నోబెల్ ప్రైజ్ డిసీజ్: నోబెల్ అందుకున్న తర్వాత కొంతమంది శాస్త్రవేత్తల వింత ప్రవర్తనకు కారణం ఇదేనా?

నోబెల్ ప్రైజ్ డిసీజ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లారా ప్లిట్
    • హోదా, బీబీసీ న్యూస్

కొంతమంది దీన్ని నోబెల్ డిసీజ్ అని పిలుస్తారు. మరికొందరు నోబెల్ ఎఫెక్ట్ అంటారు. ఇంకొందరు నోబెల్ సిండ్రోమ్ అని పిలుస్తారు. నోబెలైటిస్ అని కూడా అంటారు.

నోబెల్ బహుమతి తీసుకున్న అందరికీ ఇది వస్తుందని చెప్పలేం. కానీ, స్వీడిష్ అకాడమీ నుంచి నోబెల్‌ను తీసుకున్న తర్వాత, చాలా మంది ఈ వ్యాధికి గురయ్యారు.

పియరె క్యూరీ (భౌతిక శాస్త్రం, 1903), శాంటియాగో ఆర్‌వై కజల్ (మెడిసిన్, 1906) నుంచి రిచర్డ్ స్మాలే (రసాయన శాస్త్రం, 1996), ల్యూక్ మాంటేనియర్ (మెడిసిన్, 2008) ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా పెద్దదే ఉంటుంది.

అసలు ఈ వ్యాధి ఏమిటి? ఇది మేధావులపై ఎలాంటి ప్రభావం చూపుతోంది?

నోబెల్ ప్రైజ్ డిసీజ్

ఫొటో సోర్స్, Getty Images

ఒక రంగంలో మేధావులు ఇతర రంగాల్లోనూ మెరుగైన నైపుణ్యాలు కలిగి ఉంటారని మనం భావించకూడదు.

‘‘మేధావులు కూడా కొన్ని తెలివి తక్కువ పనులు చేస్తారని ఎవరూ ఊహించరు. కానీ, కొందరు నోబెల్ బహుమతి గ్రహీతలు కొన్ని వింత ఐడియాలను, నమ్మకాలను విశ్వసిస్తుంటారు. ఇక్కడ సైన్స్, వివేచన మధ్య సన్నని గీత ఉంటుంది’’అని స్విట్జర్లాండ్‌లోని ఫ్రిబార్గ్ యూనివర్సిటీలో ల్యాబొరేటరీ ఆఫ్ కాగ్నిటివ్ అండ్ న్యూరోలాజికల్ సైన్సెస్ పరిశోధకుడు సెబాస్టియన్ డీక్రూజ్ చెప్పారు.

ఇలా అసలు వివేచన అనేదే కనిపించని సిద్ధాంతాలను నమ్మే నోబెల్ గ్రహీతల సంఖ్య ఎక్కువే ఉంటుందని ఎమొరీ యూనివర్సిటీ పరిశోధకుడు షాన బోవెస్ కూడా చెప్పారు. ‘‘ఇక్కడ వీరి మేధస్సు ఒక రంగానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. దీన్ని అన్నింటికీ వర్తించే మేధస్సుగా మనం చూడలేం’’అని ఆయన అన్నారు.

అంటే ఒక వ్యక్తికి జీవశాస్త్రం, చరిత్ర, సైకాలజీ ఇలా ఏదో ఒక రంగంలో అద్భుతమైన మేధస్సు ఉండొచ్చు. కానీ, ఖగోళ శాస్త్రం, అంతరిక్షం లాంటి ఇతర రంగాల్లోనూ వీరికి మేధస్సు ఉంటుందని మనం భావించకూడదు. అంటే తమ పరిధికి అవతల ఉండే అంశాలపై వీరిలో కొన్ని వివక్షలు లేదా అభ్యంతరకరమైన ఆలోచనలూ ఉండొచ్చు.

 ఫ్రెడ్రిక్ బెంటింగ్‌

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఇక్కడ ప్రతిదాన్ని విమర్శనాత్మక ధోరణిలో చూడటానికి చాలా శ్రమ అవసరం. అందుకే కొన్నింటిని ఉన్నది ఉన్నట్లుగానే నమ్మాల్సి రావొచ్చు’’అని బోవెస్ చెప్పారు.

ఈ వ్యాధితో బాధపడేవారి గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే.. ఒక రంగంలో మేధస్సు ఉన్నంత మాత్రన వారు వింత సిద్ధాంతాలను నమ్మరని అనుకోకూడదు.

‘‘విమర్శనాత్మక ధోరణి అనేది మేధస్సు కంటే భిన్నమైనదని ఇప్పటికే చాలా పరిశోధనలు నిరూపించాయి’’అని బోవెస్ వివరించారు.

‘‘మేధస్సు అనేది మనం సమస్యలను పరిష్కరించేందుకు, సమాచారాన్ని సేకరించేందుకు ఉపయోగపడుతుంది. అదే విమర్శనాత్మక ధోరణి (క్రిటికల్ థింకింగ్) ఆ సమాచారంతో మనం ఏం చేయబోతున్నామో చెబుతుంది. ఆ సమాచారం నుంచి మనం ఏం అర్థం చేసుకుంటామో వివరిస్తుంది’’అని బోవెస్ చెప్పారు.

‘‘మేధస్సు అనేది మనం విమర్శనాత్మక ధోరణితో ఆలోచించేందుకు తోడ్పడుతుంది. అయితే, ఇక్కడ మేధస్సు కలిగిన అందరూ విమర్శనాత్మక ఆలోచనాపరులు అనుకుంటే పొరపాటే. ఇక్కడ భావోద్వేగాలు, మనసులో మాటలు కూడా బయటకు వస్తాయి’’అని బోవెస్ వివరించారు.

వీడియో క్యాప్షన్, అభిజిత్ బెనర్జీ: చెడ్డ విధానాలను ప్రొఫెషనల్‌గానే విమర్శిస్తా.. నాకు రాజకీయాలేవీ లేవు

చెల్లించుకునే మూల్యం

ఒక్కోసారి మన ఊహకు అందని అంశాలపై మాట్లాడేటప్పుడు కూడా మనం గట్టిగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతుంటామని కెనడాలోని టొరంటో యూనివర్సిటీ క్లినికల్ బయోకెమెస్ట్రీ ప్రొఫెసర్ ఎల్‌ఫేతెరియోస్ డియామెండిస్ చెప్పారు. నోబెల్ బహుమతి గ్రహీతల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అన్నారు.

‘‘ఇతర అవార్డులతో పోలిస్తే, నోబెల్ చాలా ప్రత్యేకమైది. దీనికంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. దీని వల్ల శాశ్వత గుర్తింపు వస్తుంది. ఒకసారి నోబెల్ ప్రైజ్ వస్తే ప్రపంచం మొత్తం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది’’అని ఆయన బీబీసీతో చెప్పారు.

‘‘ఈ గుర్తింపు అనేది అవార్డు గ్రహీతలపై చాలా భిన్నమైన ప్రభావం చూపుతుంది. వారికి సమాజంలో ఒక సెలబ్రిటీ హోదా లభిస్తుంది. దీని వల్ల కొందరికి నోబెల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, అందరిపైనా దీని ప్రభావం ఉండకపోవచ్చు. కానీ, కొందరు మాత్రం తమకు ఏమాత్రం పరిచయంలేని ప్రాజెక్టులను కూడా చేపడతారు’’అని డియామెండిస్ వివరించారు.

దీనికి ఉదాహరణగా మనం ఫ్రెడ్రిక్ బెంటింగ్‌ను చెప్పుకోవచ్చని ఆయన చెప్పారు. ‘‘1900ల్లో బెంటింగ్ ఇన్సులిన్‌ను కనుగొన్నారు. మధుమేహ రోగులకు ఆయన దీనితో కొత్త చికిత్సను అందుబాటులోకి తీసుకురాగలిగారు. ఆ తర్వాత క్యాన్సర్‌ను కూడా ఇలానే నయం చేయొచ్చని ఆయన భావించారు’’అని డియామెండిస్ చెప్పారు.

‘‘ఆయన చాలా ప్రయత్నించారు. నిజానికి క్యాన్సర్‌ గురించి ఆయనకు తెలిసినది చాలా తక్కువ. దీంతో ఆయన విజయం సాధించలేకపోయారు’’అని డియామెండిస్ వివరించారు.

నోబెల్ డిసీజ్ అనేది తమను తాము అతిగా నమ్ముడం(నార్సిస్టిక్ బిహేవియర్)గా చెప్పుకోవచ్చని డియామెండిస్ చెప్పారు. దీన్ని ఒక మానసిక వ్యాధిగా ఆయన వివరించారు.

‘‘విపరీతమైన ఆత్మాభిమానం, అహంకారం, అతి ఆత్మవిశ్వాసం లాంటివి ఈ వ్యాధి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఫలితంగా వారికి సూపర్‌హ్యూమన్ పవర్‌లు ఉన్నట్లు వారు భావిస్తారు. తమకు ఎదురైన ఎలాంటి సమస్యకైనా తాము పరిష్కారం చూపగలమని వారు భావిస్తారు’’అని ఆయన చెప్పారు.

నోబెల్ డిసీజ్‌తో బాధపడిన కొందరు ప్రముఖులు వీరు..

లీనస్ పౌలింగ్

ఫొటో సోర్స్, Getty Images

లీనస్ పౌలింగ్ (1901-1994)

అమెరికాకు చెందిన లీనస్ రెండు నోబెల్ బహుమతులు గెలుచుకున్నారు. రసాయన శాస్త్రంలో 1954, 1962లో ఈ బహుమతులు ఆయన పొందారు. కెమికల్ బాండ్స్, మాలిక్యులర్ స్ట్రక్చర్‌, క్వాంటమ్ మెకానిక్స్‌లపై ఆయన పరిశోధన చేపట్టారు. అయితే, ఆ తర్వాత తన పరిశోధనలను విటమిన్ సీతో క్యాన్సర్‌ను నయం చేయడంవైపు మళ్లించారు. ఆయన పరిశోధనల్లో చాలా ఎర్రర్‌లు కనిపించాయని తోటి పరిశోధకులు వెల్లడించారు.

జేమ్స్ వాట్సన్

ఫొటో సోర్స్, Getty Images

జేమ్స్ వాట్సన్ (1925)

అమెరికాకు చెందిన జేమ్స్‌కు 1962లో మెడిసిన్‌లో నోబెల్ బహుమతి అందింది. డీఎన్‌ఏ నిర్మాణంపై ఆయన చేపట్టిన పరిశోధన ఆధునిక సైన్స్‌లో ఒక కొత్త ఆలోచనా విధానానికి బాటలు పరించింది. అయితే, నల్లజాతి ప్రజలు తెలివి తక్కువవారని ఆయన భావించేవారు. ఆ జాతి ప్రజల్లో ఐక్యూ తక్కువవని ఆయన చెప్పారు. మరోవైపు భూమధ్య రేఖకు సమీపంలో నేరుగా సూర్యరశ్మి పడే ప్రాంతాల్లో ఉండేవారిలో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయని కూడా ఆయన వివరించేవారు.

ల్యూక్ మాంటేనియర్

ఫొటో సోర్స్, Getty Images

ల్యూక్ మాంటేనియర్ (1932-2022)

హెచ్ఐవీపై పరిశోధనకు గాను ఫ్రాన్స్‌కు చెందిన ల్యూక్‌కు 2008లో మెడిసిన్‌లో నోబెల్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత వైరస్, బ్యాక్టీరియాల నుంచి వెలువడే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ తరంగాలను గుర్తుపట్టగలిగే సామర్థ్యం మంచినీటికి ఉంటుందని ఆయన చెప్పారు. మరోవైపు పార్కిన్సన్స్‌కు బొప్పాయితో చికిత్స చేయొచ్చని చెప్పారు. కోవిడ్-19 వ్యాక్సీన్‌లను కూడా ఆయన విమర్శించారు.

ఐవర్ గీవెర్

ఫొటో సోర్స్, Getty Images

ఐవర్ గీవెర్ (1929)

భౌతిక శాస్త్రంలో 1973లో అమెరికాకు చెందిన ఐవర్‌కు నోబెల్ అవార్డు దక్కింది. అయితే, గ్లోబల్ వార్మింగ్ లాంటిదేమీ లేదని ఆయన అన్నారు. అసలు అది సమస్యేకాదని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, ఆల్‌ఫ్రెడ్ నోబెల్ ఎవరు? ‘ప్రజల చావుల’తో ఆయన చేసిన వ్యాపారం ఏంటి?

ఆలస్యంగా గుర్తింపే కారణమా?

మరోవైపు నిజానికి ఆ పరిశోధకులు సదరు ఆవిష్కరణను కనుగొన్న దశాబ్దాల తర్వాత సాధారణంగా నోబెల్ బహుమతి ఇస్తారు. అప్పటికి వారి మేధో సామర్థ్యం కొంత తగ్గే అవకాశం కూడా ఉంటుందని డియామెండిస్ చెప్పారు.

‘‘నోబెల్ బహుమతి తీసుకుంటున్న పరిశోధకుల సగటు వయసు 70 ఏళ్లు. అంటే అప్పటికే వారి వయసు చాలా అయిపోతుంది. అదే సమయంలో మనం నోబెల్ బహుమతిని వారి మేధస్సుకు ప్రతీకగా చూడకూడదు’’అని ఆయన అన్నారు.

‘‘కొన్నిసార్లు అదృష్టం వల్ల మనం కొత్త విషయాలను కనుక్కోవచ్చు. సరైనా మార్గంలో అనుకోకుండా వెళ్లినా కూడా కొత్త అంశాలను కనిపెట్టొచ్చు’’అని ఆయన అన్నారు.

‘‘మరోవైపు నోబెల్ బహుమతిని ఒక వ్యక్తి ఇవ్వడంపైనా విమర్శలు వస్తున్నాయి. నిజానికి మన దగ్గర పరిశోధనలు అనేవి కొంతమంది శాస్త్రవేత్తలు కలిసి చేపడతారు’’అని డియామెండిస్ చెప్పారు.

‘‘అన్నింటి కంటే పెద్ద సమస్య ఏమిటంటే.. ఈ శాస్త్రవేత్తలు ఒక అంశంపై లోతైన అవగాహన కలిగి ఉంటారు. అయితే, మిగతా అంశాలపై వీరి అవగాహన అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి’’అని ఆయన చెప్పారు.

‘‘అయితే, ఒక అంశంపై మనం ఒక కొత్త ఆవిష్కరణను కనుగొనడంతో ఇతర అంశాలపైనా మనకు మెరుగైన అవగాహన ఉంటుందని భావించకూడదు’’అని ఆయన అన్నారు. అలా చేస్తే, మనం కొన్ని అవమానాలు, ఇబ్బందికర పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి రావొచ్చని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)