రష్యా ఖచటుర్యాన్ సిస్టర్స్- తండ్రిని చంపిన కూతుళ్లు.. ‘ఆత్మరక్షణ కోసం’ చేసిన హత్య కాదంటున్న దర్యాప్తు కమిటీ

ఖచటుర్యాన్ సిస్టర్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తండ్రిని చంపినప్పుడు ఏంజెలినాకు (ఎడమ) 18 ఏళ్లు, మారియాకు (మధ్య) 17 ఏళ్లు, క్రిస్టినాకు (కుడి) 19 ఏళ్లు
    • రచయిత, సారా రెయిన్స్‌ఫోర్డ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వేధింపులకు పాల్పడుతున్న తండ్రిని నిద్రపోతున్నప్పుడు హత్య చేసిన ముగ్గురు అక్కచెల్లెళ్లపై హత్యా నేరం కొట్టివేసేందుకు దర్యాప్తు కమిటీ నిరాకరించడంతో రష్యాలో ఈ కేసు ఇప్పుడు అనిశ్చితిలో పడింది.

ఖచటుర్యాన్ అక్కచెల్లెళ్లు చాలా కాలంగా లైంగిక, శారీరక వేధింపులకు గురయ్యారని జనరల్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఈ ఏడాది మొదట్లో ఒక నిర్ధరణకు వచ్చింది.

అందుకే వారు ‘ఆత్మరక్షణ కోసం’ చేసిన హత్యగా దానిని చూడాలని చెప్పింది. ఆ తీర్పుతో ఈ కేసును మూసివేస్తారని అందరూ అనుకున్నారు.

కానీ, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కమిటీ ఇప్పుడు ప్రాసిక్యూటర్ కార్యాలయం వాదనను కొట్టిపారేస్తున్నారని యువతులకు సంబంధించిన ఒక లాయర్ బీబీసీతో అన్నారు.

ముగ్గురు అక్క చెల్లెళ్లు ఏం చేశారు?

2018 జులైలో పెప్పర్ స్ప్రే, సుత్తి, కత్తి ఉపయోగించి తండ్రి మిఖాలీపై దాడి చేసినందుకు ముగ్గురు యువతులు మరియా, ఏంజిలినా, క్రిస్టినా ఖచటుర్యాన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

“తండ్రి తమను ఇంట్లో చాలా కాలం నుంచీ బంధించి ఉంచాడని” వారు తర్వాత చెప్పారు.

చివరికి కోర్టులో ఈ హత్యారోపణలు రుజువైతే, నేరం చేసిన ముగ్గురిలో ఇద్దరు అక్కలకు 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆ ఇంట్లోంచి పారిపోయిన యువతుల తల్లి “నేను, మా చుట్టుపక్కల వారు గత కొన్నేళ్లుగా ఎన్నోసార్లు ఈ హింస గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాం, కానీ ఎవరూ పట్టించుకోలేదు” అని బీబీసీతో చెప్పారు.

దోషులుగా తేలితే ఇద్దరు అక్కలకు జైలు శిక్ష పడవచ్చు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దోషులుగా తేలితే ఇద్దరు అక్కలకు 20 ఏళ్ల జైలు శిక్ష పడవచ్చు

దర్యాప్తు అధికారుల వాదన

దర్యాప్తు కమిటీ అధికారికంగా ఒక అదనపు దర్యాప్తు చేసింది. కానీ మళ్లీ అంతకు ముందు తీసుకున్న నిర్ణయానికే వచ్చింది.

“ముందే ఆలోచించి చేసిన హత్య’ అనే అసలు ఆరోపణ వారిపై ఇప్పటికీ అలాగే ఉందని, అంటే, పైనుంచి వచ్చిన ఆదేశాలు ఇలాగే ఉన్నట్లున్నాయి” అని లాయర్ అలెక్సీ లిప్సెర్ చెప్పారు.

కొత్త ఆధారాలు ఏవీ లేకపోవడంతో ప్రాసిక్యూటర్ కార్యాలయం వాదనలో కూడా ఎలాంటి మార్పు ఉండదని ఆయన భావిస్తున్నారు.

“ఇప్పుడు దర్యాప్తు కమిటీ ప్రాసిక్యూటర్ చెప్పినదానికి అంగీకరించి, ఆరోపణ మార్చడానికి అంగీకరించాలి. లేదంటే ఇది అలా ఊగిసలాడుతూనే ఉండాలి” అని ఆయన చెప్పారు.

అక్కచెల్లెళ్ల కేసు ఎందుకు ఇంత సంచలనమైంది?

ఈ కేసులో మహిళలకు అండగా భారీగా నిరసనలు జరిగాయి, చాలా మంది పిటిషన్లు కూడా వేశారు. గృహహింసపై కొత్త చట్టాలు తీసుకురావాలనే డిమాండ్లు పెరిగాయి.

ఖచటుర్యాన్ అక్కచెల్లెళ్లు తండ్రి దగ్గర దెబ్బలు తినేవారని, ఎన్నో అవమానాలు ఎదుర్కున్నారని, బెదిరింపులు, శారీరక, లైంగిక వేధింపులకు గురయ్యారని, అవన్నీ వారు ‘రక్షణాత్మక ప్రతిచర్య’కు పాల్పడేలా చేశాయని జనవరిలో ప్రాసిక్యూటర్ కార్యాలయం గుర్తించింది.

“తమకు ఎదురైన అనుభవాలే, తమను తాము ఎలాగైనా రక్షించుకోవాలి అని వారు అనుకునేలా చేసింది” అనే వాదనను ఇప్పుడు దర్యాప్తు కమిటీ కొట్టివేసింది.

ఈ ఆరోపణకు రెండు పక్షాలూ అంగీకరిస్తే తప్ప కేసు కోర్టు వరకూ వెళ్లదు. విచారణ కోసం ఎదురుచూస్తున్న ముగ్గురు యువతులకు ఒకరిని ఒకరు కలవడానికి అనుమతి లేదు. దాంతో, ఇప్పుడు వారు మాస్కోలో విడివిడిగా ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)