వీసీ సజ్జనార్‌కు టీఎస్ఆర్టీసీ ఎండీగా బదిలీ, సైబరాబాద్ కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర నియామకం

వీసీ సజ్జనార్
ఫొటో క్యాప్షన్, వీసీ సజ్జనార్

సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి ఎం.స్టీఫెన్ రవీంద్రను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ స్థానంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వీసీ సజ్జనార్‌ను ఆ పదవి నుంచి బదిలీ చేసిన ప్రభుత్వం, ఆయనను ఆర్టీసి ఎండీగా నియమించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ప్రభుత్వం తరఫున ఆదేశాలు జారీ చేశారు.

కొత్తగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న స్టీఫెన్ రవీంద్ర 1999 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం వెస్ట్ జోన్ ఐజీగా పని చేస్తున్నారు.

సజ్జనార్‌ ను బదిలీ చేస్తూ వెలువడిన ప్రభుత్వ ఉత్తర్వులు
ఫొటో క్యాప్షన్, సజ్జనార్‌ ను బదిలీ చేస్తూ వెలువడిన ప్రభుత్వ ఉత్తర్వులు

‘దిశ’ కేసుతో సజ్జనార్ సంచలనం

1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ వీసీ సజ్జనార్ గత మూడేళ్లుగా సైబరాబాద్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన కాలంలో 'దిశ' కేసు వెలుగులోకి వచ్చింది. నిందితుల ఎన్‌కౌంటర్ తో ఆయన వ్యవహార శైలిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

కర్నాటకకు చెందిన విశ్వనాథన్ చెన్నప్ప సజ్జనార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పోలీసు అధికారిగా పనిచేశారు.

వరంగల్, మెదక్, నల్లగొండ, కడపలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. కొన్నాళ్లు ఇంటెలిజెన్స్ ఐజీగానూ పనిచేశారు.

2018లో సైబరాబాద్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.

వరంగల్‌లో యాసిడ్ దాడి చేసిన నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన సమయంలో ఆయన ఆ జిల్లా ఎస్పీగా ఉన్నారు.

స్టీఫెన్ రవీంద్ర

ఫొటో సోర్స్, StephenRavindra/FB

ఫొటో క్యాప్షన్, స్టీఫెన్ రవీంద్ర

సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేశారు. ఆయన వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితులని చెబుతుంటారు.

స్టీఫెన్ రవీంద్ర ప్రస్తుతం హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీగా పని చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)