కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కోవిడ్-19 - Newsreel

స్మృతి ఇరానీ

ఫొటో సోర్స్, facebook/Smriti.Irani.Official

కేంద్ర జౌళి, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి కరోనావైరస్ సోకింది.

తనకు కోవిడ్-19 వచ్చినట్లు స్మృతి ఇరానీ బుధవారం సాయంత్రం ట్విటర్‌లో ప్రకటించారు.

తనను కలిసిన వారంతా వీలైనంత త్వరగా పరీక్ష చేయించుకోవాలని ఆమె కోరారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

బిహార్ తొలివిడత పోలింగ్

ఫొటో సోర్స్, PRAKASH SINGH / AFP VIA GETTY IMAGES

బిహార్ తొలివిడత పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు 51.91 శాతం ఓటింగ్

బీహార్ లోని 243 అసెంబ్లీ స్థానాలకు తొలి విడత పోలింగ్ బుధవారం మొదలయ్యింది. కోవిడ్ మహమ్మారి నడుమ దేశంలో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే.

మొదటి దశలో బీహార్ లోని 16 జిల్లాలలో 71 స్థానాలకు వోటింగ్ జరిగింది.

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు 46. 29 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది.

కైమూర్ జిల్లాలో ఉన్న రాంగఢ్ స్థానంలో అత్యధికంగా 56. 30 శాతం ఓటింగ్ నమోదు కాగా, భోజపూర్ జిల్లా సందేష్ లో అత్యల్ప ఓటింగ్ నమోదు అయినట్లు తెలిపింది. ఇక్కడ 3 గంటల వరకు 38.50 శాతం ఓటింగ్ జరిగింది.

కిమ్ కర్డాషియన్ వెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ‘‘ నా పుట్టినరోజు వేడుకులు ఆత్మీయుల మధ్య జరుగుతుంటే నేనెంత అదృష్టవంతురాలినో అనిపిస్తోంది’’ అని కర్డాషియన్ పేర్కొన్నారు

కిమ్ కర్డాషియన్: ఘనంగా 40వ పుట్టినరోజు వేడుక చేసుకున్న నటి.. విమర్శిస్తున్న నెటిజన్లు

కిమ్ కర్డాషియన్ వెస్ట్ తన 40వ పుట్టినరోజు వేడుకలను కుటుంబం, స్నేహితులమధ్య ఒక ప్రైవేట్ దీవిలో ఘనంగా జరుపుకున్నారు.

కోవిడ్ 19 మహమమ్మరి వ్యాప్తి చెందుతున్న సమయంలో భౌతిక దూరం పాటించకుండా, మాస్క్‌లు ధరించకుండా విలాసవంతమైన పార్టీని ఏర్పాటు చేసినందుకు కిమ్ కర్డాషియన్ విమర్శలు ఎదుర్కుంటున్నారు.

అయితే, పలుమార్లు పరీక్షలు చేయించుకుని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే ఈ పార్టీని ఏర్పాటు చేసానని ఆమె తెలిపారు.

కిమ్ కర్డాషియన్ తన పుట్టినరోజు వేడుక చిత్రాలను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ "నేనెంత అదృష్టవంతురాలినో అర్థమైంది" అని రాసారు.

"కోవిడ్ 19కు ముందు కుటుంబంతో, సన్నిహితులతో గడపడం ఎంత అదృష్టమో మనమెవ్వరం గుర్తించి ఉండం. ఇప్పటికీ కరోనా కారణంగా ఈ భాగ్యానికి నోచుకోనివారెందరో ఊన్నారు. ఇవాళ ఇలా నా పుట్టినరోజు వేడుకులు ఆత్మీయుల మధ్య జరుగుతుంటే నేనెంత అదృష్టవంతురాలినో అనిపిస్తోంది" అంటూ ట్వీట్ చేసారు.

అయితే, కోవిడ్ మహమ్మారి కారణంగా ఎంతోమంది ఆనారోగ్యం పాలవుతూ, ప్రాణాలు కోల్పోతూ ఉంటే తన పుట్టినరోజు వేడుకల గురించి సోషల్ మీడియాలో గొప్పలు పోవడం పట్ల ఆమెను అనేకమంది విమర్శిస్తున్నారు.

కోడి పందేలు

ఫొటో సోర్స్, Getty Images

కోడి పందేలపై పోలీసుల దాడి.. కోడి పుంజు దాడిలో పోలీస్ అధికారి మృతి

ఫిలిప్పీన్స్‌లోని నార్తన్ సమర్ ప్రాంతంలో అక్రమంగా కోడిపందాలను నిర్వహిస్తున్న స్థలంపై ఒక పోలీసు అధికారి దాడి చేస్తుండగా, అక్కడున్న ఒక కోడిపుంజు చేతిలో మరణించారు.

కోడి పందేల్లో సాధారణంగా కోడి పుంజు కాలికి కట్టే పదునైన చురకత్తి గుచ్చుకుని లెఫ్టినెంట్ క్రిస్టీన్ బొలోక్ ప్రాణాలు విడిచారు.

ఆ కత్తి లెఫ్టినెంట్ ఎడమ తొడలో బలంగా గుచ్చుకుని రక్తనాళాలను చీల్చివేసింది. వెనువెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్థారించారు.

కోవిడ్ 19 కారణంగా ఫిలిప్పీన్స్‌లో కోడి పందేలను నిషేధించారు.

కోడి పందేలు

ఫొటో సోర్స్, Getty Images

అంతకుముందు లైన్సెన్స్ ఉన్న స్థలాల్లోనే ఆదివారాలు లేదా సెలవుదినాల్లో కోడి పందేలు నిర్వహించడానికి అనుమతి ఉండేదని ప్రభుత్వ వార్తా సంస్థ పిలిప్పీన్ న్యూస్ ఏజెన్సీ (పీఎన్ఏ) తెలిపింది.

ప్రోవిన్సికల్ పొలీస్ చీఫ్ కల్నల్ ఆరెన్ల్ అపుడ్, వార్తా సంస్థ ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ.. ఈ సంఘటన "దురదృష్టకరమని" పేర్కొన్నారు. లెఫ్టినెంట్ బొలోక్ కుటుంబానికి సంతాపం తెలియజేసారు.

అక్రమ కోడి పందేలు నిర్వహించిన ముగ్గురు వ్యక్తులను అరస్ట్ చేశారు. ఏడు కోడి పుంజులను, రెండు జతల చురకత్తులను, 550 పిలిప్పీన్ పెసోలను జప్తు చేసినట్టు పీఎన్ఏ తెలిపింది.

నవరాత్రి ఉత్సవాల ముగింపులో అపశృతి.. ఏపీలో ఆరుగురు యువకులు గల్లంతు

పశ్చిమ గోదావరి జిల్లాలో యువకులు గల్లంతు

ఆంధ్రప్రదేశ్‌లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది..

పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం భూదేవిపేటకు చెందిన ఆరుగురు యువకులు వాగులో దిగి గల్లంతయ్యారు.

ఇప్పటికే మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు సాగిస్తున్నారు. వేలేరుపాడు, కుక్కునూరు పోలీసులు ఘటనా స్థలంలో గాలింపు చర్యలు సాగిస్తున్నారు.

దసరా ఉత్సవాలు విజయవంతంగా ముగించడంతో నిర్వాహకులంతా కలిసి విందు ఏర్పాటు చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అందులో భాగంగా వసంతవాడ వాగు సమీపానికి వెళ్ళిన యువకులు అందులో దిగి ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు.

అక్కడున్న మరికొందరు యువకులు సమాచారాన్ని స్థానికులకు అందించడంతో పోలీసులు రంగంలో దిగారు. గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకూ ముగ్గురి మృతదేహాలు లభించినట్టు కుక్కునూరు సీఐ బాలసురేష్ బీబీసీకి తెలిపారు.

ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఈ ప్రమాదంతో భూదేవిపేటతో పాటుగా వేలేరుపాడులో తీవ్ర విషాదం అలముకుంది.

మహమ్మద్ ప్రవక్తపై ఫ్రాన్స్‌లో కార్టూన్లు.. బంగ్లాదేశ్‌లో భారీ నిరసనలు

బంగ్లాదేశ్‌ నిరసన

ఫొటో సోర్స్, EPA

ఫ్రెంచ్ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వేలాది మంది నిరసరనలు చేపట్టారు.

ఇస్లామిక్ ఉగ్రవాదంపై ఫ్రాన్స్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రేకెత్తిన వివాదం కొనసాగుతోంది. పలు ఇస్లామిక్ దేశాలు తమ నిరసనలను తెలియజేస్తున్నాయి.

ఢాకాలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు.

ఫ్రెంచ్ పత్రిక చార్లీ హెబ్డోలో మహమ్మద్ ప్రవక్తపై వచ్చిన కార్టూన్లను ఫ్రెంచ్ అధ్యక్షుడు సమర్ధించారు. ఈ అంశంపై నిరసనలు తెలుపుతూ ఇస్లాం మద్దతుదారులు ఢాకాలోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయంవైపు వెళుతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఈ నెల ప్రారంభంలో, ఫ్రాన్స్‌లో మహమ్మద్ ప్రవక్తపై వచ్చిన కార్టూన్లను తన విద్యార్థులకు చూపించిన ఒక ఉపాధ్యాయునిపై కొందరు దాడి చేసి శిరఛ్చేదానికి పాల్పడ్డారు. చనిపోయిన ఉపాధ్యాయునికి నివాళులు అర్పిస్తూ కార్టూన్ విషయంలో వెనక్కు తగ్గేది లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఈ విషయంపై ఆగ్రహం చెందిన పలు ఇస్లామిక్ దేశాలు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. సోమవారం నాడు టర్కీ అధ్యక్షుడు రజబ్ తయ్యిప్ ఎర్డోవాన్ కూడా ఫ్రెంచ్ వస్తువులను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు.

అయితే, యూరప్ దేశాలన్నీ ఫ్రాన్స్‌కు మద్దతుగా నిలిచాయి. టర్కీ అధ్యక్షుడు ఎర్డోవాన్ చేసిన వ్యాఖ్యలను ఖండించాయి. అందుకు ప్రతిస్పందనగా ఫ్రాన్స్‌ నుంచి తమ రాయబారిని ఉపసంహరించుకుంటున్నట్లు ఎర్డోవాన్ ప్రకటించారు.

భారతదేశంలో నివసిస్తున్న ప్రముఖ బంగ్లాదేశీ రచయిత తస్లీమా నస్రీన్ ఢాకాలో జరుగుతున్న నిరసనలపై స్పందిస్తూ..."బంగ్లాదేశీ ఉన్మాదులు ఫ్రెంచ్ ఉత్పత్తులను బహిష్కరించాలని నిరసనలు జరుపుతున్నారు. కానీ అత్యాచారాలు, హత్యలు, అవినీతి, పేదరికం, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటానికి ముందుకు రారు. చైనా వస్తువులను బహిష్కరించరు. బహిరంగ మరుగుదొడ్లు నిర్మించడానికి ఒక మసీదును కూలగొట్టినా సరే వారు చైనా ఉత్పత్తులను బహిష్కరించరు" అంటూ విమర్శించారు.

హైదరాబాద్‌లో డాక్టర్‌ కిడ్నాప్.. ఛేజ్ చేసి కాపాడిన ఏపీ పోలీసులు

కిడ్నాప్‌కు గురైన డాక్టర్ హుస్సేన్

హైదరాబాద్‌కి చెందిన ఓ డెంటిస్ట్‌ని కిడ్నాపర్ల చెర నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాపాడారు. హైదారాబాద్‌లో కిడ్నాప్ చేసి బెంగళూరు, షిమోగా వైపు తరలిస్తుండగా అనంతరపురం వద్ద పోలీసులు బాధితుడిని రక్షించారు.

రాప్తాడు సమీపంలో పోలీసులు కిడ్నాపర్లు ఉన్న వాహనాన్ని గుర్తించారు. అందులో ఉన్న బాధితుడిని రక్షించారు. మరో ఇద్దరు కిడ్నాపర్లను కూడా అదుపులోకి తీసుకున్నట్టు అనంతపురం పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్ లోని కిస్మత్‌పూర్ డెంటల్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ హుస్సేన్‌ని 27వ తేదీ మద్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆస్పతి నుంచి కిడ్నాప్ చేశారు. ఐదుగురు వ్యక్తులు బుర్ఖాలు ధరించి వచ్చి ఆయన్ని అపహరించినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.

కిడ్నాప్‌కు గురైన డాక్టర్ హుస్సేన్

అక్కడి నుంచి ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లిన కిడ్నాపర్లు మరాఠీ మాట్లాడుతున్నట్టు గుర్తించారు. అక్కడి నుంచి మరో నలుగురు బృందానికి బాధితుడిని అప్పగించిన తర్వాత బొలోరో వాహనంలో తరలిస్తుండగా తెలంగాణా పోలీసుల నుంచి సమాచారం అందుకున్న అనంతపురం పోలీసులు రంగంలో దిగారు.

హైదరాబాద్ లోని కిస్మత్‌పురాలో డాక్టర్ హుస్సేన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారని పోలీసులు వెల్లడించారు. ప్రతిష్టాత్మక రాయల్ వుడ్స్ విల్లాల అమ్మకందారుడు కావడంతో భారీ మొత్తంలో నగదు కోసం ఆయన్ని అపహరించినట్టుగా చెబుతున్నారు.

కిడ్నాపర్లు రూ. 10 కోట్లు డిమాండ్ చేసినట్టు వెల్లడించారు. దాంతో బాధితుడిని విడిపించేందుకు రంగంలో దిగిన పోలీసులు కంగనాపల్లి వైపు వెళుతుండగా అన్ని వైపులా చుట్టిముట్టి బాధితుడిని కాపాడగలిగామన్నారు.

నిందితుడు సంజయ్‌ని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పొలాల మీదుగా పారిపోయినట్టు తెలిపారు. కాళ్లు, చేతులు కట్టేసి కారులో పడి ఉన్న బాధితుడిని కాపాడినట్టు తెలిపారు.

డోనాల్డ్ ట్రంప్: మహిళపై లైంగిక దాడి.. పరువు నష్టం కేసులో అమెరికా అధ్యక్షుడికి ఎదురుదెబ్బ

జీన్ కరోల్

ఫొటో సోర్స్, Reuters

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనపై అత్యాచారం చేసారంటూ ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుకు వ్యతిరేకంగా, ట్రంప్‌ను సమర్థిస్తూ న్యాయ శాఖ చేసిన వాదనలను అమెరికా ఫెడరల్ జడ్జ్ తోసిపుచ్చారు.

1990లలో మన్‌హటన్‌లోని ఒక డిపార్ట్మెంట్ స్టోర్‌లో ట్రంప్ తనపై దాడి చేశారంటూ కాలమిస్ట్ ఈ జీన్ కరోల్ ఆరోపించారు.

అయితే, ఆమె ఆరోపణలను ట్రంప్ తిరస్కరిస్తూ ఆమె అబద్ధం చెప్తున్నారని పేర్కొన్నారు. ఇలా అనటం ద్వారా అమెరికా అధ్యక్షుడు తనను అప్రతిష్ట పాలు చేశారంటూ ఆమె కోర్టులో కేసు వేశారు.

ఈ కేసులో ట్రంప్‌కు బదులుగా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (డీఓజే) ప్రతివాదిగా నిలబడాలని నిర్ణయించుకుంది.

ట్రంప్‌పై కరోల్ కేసు వేసినప్పుడు ఆయన అధ్యక్షుడిగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఫెడరల్ ఉద్యోగుల విధి నిర్వహణలో వారి పనితీరు వల్ల ఉత్పన్నమయ్యే చర్యలపై కేసు పెట్టకుండా వారిని కాపాడేందుకు రూపొందించిన చట్టాన్ని ఉదహరిస్తూ డీఓజే ఈ నిర్ణయం తీసుకుంది.

డోనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

డీఓజే ఉదహరించిన చట్టం.. ది టోర్ట్ క్లైమ్స్ ఏక్ట్ అర్థంలో ట్రంప్ ఒక "ఉద్యోగి" కాదని మాన్హటన్ జిల్లా కోర్టు జడ్జ్ లూయీస్ కప్లాన్ స్పష్టం చేశారు.

స్వతంత్ర్యంగా వ్యవహరించాల్సిన డీఓజేను ట్రంప్ తనకు అనుగుణంగా మార్చుకున్నారని విమర్శకులు అంటున్నారు.

ఈ కేసును 2019లో న్యూయార్క్ స్టేట్ కోర్టులో దాఖలు చేశారు. ట్రంప్ వ్యక్తిగత లాయర్ మార్క్ కసోవిట్జ్ ట్రంప్‌కు పాతినిధ్యం వహించారు.

డీఓజే ఈ కేసును ఫెడరల్ కోర్టుకు తరలించింది. అక్కడ కరోల్, ట్రంప్‌పై వ్యక్తిగతంగా కాకుండా యూఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేసినట్టు పరిగణిస్తారు.

దీనివలన ఈ కేసు ముగింపుకొస్తుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఫెడరల్ ప్రభుత్వంపై ఎవరూ పరువు నష్టం దావా వెయ్యలేరు.

అయితే, జడ్జ్ కప్లాన్ తీర్పు చెప్తే అసలు కేసు ముందుకు కొనసాగవచ్చు.

జీన్ కరోల్

ఫొటో సోర్స్, Reuters

జడ్జ్ కప్లాన్ ఇచ్చిన తీర్పులో "ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని దశాబ్దాల ముందు జరిగిన సంఘటన ఆధారంగా ఆయనపై లైంగికదాడి కేసు మోపారు. ఈ ఆరోపణలకు, అమెరికా అధికారిక వ్యవహారాలకు ఏ సంబంధం లేదు" అని స్పష్టం చేసారు.

ఎల్లే మ్యాగజైన్‌లో సలహాదారుగా ప్రత్యేక రచనలు రాసే ఈ జీన్ కరోల్ ఈ అంశంపై స్పందిస్తూ "ట్రంప్ నన్ను అబద్దాలకోరు అని అన్నప్పుడు ఆయన యూఎస్ అధ్యక్షుడిగా మాట్లాడలేదు. ఈ నిజాన్ని జడ్జ్ కప్లాన్ గ్రహించినదుకు నాకు ఆనందంగా ఉంది" అన్నారు.

మాన్‌హటన్‌లో ఉన్న బెర్గ్‌డార్ఫ్ గూడ్‌మ్యాన్ స్టోర్‌లో.. 1995 చివర్లో లేదా 1996 ప్రారంభంలో ఈ దాడి జరిగిందని కరోల్ చెప్పారు. లో దుస్తుల విషయమై ట్రంప్ తనను సలహా అడిగారని, దుస్తులు మార్చుకునే గదిలో తనపై లైంగికదాడికి పాల్పడ్డారని కరోల్ ఆరోపించారు.

కరోల్ ఆరోపణలను ట్రంప్ పలుమార్లు ఖండించారు. ఆవిడ "అబద్దాలు చెబుతున్నారని", ఆవిడ "నా టైప్ కాదని" ట్రంప్ అనేకమార్లు వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)