‘సజీవ శిలాజం’: వందేళ్లు బతికే భారీ చేప.. మహాసముద్రాల అడుగున గుహలలో నివాసం

సీలాకాంత్ చేప

ఫొటో సోర్స్, Getty Images

'సజీవ శిలాజం'గా పిలిచే ఒక రకమైన చేప వందేళ్లు బతుకుతుందని తాజా అధ్యయనం ఒకటి సూచించింది.

సీలాకాంత్‌ అనే ఈ చేప 20 ఏళ్లు బతుకుతుందని ఇంతవరకు భావిస్తుండేవారు.

అయితే తాజా అధ్యయనాలు మాత్రం ఈ చేప శతాబ్దం వరకు బతికేస్తుందని చెబుతున్నాయి.

దీనిపై అధ్యయనం చేసిన ఫ్రెంచ్ పరిశోధకులు చెట్ల వయసును గుర్తించడానికి అనుసరించే విధానాల మాదిరిగా ఈ చేప వయసును అంచనా వేశారు.

ఈ రకం చేపలు మధ్య వయసు దాటిన తరువాత సంతానోత్పత్తి చేస్తాయని, వీటి గర్భస్థ సమయం సుమారు అయిదేళ్లు ఉంటుందని ఈ పరిశోధకులు చెబుతున్నారు.

అతిగా వేటాడడం, వాతావరణ మార్పులు వంటి ప్రభావాలతో నిదానంగా పెరిగే రకాల చేపలు అంతరించిపోయే ప్రమాదం ఉంది.

ఇప్పుడు సీలాకాంత్ జీవిత కాలం, గర్భస్థ సమయం వంటివి తెలియడం వల్ల సంరక్షణ చర్యలు చేపట్టడంలో సరైన పద్ధతులు అనుసరించడానికి అవకాశమేర్పడుతుందని ఫ్రాన్స్‌లోని మాంట్‌పెలియర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బ్రూనో ఎర్నాండె చెప్పారు.

కెన్యాలోని మ్యూజియంలో ఉన్న సీలాకాంత్ చేప

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కెన్యాలోని మ్యూజియంలో ఉన్న సీలాకాంత్ చేప

సీలాకాంత్ చేప పూర్తిగా అంతరించిపోయిందనే అనుకున్నారు.

కానీ 1938లో దక్షిణాఫ్రికాలో మత్య్సకారుల వలలో సీలాకాంత్ రకం చేప పడింది.

ఆఫ్రికా తూర్పు ప్రాంత సముద్ర జలాలు, ఇండోనేసియా జలాలలో ఆ తరువాత ఇలాంటి చేపల సమూహాలు రెండు గుర్తించారు.

ఆఫ్రికాకు తూర్పున ఉన్న సముద్ర జలాల్లో కొన్ని వందల చేపలు మాత్రమే ఉండడంతో వీటిని అంతరించిపోయే జీవుల జాబితాలో చేర్చారు.

సీలాకాంత్ పూర్వజాతిగా చెప్పే చేపలు 42 కోట్ల ఏళ్ల కిందట ఉద్భవించాయి. ఖండాల మార్పు, డైనోసార్లు అంతరించిపోవడానికి కారణమైన గ్రహశకలాలు ఢీకొన్న ఘటనలను తట్టుకుని ఇవి మనుగడ సాగించాయి.

మహాసముద్రాల అడుగున గుహలలో ఉండే ఈ చేపలు 6 అడుగుల పొడవు, 90 కేజీల బరువు వరకు పెరుగుతాయి.

సీలాకాంత్‌కు సంబంధించిన ఈ తాజా అధ్యయనం 'కరెంట్ బయాలజీ' జర్నల్‌లో ప్రచురితమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)