సంధ్యా దేవనాథన్: విశాఖపట్నంలో చదివిన మెటా ఇండియా హెడ్ ‘చదువులో చురుకు, వాట్సాప్లో సైలెంట్ ’

ఫొటో సోర్స్, V.RajendraPrasad
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ)లో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన సంధ్యా దేవనాథన్ మెటా ఇండియా హెడ్, మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు.
ఆమె స్నేహితుడు, ఇంజనీరింగ్ బ్యాచ్మేట్ డాక్టర్ వి. రాజేంద్ర ప్రసాద్తో బీబీసీ మాట్లాడింది.
“1994-1998లో కెమికల్ ఇంజనీరింగ్కు చాలా డిమాండ్ ఉండేది. మెటా ఇండియా హెడ్గా నియమితులైన సంధ్యా దేవనాథన్ మా బ్యాచ్మేట్. మేమంతా ఏయూ కెమికల్ ఇంజనీరింగ్ 1994-98 బ్యాచ్ విద్యార్థులం. మా వాట్సాప్ గ్రూప్లో కామ్గా ఉండే సంధ్య, ఇప్పుడు మోటా ఇండియా హెడ్ కావడం చాలా హ్యాపీగా ఉంది” అని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బీబీసీతో చెప్పారు.
ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ అనకాపల్లిలోని ఏఎస్కే కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ కళాశాల ప్రిన్సిపాల్గా పని చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Dr V. RajendraPrasad
‘కెమికల్ ఇంజనీరింగ్ తర్వాత ఎంబీఏ’
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ఇండియా విభాగానికి హెడ్గా నియమితులైన సంధ్యా దేవనాథన్ జనవరి 1 నుంచి ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు.
విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సంధ్య, ఆ తర్వాత దిల్లీలో ఎంబీఏ చేశారని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
“మా బ్యాచ్లో మొత్తం 86 మంది విద్యార్థులం ఉండేవాళ్లం. అందులో యాక్టివ్ గా ఉండే బ్యాచ్లో సంధ్యా దేవనాథన్ కూడా ఒకరు. యూనివర్సిటీకి దగ్గర్లోని పెదవాల్తేరులో వాళ్లు ఉండేవాళ్లు. కోర్సు పూర్తయిన తర్వాత ఆమె ఎంబీఏ చేయడం కోసం దిల్లీ వెళ్లిపోయారు. ఆ తర్వాత వివిధ సంస్థల్లో పని చేస్తూ ప్రస్తుతం మెటా ఇండియా హెడ్ స్థాయికి ఎదిగారు. మా బ్యాచ్లో ఎక్కువ మంది అంటే 60 మందికి పైగా విదేశాల్లోనే ఉంటున్నారు” అని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.
‘వాట్సప్ గ్రూప్లో ఫస్ట్ టైమ్ స్పందించిన సంధ్యా దేవనాథన్’
‘‘మేం వివిధ రంగాల్లోని ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ మేమంతా కలిసి 2018లో AU Chemical Engineering 1994-1998 పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ గ్రూపులో సంధ్యా దేవనాథన్ చేరారు. అయితే ఆ గ్రూప్ క్రియేట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె అందులో ఒక్క పోస్టు చేయలేదు. ఏ పోస్టుకు రియాక్ట్ కాలేదు. కానీ, మెటా ఇండియా హెడ్గా సెలెక్టయ్యారని తెలియగానే మేమంతా ఆమెకు గ్రూపులో అభినందనలు తెలిపాం. ఆ అభినందనలకు ఆమె గ్రూపులో ఫస్ట్ టైమ్ స్పందించారు” అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Dr V.RajendraPrasad
సంధ్యా దేవనాథన్ స్నేహితులతో ఏమన్నారంటే...
“అందరికీ ధన్యవాదాలు. నేను ఈ ఫోన్ని ఎక్కువగా సైలెంట్లో ఉంచడంతో ఎక్కువగా స్పందించలేకపోతున్నాను. ఇండియా కోసం పని చేయడం నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను” అని సంధ్య వాట్సాప్ మేసేజ్లో పేర్కొన్నారని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.
రీయూనియన్కు ఆహ్వానం
‘2015లో విశాఖ వచ్చినట్లు ఆమె ఫేస్బుక్లో పోస్టు పెడితే చూశాం. ఆ తర్వాత మళ్లీ ఆమె నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. ఆ తర్వాత మేం 2018లో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తే అందులో కలిశారు. 1994-1998 బ్యాచ్ ఏయూ కెమికల్ ఇంజనీరింగ్ పాసవుట్లకు ఏడాదితో 25 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఒక రీయూనియన్ ఫెస్ట్ ప్లాన్ చేశాం. ఇంతలోనే మా బ్యాచ్మేట్ సంధ్యా దేవనాథన్ మెటా ఇండియా హెడ్గా నియమితులవ్వడం తెలిసింది. ప్రస్తుతం ఆమె సింగపూర్లో ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఇండియాలోనే ఉంటారు కాబట్టి మా రీయూనియన్ ఫెస్ట్కి ఆమెని ఆహ్వానిస్తాం” అని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.

ఫొటో సోర్స్, Dr V.RajendraPrasad
‘2016లో జాయినింగ్...2023కి ఇండియా హెడ్’
సంధ్యా దేవనాథన్ 2023 జనవరి 1 నుంచి మెటా ఇండియా హెడ్, వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరిస్తారు. మెటా ఇండియా హెడ్గా అజిత్ మోహన్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సంధ్యా దేవనాథన్ చేరనున్నారు.
2016లో సంధ్య మెటాలో చేరారు. క్రమక్రమంగా ఎదుగుతూ ఇప్పుడు మెటా ఇండియా హెడ్ స్థాయికి చేరారు.
ఇండియా హెడ్గా సంధ్యా దేవనాథన్ నియామకంపై మెటా ఒక ప్రకటన విడుదల చేసింది.
“సంధ్యా దేవనాథన్ కంపెనీ ఇండియా చార్టర్కు నాయకత్వం వహిస్తారు. భారత్ లో మెటా రెవెన్యూ గ్రోత్ పెంచడానికి దేశంలోని ప్రముఖ బ్రాండ్లు, క్రియేటర్లు, అడ్వెర్టైజర్లు, భాగస్వాములతో స్ట్రాటెజిక్ రిలేషన్షిప్ బలోపేతం చేసేందుకు కృషి చేస్తారు” అని ఆ ప్రకటనలో పేర్కొంది.
“ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలోని కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో చదువుకుని ఇప్పుడు మెటా ఇండియాకు హెడ్గా ఎదిగిన సంధ్యా దేవనాథన్ కు అభినందనలు తెలియచేస్తున్నాం” అని ఏయూ కెమికల్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ రాజు చదువుల బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- నళిని ఇంటర్వ్యూ : నా కళ్ల ముందే నన్ను ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేశారు
- రవీంద్ర జడేజా: ‘టీమిండియా క్రికెటర్ రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేయొచ్చా?’
- జాక్వలిన్ ఫెర్నాండేజ్: రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ‘మోసపోయిందా’ లేక ‘మోసపోయినట్లు నటించిందా’
- జీ20: షీ జిన్పింగ్ను చూడగానే లేచి వెళ్లి చేతులు కలిపిన మోదీ... ప్రతిపక్షాల విమర్శలు
- 21 ఏళ్లకే పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన యువతి.. ఈ యంగెస్ట్ సర్పంచ్ లక్ష్యం ఏంటో తెలుసా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
















