బ్రెజిల్: ‘సెల్మా పార్టీ’ పేరుతో పార్లమెంటు ముట్టడికి ఆహ్వానం.. ఆ ‘కోడ్ వర్డ్‌’ను ఎలా ప్రచారం చేశారు?

బ్రెజిల్ ఆందోళనలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, హన్నా జిల్బర్ట్, జులియానా గ్రాగ్నానీ
    • హోదా, గ్లోబల్ డిజిన్ఫర్మేషన్ టీమ్

జైర్ బోల్సొనారో మద్దతుదారులు వేలాది మంది ఆదివారం నాడు బ్రెజిల్ పార్లమెంటు, సుప్రీంకోర్టు, అధ్యక్ష భవనం మీద దాడిచేయటం చూసి ప్రపంచం నివ్వెరపోయింది.

ఈ విధ్వంసం రెండేళ్ల క్రితం అమెరికా పార్లమెంటు భవనం కాపిటల్ మీద జరిగిన దాడులను గుర్తు చేసింది.

బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తూ బోల్సొనారో మద్దతుదారులు ప్రభుత్వ భవంతులను ధ్వంసం చేశారు. బోల్సొనారోనే అసలైన విజేత అంటూ ఆందోళన చేశారు.

భద్రతా సంస్థలు, సోషల్ మీడియా మోడరేటర్ల కళ్లుగప్పి.. ఈ హింసాత్మక ఆందోళనలను ఎలా నిర్వహించారన్నది చర్చనీయాంశంగా మారింది.

దీనిపై బీబీసీ పరిశోధించింది.

బ్రెజిల్ ఆందోళనలు

ఫొటో సోర్స్, Reuters

‘పార్టీ’కి రావాలంటూ ఆహ్వానాలు

ఇటీవల బోల్సొనారో మద్దతుదారులు కొన్ని కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో అసలైన విజేత మాజీ అధ్యక్షుడు బొల్సొనారోనే అన్నది ఆ ప్రచారం సారాంశం.

బ్రెజిల్ పార్లమెంటు మీద దాడికి కొన్ని రోజుల ముందు ఈ ప్రచారం మరింత తీవ్రమైంది. దానితో పాటు ‘సెల్మా పార్టీ’కి హాజరు కావాలంటూ బ్రెజిల్ నిరసనకారులకు కోడ్ భాషలో ఆహ్వానాలు కూడా అందాయి.

‘సెల్మా’ అనే పదం పోర్చుగీస్‌ భాషలోని ‘సెల్వా’కు నకలు. బ్రెజిల్ సైన్యంలో యుద్ధ నినాదంగా ఈ పదాన్ని వాడుతారు.

ఈ దాడులు జరగడానికి నాలుగు రోజుల ముందు సోషల్ మీడియా టెలిగ్రామ్‌ గ్రూప్‌లలో ‘సెల్మా పార్టీ’కి చెందిన ఒక వీడియో వైరల్ అయింది.

పార్టీకి కావలసిన పదార్థాల గురించి ఈ వీడియోలో ఒక వ్యక్తి వివరించాడు. ‘యూనియన్‌’ బ్రాండ్ బ్రెజిలియన్ షుగర్, ఐదు పెద్ద మొక్కజొన్న పొత్తులు అవసరమని చెప్పాడు.

బ్రెజిల్‌లో మొక్కజొన్న పొత్తును ‘మిల్హో’ అంటారు. మిల్హావో అంటే ఒక మిలియన్ అని అర్థం. మొత్తంగా ఈ వీడియోలో ఇలాంటి సంకేత పదాలతో చెప్పిన విషయం ఏమిటంటే.. ఐదు మిలియన్ల మంది (50 లక్షల మంది) ఈ పార్టీకి (నిరసనలకు) రావాలని ఆహ్వానించారు.

బ్రెజిల్ ఆందోళనలు

ఫొటో సోర్స్, Reuters

సోషల్ మీడియా సెన్సార్ నుంచి ఎలా తప్పించుకున్నారు?

చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ హింసకు పిలుపునిచ్చే కంటెంట్‌ను నిషేధిస్తాయి.

కంటెంట్‌ను పరిశీలించి, అభ్యంతరకర అంశాలను తొలగించే సోషల్ మీడియా మోడరేటర్ల కళ్లుగప్పటానికి వీరు ఇలాంటి అన్యాపదేశ పదాలను (మెటఫర్లను) వాడారు.

టిక్‌టాక్ వీడియోలో ఒక మహిళ తాను రాజకీయాల నుంచి మాట్లాడనని, అలా మాట్లాడితే తన అకౌంట్‌ను తొలగిస్తారని చెప్పింది. కానీ ఆ వెంటనే ‘సెల్మా పార్టీ’ గురించి మాట్లాడింది. పార్లమెంటుపై దాడి అనంతరం ఆ వీడియోను తొలగించారు.

ఈ సెల్మా పార్టీ గురించి మాత్రమే కాక, బ్రెజిలియన్ ప్రజలు ఇతర పార్టీల గురించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

సావో పాలోలో సెల్మా కజిన్ ‘తెల్మా’ పార్టీ అని, ఆమె సోదరి ‘వెల్మా’ పార్టీ రియో డి జెనీరియోలో జరుగుతుందని ఆహ్వానాలు వచ్చాయి. ఇప్పటి వరకైతే, ఈ ఈవెంట్లు పెద్దగా ముందుకు సాగలేదు.

ట్విటర్‌లో గత వారమంతా #festadaselma వంటి హ్యాష్‌ట్యాగ్స్ వైరల్ అయ్యాయి.

పార్లమెంటు వెలుపల త్రీ పవర్స్ స్క్వేర్‌గా పిలిచే ప్రభుత్వ భవంతుల వద్ద ప్రజలు ఆందోళన చేసేందుకు, పిలుపునిచ్చేందుకు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను వాడారు.

బ్రెజిల్ ఆందోళనలు

ఫొటో సోర్స్, telegram

ట్విటర్ ఉద్యోగులను తొలగించడంతో..

ట్విటర్‌ను ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత.. బ్రెజిల్‌తో పాటు ప్రపంచ దేశాల్లో ఆ సంస్థ ఉద్యోగులపై వేటు వేశారు.

ఎన్నికల సమయంలో ట్విటర్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేలా చూసే ఉద్యోగులు కూడా అలా ఉద్వాసనకు గురయ్యారు.

ట్విటర్ వెబ్‌సైట్‌లో అత్యంత ప్రమాదకరమైన కంటెంట్‌ను తొలగించేందుకే కట్టుబడి ఉన్నామని ఆ సంస్థ, ఎలాన్ మస్క్ గట్టిగా చెబుతున్నారు.

ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందటం వల్ల ప్రజాస్వామ్యంపై దాడి జరగడం ఇదే తొలిసారి కాదు.

2021లో అమెరికా పార్లమెంటు మీద జరిగిన దాడులలో కూడా సోషల్ సైట్లలో వ్యాప్తి చెందిన తప్పుడు సమాచారం పాత్ర ఉందని ట్విటర్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సే ఒక విచారణలో అంగీకరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)