జపాన్ వరదలు: రికార్డు వర్షపాతంతో 141 మంది మృతి

జపాన్ వరదలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, గాయపడ్డవారిని తరలిస్తున్న సహాయక బృందాలు

పశ్చిమ జపాన్‌‌ను వరదలు ముంచెత్తడంతో 141 మంది వరకూ చనిపోయి ఉంటారని అధికారులు తెలిపారు.

మరో 50 మందికి పైగా గల్లంతయ్యారని జపాన్ టైమ్స్ తెలిపింది. గత మూడు దశాబ్దాల జపాన్ చరిత్రలో భారీ వర్షాలకు ఇంత ప్రాణ నష్టం జరగలేదు.

గురువారం నుంచి పశ్చిమ జపాన్‌లోని చాలా ప్రాంతాల్లో జులైలో కురిసే సాధారణ వర్షపాతం కంటే మూడు రెట్లు అధికంగా వర్షాలు పడ్డాయి.

నదులు పొంగడంతో తీరప్రాంతాల్లో ఉన్న చాలా మందిని ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు.

"ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి వర్షాలను చూడలేదు" అని వాతావరణ అధికారులు చెప్పారు.

వీడియో క్యాప్షన్, వీడియో: వరద ప్రభావిత ప్రాంతాల ఏరియల్ వ్యూ

చనిపోయిన వారి మృతదేహాల కోసం, గల్లంతైనవారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.

"నీటి స్థాయి క్రమంగా తగ్గుతుండడంతో సహాయక బృందాలు వరద తాకిడికి గురైన ప్రాంతాలకు కాలినడకన చేరుకుంటున్నాయి" అని ఒకయామా అధికారి ఏఎఫ్‌పి న్యూస్ ఏజెన్సీకి చెప్పారు.

హిరోషిమా ప్రాంతంలో వచ్చిన వరదల్లో ఎక్కువ మంది మరణించారు.

జపాన్ వరదలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సహాయ కార్యక్రమాల్లో సైన్యం

వరద సహాయ బృందాలు వేగంగా పనిచేస్తున్నాయని ప్రధాని షింజో అబే ఆదివారం చెప్పారు.

గల్లంతైనవారు, ఇతరులు ఇంకా చాలా మంది ఉన్నారని, వారందరికీ సాయం అవసరమని తెలిపారు.

షికోకూ ద్వీపంపై ఉన్న మోటోయామా పట్టణంలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకూ 583 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

సోమవారం నుంచి కొన్ని ప్రాంతాల్లో 250 మిల్లీ మీటర్లకు పైగా వర్షాలు కురవచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

జపాన్ వరదలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)