి మహిళల స్వరానికున్న బలాన్ని , వైవిధ్యభరితమైన కథల ప్రాధాన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు, సినిమాలను విస్తృత పరిధిలోకి తీసుకెళ్లడానికి, వైవిధ్యభరితమైన కథలకు మార్గం సుగమం చెయ్యడానికి ఇది కీలకమైన తరుణం కావచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)