రిపబ్లిక్‌ టీవీ సీఈఓ వికాస్‌ ఖాన్‌చందానీ టీఆర్‌పీ రేటింగ్స్‌ అక్రమాల కేసులో అరెస్ట్

వికాస్ ఖాన్‌చందానీ

ఫొటో సోర్స్, Twitter/Vikas Khandchandani

ఫొటో క్యాప్షన్, వికాస్ ఖాన్‌చందానీ

అక్రమంగా టీఆర్‌పీ రేటింగ్‌లు పెంచుకునేందుకు ప్రయత్నించారంటూ రిపబ్లిక్‌ టీవీతోపాటు మరో రెండు ఛానళ్లపై కేసు వ్యవహారంలో మరో అరెస్టు చోటు చేసుకుంది.

రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈఓ) వికాస్‌ ఖాన్‌చందానీని ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఏఎన్‌ఐ వెల్లడించింది. వికాస్‌ అరెస్టుతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 13కు చేరుకుంది.

అంతకు ముందు 2020 నవంబర్ 24న ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ టీఆర్‌పీ కుంభకోణానికి సంబంధించి ఛార్జిషీట్ దాఖలు చేసింది."టీఆర్‌పీ స్కామ్‌లో ఇది మొదటి ఛార్జిషీట్. ఇప్పటివరకు 140 మంది సాక్షులను విచారించాం. త్వరలోనే రెండో చార్జిషీట్ దాఖలు చేస్తాం" అని క్రైమ్ బ్రాంచ్ అధికారులు అప్పట్లో తెలిపారు.

పరమ్‌వీర్ సింగ్

ఫొటో సోర్స్, Hindustan Times

ఫొటో క్యాప్షన్, పరమ్‌వీర్ సింగ్

ఏమిటీ కేసు?

రిపబ్లిక్ టీవీ న్యూస్ ఛానెల్‌ సహా మూడు టీవీ ఛానెళ్లు డబ్బులు ఇచ్చి తమ టెలివిజన్ రేటింగ్ పాయింట్ల (టీఆర్‌పీ)ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ముంబయి పోలీసులు అక్టోబర్‌లో ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకూ మూడు టీవీ ఛానెళ్లకు పాత్ర ఉన్నట్లు గుర్తించామని అన్నారు.

ముంబయి పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ గురువారం ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.అయితే, రిపబ్లిక్ టీవీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.

''సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో మేం ప్రశ్నలు సంధించినందుకే, ముంబయి పోలిస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ రిపబ్లిక్ టీవీపై తప్పుడు ఆరోపణలు చేశారు. ఆయనపై మేం పరువు నష్టం దావా వేస్తాం. బార్క్ (టీఆర్‌పీలు వెల్లడించే సంస్థ) ఇంతవరకూ ఒక్క ఫిర్యాదులోనూ మా పేరు ప్రస్తావించలేదు. ఇలా మమ్మల్ని లక్ష్యంగా చేసుకోవడం... నిజం పట్ల మాకున్న నిబద్ధతను మరింత పెంచుతుంది'' అని ఈ ఆరోపణలపై ఆ ఛానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి అప్పట్లో స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)