స్వర్ణం మనదే, కాంస్యం మనదే

ఫొటో సోర్స్, Andy Lyons/Getty Images
పారిస్ పారాలింపిక్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్హెచ్1 ఈవెంట్లో భారత క్రీడాకారులు సత్తా చాటారు.
అవని లేఖరా ఈ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించగా, మోనా అగర్వాల్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు.
దీంతో ఒకే ఈవెంట్లో ఇద్దరు భారత క్రీడాకారిణులు పతకాలు సాధించినట్లయింది.
పారాలింపిక్స్ క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అంతకుముందు టోక్యో పారాలింపిక్స్లో అవని చరిత్ర సృష్టించారు.
అదే ఒలింపిక్స్లో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3-పొజిషన్స్ SH1లో అవని కాంస్యం పతకం కూడా గెలుచుకున్నారు.
ఇప్పుడు అవని మరోమారు స్వర్ణం సాధించడంపై స్వదేశంలో హర్షం వ్యక్తమవుతోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది


ఫొటో సోర్స్, Getty Images
‘ఇండియన్ స్పోర్ట్స్వుమన్ ఆఫ్ ది ఇయర్' కు నామినేట్ అయ్యారు
చిన్నతనంలో జరిగిన ఒక పెద్ద కారు ప్రమాదంలో అవనికి నడుము నుంచి కింది భాగానికి పక్షవాతం వచ్చింది.
ఆ ప్రమాదం తరువాత, అవని తండ్రి ఆమెకు షూటింగ్ క్రీడను పరిచయం చేశారు.
అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు.
2021లో బీబీసీ నిర్వహించిన ‘ఇండియన్ స్పోర్ట్స్వుమన్ ఆఫ్ ది ఇయర్ 2021' కు అవని నామినేట్ అయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
పారాషూటింగ్ అవనికి మరో జీవితాన్ని ఇచ్చింది
అవని రాజస్తాన్లోని జైపుర్లో జన్మించారు. 10 ఏళ్ల వయస్సులో ఆమె ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అప్పటి నుంచి వీల్చెయిర్కే పరిమితమయ్యారు. పారాషూటింగ్ ఆమెకు మరో కొత్త జీవితాన్ని అందించింది.
ఆమె వెళ్లే షూటింగ్ రేంజ్లో వికలాంగుల కోసం ర్యాంప్ కూడా లేదు. దీంతో ఆమె స్వయంగా ర్యాంప్ను ఏర్పాటు చేశారు.
పారా షూటర్లు ఉపయోగించే పరికరాలు ఎక్కడ దొరుకుతాయో కూడా మొదట్లో అవనికి, ఆమె తల్లిదండ్రులకు తెలియదు.
అద్భుతమైన ఏకాగ్రత, పర్ఫెక్ట్గా ఉండాలనే తపన ఆమెను ఎంతో ప్రత్యేకంగా నిలుపుతాయి.
''వికలాంగ క్రీడాకారులు ఎవరి సానుభూతిని కోరుకోరు. వీల్చెయిర్లో కూర్చొని ఆడటం సులభంగానే ఉంటుందని ప్రజలు అనుకుంటారు. మేం కూడా సాధారణ క్రీడాకారుల తరహాలోనే కష్టపడుతున్నాం అని నేను అందరికీ చెప్పాలనుకుంటున్నా. మాకు కూడా సమాన అవకాశాలు దక్కాలి'' అని 'బీబీసీ స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ద ఇయర్' పురస్కారానికి నామినేట్ అయిన సందర్భంగా అవని అన్నారు.
జూనియర్, సీనియర్ స్థాయిల్లో ప్రపంచ రికార్డులతో ఆమె చరిత్ర సృష్టించారు. పారాషూటింగ్లో ఆమె రైజింగ్ స్టార్గా నిలిచారు.
అవని లక్ష్యాలు కేవలం క్రీడలకు మాత్రమే పరిమితం కాలేదు. అటు ట్రైనింగ్ షెడ్యూల్ను జాగ్రత్తగా నిర్వహించుకుంటూనే.. ఇటు ఐదేళ్ల న్యాయ విద్యను రాజస్తాన్ యూనివర్సిటీలో కొనసాగిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కెరీర్ మొదలు పెట్టిన స్వల్ప వ్యవధిలోనే పతకాల పంట
2021 డిసెంబర్లో మోనా అగర్వాల్ తన షూటింగ్ కెరీర్ను ప్రారంభించారు. షూటింగ్ కెరీర్ మొదలు పెట్టిన స్వల్ప వ్యవధిలోనే సత్తా చాటుతున్నారు.
మోనా రాజస్తాన్లోని సికర్లో జన్మించారు. తొమ్మిదేళ్ల వయసులో ఆమెకు పోలియో సోకింది. పోలియో వ్యాధి అడ్డంకులను అధిగమిస్తూ ఆమె తన విద్యను పూర్తి చేశారు. ఆర్ట్స్లో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఎల్పీయూ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రొగ్రామ్లో సైకాలజీలో మాస్టర్స్ చేస్తున్నారు.
2016లో ఆమె పారా అథ్లెటిక్స్పై ఫోకస్ పెట్టారు.
త్రో ఈవెంట్లలో రాష్ట్ర స్థాయిల్లో పాల్గొని, మూడు కేటగిరీల్లో స్వర్ణం సాధించారు. రాష్ట్ర స్థాయిలో పారా పవర్లిఫ్టింగ్లో పోటీ పడి పలు పతకాలను గెలుచుకున్నారు.
2019లో కెప్టెన్గా తాను నేతృత్వం వహించిన రాజస్తాన్ రాష్ట్ర జట్టు మహిళల తొలి నేషనల్ సిటింగ్ వాలీబాల్ చాంపియన్షిప్లో స్వర్ణం గెలుచుకుంది. అంతర్జాతీయ టోర్నమెంట్లకు ఎంపికైనప్పటికీ, ప్రెగ్నెన్సీ వల్ల పాల్గొనలేకపోయారు.
2021 డిసెంబర్లో మోనా ఇండివిడ్యువల్ స్పోర్ట్ ఈవెంట్లలో పాల్గొనాలని నిర్ణయించుకుని, రైఫిల్ షూటింగ్ను ఎంచుకున్నారు.
2022లో ఆమె రజత పతకం గెలుచుకున్నారు. 2023 మధ్యలో తన తొలి అంతర్జాతీయ ప్రపంచ కప్లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకం పొందారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)













