అజర్బైజాన్, అర్మేనియా వార్: సోమవారం తాజా ఘర్షణల్లో 100 మంది చనిపోయారు..అసలు ఈ దేశాల మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది, చరిత్ర ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
అజర్బైజాన్, అర్మేనియాల మధ్య యుద్ధంలో సోమవారం రాత్రి సుమారు 100 మంది చనిపోయారు. ఈ ఘర్షణల్లో 49 మంది అర్మేనియా సైనికులు మరణించారని ఆ దేశ ప్రధాన మంత్రి నికోల్ పషిన్యాన్ చెప్పారు. మరోవైపు, 50 మంది అజర్బైజాన్ సైనికులు చనిపోయినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
గత మూడు దశాబ్దాల్లో ఈ రెండు దేశాల మధ్య రెండు పెద్ద యుద్ధాలు జరిగాయి. చిన్న చిన్న ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
తాజా ఘర్షణలో కాల్పుల విరమణకు రష్యా మధ్యవర్తిత్వం వహించినట్లు మంగళవారం తెలిపింది.
ఘర్షణలు పూర్తిగా ఆగిపోలేదుగానీ సద్దుమణిగాయని అర్మేనియా మొదట్లో చెప్పింది. అయితే, పొరుగు దేశం "కవ్వించడం"తో తమ పని తాము చేశామని అజర్బైజాన్ చెప్పింది.
ఈ దేశాల మధ్య వివాదానికి కేంద్రం నగోర్నో-కరబాఖ్ అనే ప్రాంతం. అంతర్జాతీయంగా ఆమోదం పొందిన సరిహద్దుల ప్రకారం, ఈ ప్రాంతం అజర్బైజాన్లో భాగం. కానీ, ఇక్కడ అధిక శాతం అర్మేనియన్లే ఉన్నారు.
ఈ సంస్కృతిక విభేదాలు, రాజకీయల నుంచి మతాల వరకూ పాకాయి. అర్మేనియాలో అధిక జనాభా క్రైస్తవులు. అజర్ బైజాన్లో అధిక శాతం ముస్లింలు.
ఈ రెండు దేశాలు ఒకప్పుడు సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేవి. 1991 చివర్లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయింది.
ఇరు దేశాల మధ్య వివాదం 1980లు, 1990లలో పెద్ద యుద్ధాలకు దారి తీసింది. మళ్లీ 2020లో ఆరు వారాల యుద్ధం జరిగింది. చిన్న చితకా ఘర్షణలు దశాబ్దాల తరబడి సాగుతూనే ఉన్నాయి.
తాజాగా చెలరేగిన హింసకు ఇరు దేశాలు పరస్పరం నిందించుకుంటున్నాయి.
అర్మేనియా తమ మౌలిక సదుపాయాలపై మొదట దాడి చేసిందని అజర్బైజాన్ ఆరోపిస్తోంది. గత నెల రోజులుగా అర్మేనియా పెద్ద ఎత్తున సైన్య సన్నాహాలు చేస్తోందని, కవ్వింపు చర్యలకు దిగిందని అజర్బైజాన్ సైన్య అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ అనార్ ఐవాజోవ్ అన్నారు.

ఫొటో సోర్స్, AFP
శాంతి చర్చలకు అంతర్జాతీయ సమాజం పిలుపు
సోమవారం రాత్రంతా కాల్పులు కొనసాగాయి. మంగళవారం ఉదయం రష్యా జోక్యం చేసుకుని అత్యవసరంగా కాల్పుల విరమణకు ఒప్పించిందని క్రెమ్లిన్ తెలిపింది.
అయితే, "ఉద్రిక్తతల తీవ్రత తగ్గింది కానీ, సరిహద్దులకు ఇరువైపులా కాల్పులు జరుగుతూనే ఉన్నాయని" అర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యాన్ తెలిపారు.
"అర్మేనియా పెద్ద స్థాయిలో రెచ్చగొట్టడం వల్లే తమ దేశ సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారని", రష్యా మధ్యవర్తిత్వం వహించి కాల్పుల విరమణకు ఒప్పించినా అర్మేనియా ఆ నిబంధనలను ఉల్లంఘిస్తోందని మంగళవారం అజర్బైజాన్ ఆరోపించింది.
అదే రోజు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్తో మాట్లాడి, అర్మేనియాతో "కాల్పు విరమణను గౌరవించాలని" కోరారు.
అర్మేనియా, అజర్బైజాన్ల మధ్య యుద్ధాన్ని అంతర్జాతీయ సమాజం ఖండించింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మంగళవారం ఇరు దేశాల నాయకులకు ఫోన్ చేసి, శాంతియుత పరిష్కారానికి రావాలని, భవిష్యత్తులో ఘర్షణలను నిరోధించాలని కోరారు.
"రెండు దేశాల మధ్య పోరాటాన్ని తక్షణం అడ్డుకుని, శాంతి పరిష్కారం సాధించేందుకు" ఒత్తిడి తెస్తానని బ్లింకెన్ అన్నారు.
రష్యా అర్మేనియాకు దగ్గరగా ఉంది కానీ, ఆ ప్రాంతంలో రష్యా శక్తిమంతమైనది. అందుకే రెండు దేశాలతోనూ సంబంధాలను కొనసాగిస్తుంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అర్మేనియా, అజర్బైజాన్ల మధ్యవర్తిత్వం విషయంలో స్వయంగా చొరవ తీసుకుంటున్నారని" క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ చెప్పారు.
"ఆ రెండు దేశాల సరిహద్దులలో ఉద్రిక్తతలను తగ్గించడానికి పుతిన్ సహజంగానే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు" అని ఆయన అన్నారు.
మరోవైపు, తుర్కియే (టర్కీ పేరును తుర్కియేగా జూన్లో మార్చారు)కు అజర్బైజన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆ దేశం చెప్పిన మాటలను నమ్ముతుంది, మద్దతిస్తుంది.
"అర్మేనియా కవ్వింపు చర్యలకు స్వస్తి పలకాలని, శాంతి చర్చలపై దృష్టి పెట్టాలని" తుర్కియే విదేశాంగ మంత్రి మెవ్లుట్ కావుసోగ్లు అన్నారు.
2020 ఘర్షణల తరువాత, సోమవారం జరిగిన హింస అత్యంత ఘోరమైనదని భావిస్తున్నారు.
2020 యుద్ధంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా రష్యా మధ్యవర్తిత్వంతోనే అర్మేనియా నగోర్నో-కరబాఖ్ ప్రాంతం నుంచి తన బలగాలను ఉపసంహరించుకుంది. సుమారు 2000 మంది రష్యన్లను చర్చల కోసం ఆ ప్రాంతానికి పంపించారు.

ఫొటో సోర్స్, Getty Images
అర్మేనియా, అజర్బైజాన్ల మధ్య యుద్ధం ఎప్పుడు మొదలైంది?
సోవియట్ యూనియన్ రాజకీయ, ఆర్థిక ప్రణాళికల పునర్వ్యవస్థీకరణ కోసం మిఖాయిల్ గోర్బోచోఫ్ నేతృత్వంలో జరిగిన 'పెరెస్ట్రాయికా' ఉద్యమంలో ఈ వివాదానికి మూలాలు ఉన్నాయి.
సోవియట్ యూనియన్ మనుగడలో ఉన్నప్పుడు, అజర్బైజాన్లో అంతర్భాగంగా, స్వయంప్రతిపత్తి ఉన్న ప్రాంతంగా నగోర్నో-కరబాఖ్ ఉండేది.
ఆ ప్రాంతం అజర్బైజాన్లో అంతర్భాగమని అంతర్జాతీయ సమాజం కూడా గుర్తించింది. కానీ, ఇక్కడ నివసించేవారిలో అత్యధికులు అర్మేనియన్లే. నగోర్నో-కరబాఖ్ను అర్మేనియాలో కలపాలని వాళ్లు ఆందోళనలు మొదలుపెట్టారు. దీనిపై అజర్బైజాన్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
దీంతో, ఈ రెండు వర్గాల ప్రతినిధుల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. కరబాఖ్ అజర్బైజాన్ ప్రజలను తరిమికొట్టే ప్రయత్నాలను ప్రారంభించింది అర్మేనియా.
దీనికి ప్రతిచర్యగా, 1988లో అజర్బైజాన్లోని సుమగయిట్ నగరంలో అర్మేనియన్లను పెద్ద సంఖ్యలో చంపారు. దీన్ని 'సుమగయిట్ నరసంహారం'గా విశ్లేషకులు పేర్కొంటారు.
అప్పుడు, సోవియన్ యూనియన్ బలవంతంగా పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించింది. కరబాఖ్లో ఆందోళనకు ప్రతినిధులుగా ఉన్నవారిని అరెస్టు చేశారు.
ఆ తరువాత అర్మేనియా, అజర్బైజాన్ల మధ్య శత్రుత్వం మరింత పెరుగింది. 1990లో అజర్బైజాన్ రాజధాని బాకూలో మరోసారి వందల సంఖ్యలో అర్మేనియన్లను చంపారు.
1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమవ్వగానే కరబాఖ్ సంఘర్షణ మరో కొత్త మలుపు తీసుకుంది.
అప్పటికి అజర్బైజాన్, అర్మేనియాల వద్ద సోవియట్ సైన్యం వదిలి వెళ్లిన ఆయుధాలు కూడా ఉన్నాయి. దీంతో 1992-93లో ఈ రెండు దేశాల మధ్య భీకర యుద్ధం జరిగింది. రెండు పక్షాలకూ తీవ్ర నష్టం వాటిల్లింది. యుద్ధ నేరాలుగా పరిగణించే ఘటనలు కూడా జరిగాయి.
1992లో అజర్బైజాన్లోని ఖొజాలీ సమీపంలో జరిగిన అజర్బైజాన్ పౌరుల ఊచకోత కూడా వీటిలో ఒకటి. ఖొజాలీ సమీప ప్రాంతాల్లోకి అర్మేనియా సైన్యం చొరబడి అక్కడున్నవారిని చంపింది. అధికారిక గణంకాల ప్రకారం మరణించినవారిలో 600 మంది వృద్ధులు, మహిళలు, పిల్లలు ఉన్నారు.
ఏళ్లుగా రెండు దేశాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణల్లో దాదాపు 30 వేల మంది దాకా మరణించి ఉంటారని, పది లక్షలకు పైగా ప్రజలు శరణార్థులుగా మారి ఉంటారని ఓ అంచనా.
శాంతి కోసం అంతర్జాతీయ ప్రయత్నాలు
నగోర్నో-కరబాఖ్ వివాదం ఐక్యరాజ్య సమితిలో చాలా సార్లు ప్రస్తావనకు వచ్చింది. 1993లో ఐరాస భద్రతా మండలి నాలుగు తీర్మానాలు చేసింది. అయితే, అవేవీ అమలుకు నోచుకోలేదు.
అజర్బైజాన్, అర్మేనియాల మధ్య వివిధ స్థాయిలలో చర్చల కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రెండు దేశాల నాయకత్వాలలో మార్పులు వచ్చినకొద్దీ చర్చల ప్రక్రియలు మళ్లీ మొదటికి వచ్చేవి.
1992లో బెలారూస్ రాజధాని మిన్స్క్లో యూరప్ ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరప్ (ఓఎస్సీఈ) సదస్సు సందర్భంగా 'ఓఎస్సీఈ మిన్స్క్ గ్రూప్'ను ఏర్పాటు చేశారు.
రష్యా, అమెరికా, ఫ్రాన్స్ నేతృత్వంలోని ఈ గ్రూప్ అజర్బైజాన్, అర్మేనియాల మధ్య చర్చల కోసం ప్రయత్నాలు చేసింది. ఈ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ఫలించి 1994 మేలో అజర్బైజాన్, అర్మేనియా యుద్ధ విరమణకు సిద్ధమయ్యాయి.
అప్పటికే కరబాఖ్, దాని సమీపంలోని ఏడు ప్రాంతాలను అర్మేనియా ఆక్రమించింది. రెండు దేశాల మధ్య సమావేశాలు, చర్చలు జరిగినా వ్యవహారాలు ఎటూ తేలలేదు.
2001లో ఇరు దేశాల అధ్యక్షులు అమెరికాలో ఓ రిసార్టులో సమావేశమయ్యారు. అప్పుడు రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందని అందరూ భావించినా, ప్రయత్నాలు చివరిదాకా వచ్చి విఫలమయ్యాయి.
కరబాఖ్ను గణతంత్ర రాజ్యంగా ప్రకటించిన అర్మేనియా
అర్మేనియా 1991లో నగోర్నో-కరబాఖ్ను గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. కానీ, అంతర్జాతీయ సమాజం దీన్ని గుర్తించలేదు. నగోర్నో-కరబాఖ్ను ఆక్రమిత ప్రాంతంగానే అజర్బైజాన్ పరిగణిస్తోంది.
అధికారికంగా గణతంత్ర రాజ్యంగా ప్రకటించినప్పటికీ నగోర్నో-కరబాఖ్ భద్రత వ్యవహారాలను అర్మేనియానే చూసుకుంటోంది. ఆ ప్రాంతానికి బడ్జెట్ కూడా ఆ దేశమే కేటాయిస్తోంది. సైన్య వ్యవహారాలను చూస్తోంది.
నగోర్నో-కరబాఖ్లో ఎన్నికలు జరుగుతాయి. అయితే, వీటికి అంతర్జాతీయ గుర్తింపు లేదు. ఈ ప్రాంత వాసులు అర్మేనియా పాస్పోర్టునే వినియోగిస్తున్నారు. ఫోన్లు కూడా అర్మేనియా కోడ్తోనే పనిచేస్తాయి.
కాల్పుల విరమణ ఇప్పటివరకూ ఎలా కొనసాగింది?
రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. అయితే, 2016 ఏప్రిల్లో ఓ తీవ్ర ఘర్షణ నాలుగు రోజులపాటు కొనసాగింది. రెండు దేశాల సైనికులూ ఇందులో మరణించారు.
ఆ తరువాత రెండు దేశాల ప్రతినిధులు రష్యాలో సమావేశమై, కాల్పుల విరమణకు అంగీకరించారు.
2020 జులైలో మళ్లీ అర్మేనియా, అజర్బైజాన్ అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఘర్షణలు జరిగాయి. కానీ, అంతర్జాతీయ ప్రయత్నాలు కారణంగా ఇవి తీవ్ర రూపం దాల్చలేదు.

ఫొటో సోర్స్, Reuters
తుర్కియే పాత్ర
తుర్కియే, అజర్బైజాన్ ప్రజల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు దేశాల్లో మాట్లాడే భాషలు కూడా ఒకే కుటుంబానికి చెందినవి.
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత ఈ రెండు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు బాగా బలపడ్డాయి.
తుర్కియేతో అర్మేనియాకు మధ్య ఎప్పుడూ సంబంధాలు సరిగ్గా లేవు. తుర్కియే ఒట్టమాన్ సామ్రాజ్యంగా ఉన్న సమయంలో 1914 తరువాత అర్మేనియన్లు ఊచకోతకు గురయ్యారు.
ఇదంతా జరిగి వందేళ్లు గడిచినా, రెండు దేశాల మధ్య సఖ్యత రాలేదు. అర్మేనియాతో సరిహద్దులను మూసివేసింది తుర్కియే.
ఇక నగోర్నో-కరబాఖ్లో అజర్బైజాన్కు మద్దతుగా తుర్కియే రాజకీయంగానే కాకుండా సైన్యపరంగానూ క్రియాశీల పాత్ర పోషిస్తోంది.
ఇరాన్... రష్యా...
అర్మేనియా, అజర్బైజాన్లతో తమకున్న సంబంధాలలో సమతుల్యం ఉండాలని ఇరాన్ కూడా కోరుకుంటోంది.
ఈ రెండు దేశాల మూలాలున్న ప్రజలు చాలా మంది ఇరాన్ ఉత్తర ప్రాంతంలో ఉన్నారు. 2020లో జరిగిన యుద్ధం వలన ఆ ప్రాంతంలో వేర్పాటువాదం పెరుగుతుందని ఇరాన్ ఆందోళన పడింది.
ఇక, అర్మేనియా, అజర్బైజాన్ రెండు దేశాలతోనూ రష్యాకు చాలా ఏళ్లుగా సంబంధాలున్నాయి.
ఓఎస్సీఈ మిన్స్క్ గ్రూప్ ముఖ్య సభ్య దేశంగా అర్మేనియా, అజర్బైజాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న రష్యాకు రెండు దేశాల వాదనలనూ వినాల్సి ఉంటుంది.
ఈ రెండు దేశాలకూ వందల కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను రష్యా విక్రయిస్తోంది.
అర్మేనియాలో రష్యా సంస్థల పెట్టుబడులు చాలా ఉన్నాయి. ఆ దేశంలో రష్యాకు ఓ భారీ సైనిక స్థావరం కూడా ఉంది. అర్మేనియా పౌరులు పెద్ద సంఖ్యలో రష్యాలో పనిచేస్తుంటారు.
అజర్బైజాన్ వాళ్లు రష్యాలో కార్మికులుగా ఉన్నారు. రష్యా పరిశ్రమలు అజర్బైజాన్ చమురు రంగంలో పెట్టుబడులు పెట్టాయి. అజర్బైజాన్ పౌరుల్లో రష్యా మూలాలున్నవారు కూడా ఉన్నారు.
ఈ కారణాల రీత్యా, రష్యా ఈ రెండు దేశాల్లో ఏదో ఒక దేశం వైపు స్పష్టంగా నిలబడే పరిస్థితి లేదు.
కరోనా సమయంలో యుద్ధం
అజర్బైజాన్ సైన్యం అర్మేనియా సైన్యం కన్నా చాలా పెద్దది. 2000లలో చమురు విక్రయాల ద్వారా అజర్బైజాన్ చాలా ఆదాయం సమకూర్చుకుంది. సైన్య శిక్షణ కోసం, సామర్థ్యాలు పెంచేందుకు భారీగా ఖర్చు చేసింది.
అయితే, కరోనా సంక్షోభంతో శక్తిమంతమైన దేశాలు కూడా ఇబ్బందుల్లో పడ్డాయి. అమెరికా ఎన్నికల సన్నాహాలలో మునిగింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక సంక్షోభం వైపు అడుగులు వేసింది.
అజర్బైజాన్కు చమురుపై ఇదే స్థాయిలో ఆదాయం కొనసాగడం కష్టమైంది. సైనిక శక్తిపరంగా మెరుగైన స్థాయికి చేరుకుంది.
కరబాఖ్ కొండ ప్రాంతం. చలికాలం వచ్చాక, ఇక్కడ సైనిక సామగ్రి తరలింపు పెద్ద సమస్యగా మారుతుంది. దారులన్నీ మంచుతో మూసుకుపోకముందే, అజర్బైజాన్కు సైనిక చర్యకు ఉపక్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆ దేశం ముందడుగు వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనా మహమ్మారి తరువాత చైనా అధ్యక్షుడి తొలి విదేశీ పర్యటన, పుతిన్తో భేటీ కానున్న షీ జిన్పింగ్
- శ్రీలంకను ఐక్యరాజ్యసమితిలో భారత్ ఎందుకు తప్పుపట్టింది, దీనిపై చైనా ఎలా జోక్యం చేసుకుంది?
- INDvsPAK మ్యాచ్లో షాహిద్ అఫ్రిదీ కూతురు భారత జాతీయ జెండాను ఎందుకు ఊపింది?
- బ్రిటన్లో రాచరికానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనకారులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
- జ్ఞానవాపి కేసు: ‘ఇది ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. ఈ మసీదు... ఆ మసీదు ఇలా కొనసాగుతూనే ఉంటుంది’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)













