ఒలింపిక్స్‌తో సహా ప్రధాన క్రీడల ఈవెంట్లలో పాల్గొనకుండా నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం

రష్యాపై నిషేధం

ఫొటో సోర్స్, Getty Images

అన్ని ప్రధాన క్రీడా ఈవెంట్లలో పాల్గొనకుండా నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం విధిస్తున్నట్లు వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) వెల్లడించింది.

అంటే, 2020 టోక్యో ఒలింపిక్స్, ఖతార్‌లో జరిగే 2022 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ లాంటి మెగా టోర్నీలు, ఈవెంట్లలో రష్యా జెండాను ఉంచడం గానీ, జాతీయ గీతం ఆలపించడానికి గానీ అనుమతి ఉండదు.

కానీ, డోపింగ్ కుంభకోణంలో నిర్దోషులుగా బయటపడిన అథ్లెట్లు మాత్రం ఓ తటస్థ జెండాతో ఈ పోటీల్లో పాల్గొనవచ్చు.

స్విట్జర్లాండ్‌లో జరిగిన సమావేశంలో వాడా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

రష్యా యాంటీడోపింగ్ ఏజెన్సీ (రుసాడా) 2019 జనవరిలో పరిశీలకులకు అందించిన ప్రయోగశాల పరీక్షల సమాచారాన్ని వక్రీకరించి, విశ్వసనీయత కోల్పోవడంతో వాడా ఈ నిర్ణయం తీసుకుంది.

డోపింగ్ కుంభకోణంలో పాత్రపై మూడేళ్ల సస్పెన్షన్ తర్వాత 2018లో కుదిరిన ఒప్పందం ప్రకారం రుసాడా తన నివేదికను వాడాకు అందించాల్సి వచ్చింది.

ప్రస్తుత నిషేధంపై అప్పీల్ చేసుకోవడానికి రుసాడాకు 21 రోజుల సమయం ఉందని వాడా తెలిపింది. ఒకవేళ అప్పీల్ చేస్తే, అది కోర్ట్ ఆఫ్ ఆర్బీట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)కు విచారణకు వెళ్తుంది.

రష్యాపై నిషేధం విధిస్తే సరిపోదు అని వాడా వైస్ ప్రెసిడెంట్ లిండా హెలీలాండ్ వ్యాఖ్యానించారు.

నీరుగార్చలేని ఆంక్షలను రష్యాపై విధించాలి అని ఆమె అన్నారు. ఆంక్షలను సాధ్యమైనంత కఠినంగా పాఠించాలని మేం అథ్లెట్లను కోరుతున్నామని ఆమె అన్నారు.

రష్యాలోని సోచీలో 2014లో నిర్వహించిన క్రీడల తర్వాత నిషేధం విధించడంతో మొత్తం 168 మంది అథ్లెట్లు ప్యాంగ్‌యాంగ్‌లో జరిగిన 2018 వింటర్ ఒలింపిక్స్‌లో తటస్థ జెండాతో పాల్గొన్నారు.

2015 నుంచి ఓ దేశంగా రష్యా అథ్లెటిక్స్‌లో పాల్గొనడంపై నిషేధాన్ని ఎదుర్కొంటోంది.

నిషేధం ఉన్నప్పటికీ రష్యా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగే యూరో 2020 క్రీడల్లో పాల్గొనవచ్చు. ఎందుకంటే యూరోపియన్ ఫుట్‌బాల్ నిర్వహణ సంస్థ యూఈఎఫ్ఓఏకు యాంటీడోపింగ్ ఆదేశాల ఉల్లంఘనల ప్రకారం ప్రధాన ఈవెంట్ నిర్వహణ సంస్థగా గుర్తింపు లేదు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)