ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏంటి? లబ్ధి పొందాలంటే అర్హతలు ఏంటి?

ఫొటో సోర్స్, facebook/ysrcpofficial
- రచయిత, అభినాష్ కంది
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల చిట్టా ఇంకాస్త పెరిగింది. ‘కాపు నేస్తం’ పేరుతో కొత్త పథకాన్ని రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.
పదమూడు నెలల పాలనలో వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలోని 3.98 కోట్ల మంది రూ.43 వేల కోట్లకు పైగా ఆర్థిక ప్రయోజనం తాము చేకూర్చామని జగన్ ప్రభుత్వం చెబుతోంది. ఈ ఏడాదిలోనే 23 లక్షలకు పైగా లబ్ధిదారులకు రూ.4,770 కోట్లు అందించామని అంటోంది.
పాత పథకాలకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త పేర్లు పెట్టిందని, సంక్షేమానికి పేదలను దూరం చేసిందని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం అంటోంది.
ఇంతకీ, ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమ పథకాలేంటి? వాటి ద్వారా అందే ప్రయోజనాలు ఏమున్నాయి? ఏయే పథకాలకు ఎవరెవరు అర్హులు?

ఫొటో సోర్స్, jaganannaammavodi.ap.gov.in
జగనన్న అమ్మ ఒడి
పేద విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఆర్థిక సాయం చేసేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకులాలు, జూనియర్ కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఏడాదికి రూ.15 వేల చొప్పున అందిస్తారు.
అర్హతలు:
లబ్ధిదారుల కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12వేల లోపు ఉండాలి.
విద్యార్థుల హాజరు కనీసం 75 శాతం ఉండాలి.
స్వచ్ఛంద సంస్థల ద్వారా చదువుకుంటున్న అనాథ పిల్లలు, వీధి బాలలు కూడా ఈ పథకం పరిధిలోకి వస్తారు.
ఎంతమంది పిల్లలున్నా, ఒక్కో లబ్ధిదారునికి రూ.15 వేలు మాత్రమే ఇస్తారు.
వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ
పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించేందుకు ఈ పథకం తెచ్చారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబం ఏడాదికి రూ.5 లక్షల వరకూ పూర్తిగా ఉచిత వైద్యం పొందొచ్చు.
పుట్టుకతో చెవుడు ఉన్న చిన్నారులకైతే రూ.12 లక్షల వరకూ వైద్య బీమా వర్తిస్తుంది. క్యాన్సర్ బాధితులకు రూ.5 లక్షలకు మించి ఎంత వ్యయమైనా ప్రభుత్వమే భరిస్తుంది.
ఈ పథకం కింద హైదరాబాద్, చైన్నై, బెంగళూరుల్లోనూ కొన్ని ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునేందుకు అవకాశం ఉంది. చికిత్స తర్వాత కోలుకునేవారికి ఆరోగ్య సమస్య తీవ్రతను బట్టి రోజుకు రూ.225 నుంచి రూ.5వేల వరకూ సాయం అందిస్తారు.
అర్హతలు:
కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించకూడదు.
మాగాణి భూమి 12 ఎకరాలలోపు... లేదా మెట్ట గానీ, మెట్ట, మాగాణి కలిపి గానీ 35 ఎకరాలలోపు ఉన్నవారికే వర్తిస్తుంది.
ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు, పెన్షన్దారులకు వర్తించదు.
నాలుగు చక్రాల వాహనం ఒకటికి మించి ఉండకూడదు.
మున్సిపాలిటీలో మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణానికి మించిన భవనం ఉండకూడదు.
వైఎస్ఆర్ పెన్షన్ కానుక
60 ఏళ్లు దాటిన వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్లు, డప్పు కళాకారులు, హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులు, కుష్ఠు వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారికి నెలవారీ పెన్షన్లు అందించేందుకు ఈ పథకం పెట్టారు.
కేటగిరినీ బట్టి రూ.2250 నుంచి రూ.10వేల వరకూ పెన్షన్ ఇస్తారు.
అర్హతలు:
కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12వేల లోపు ఉండాలి.
మాగాణి భూమి 3 ఎకరాలలోపు... లేదా మెట్ట గానీ, మెట్ట, మాగాణి కలిపి గానీ 10 ఎకరాలలోపు ఉన్నవారికే వర్తిస్తుంది.
వైఎస్ఆర్ కాపు నేస్తం
కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన కుటుంబాల ఆర్థిక స్వావలంబన కోసం ఈ పథకం తెచ్చారు.
ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఐదేళ్లపాటు రూ.75వేల సాయం అందిస్తారు.
అర్హతలు:
కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలై ఉండాలి.
కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలకు, పట్టణ ప్రాంతాల్లో రూ.12వేలకు మించకూడదు.
మాగాణి భూమి 3 ఎకరాలలోపు... లేదా మెట్ట గానీ, మెట్ట, మాగాణి కలిపి గానీ 10 ఎకరాలలోపు ఉన్నవారికే వర్తిస్తుంది.
పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి భవనం ఉండకూడదు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు, నాలుగు చక్రాల వాహనం (ఆటో, ట్యాక్సీ, ట్రాక్టర్కు మినహాయింపు ఉంది) ఉన్నవారు అనర్హులు.
పేదలకు ఇళ్లు
ఇళ్ల స్థలాలు లేని పేద కుటుంబాలకు ఉచితంగా ఇంటి స్థలం, పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఈ పథకం తెచ్చారు.
ఈ పథకం కింద అర్హులైన వారికి 1.5 సెంట్ల భూమిని కేటాయిస్తారు.
అర్హతలు:
రాష్ట్రంలో ఎక్కడా సొంత ఇల్లు గానీ, ఇంటి స్థలం గానీ ఉండకూడదు.
ఇతర కేంద్ర, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల లబ్ధిదారులకు వర్తించదు.
వ్యవసాయ భూమి 2.5 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్టకు మించి ఉండకూడదు.
వార్షిక వ్యక్తిగత ఆదాయం పట్టణాల్లో రూ.3 లక్షలకు మించకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి.
జగనన్న చేదోడు
సొంత షాపు ఉన్న రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీల (టైలర్ల)కు ఆర్థిక చేయూతను ఇచ్చేందుకు ఈ పథకం పెట్టారు.
లబ్ధిదారులకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు.
అర్హతలు:
బీసీ వర్గానికి చెందిన రజకులు, నాయూ బ్రాహ్మణులు, అన్ని కులాలకు చెందిన దర్జీ పనిచేసేవారు అర్హులు.
సొంతంగా షాపు ఉండాలి. వారి పేరు మీదే అది రిజిస్టరై ఉండాలి.
కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12వేల లోపు ఉండాలి.
మాగాణి భూమి 3 ఎకరాలలోపు... లేదా మెట్ట గానీ, మెట్ట, మాగాణి కలిపి గానీ 10 ఎకరాలలోపు ఉన్నవారికే వర్తిస్తుంది.
పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించి విస్తీర్ణమున్న భవనం ఉండకూడదు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు, నాలుగు చక్రాల వాహనం (ఆటో, ట్యాక్సీ, ట్రాక్టర్కు మినహాయింపు ఉంది) ఉన్నవారు అనర్హులు.

ఫొటో సోర్స్, facebook/ysrcpofficial
వైఎస్ఆర్ నేతన్న నేస్తం
చేనేత మగ్గాల మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు.
సొంత మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి రూ.24వేల సాయం అందజేస్తారు. కుటంబంలో ఎన్ని చేనేత మగ్గాలున్నా, ఒక్క మగ్గానికి వర్తించే సాయమే ఇస్తారు.
అర్హతలు:
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులై ఉండాలి.
సొంత మగ్గంపై పనిచేస్తూ, దానిపై జీవనోపాధి పొందుతున్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
ప్రాథమిక చేనేత సంఘాలు, మాస్టర్ వీవర్ షెడ్లలో పనిచేసే చేనేత కార్మికులు అనర్హులు.
కనీసం ఏడాదిగా సొంత మగ్గంపై పనిచేస్తున్నవారై ఉండాలి.
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన
ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు చేయూతను ఇచ్చేందుకు ఈ పథకం తెచ్చారు.
అర్హులైన విద్యార్థులకు అన్ని కోర్సులకు విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తారు.
వసతి దీవెన కింద వసతి, భోజన ఖర్చుల కోసం రూ.20వేలు ఇస్తారు. పాలిటెక్నిక్ కోర్సు చేస్తున్నవారికి రూ.15వేలు, ఐటీఐ కోర్సు చేస్తున్నవారికి రూ.10వేలు ఇస్తారు.
అర్హతలు:
కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉండాలి.
కుటుంబానికి మాగాణి భూమి 10 ఎకరాలలోపు... లేదా మెట్ట గానీ, మెట్ట, మాగాణి కలిపి గానీ 25 ఎకరాలలోపు ఉన్నవారికే వర్తిస్తుంది.
పట్టణ ప్రాంతాల్లో 1500 చదరపు అడుగులకు మించి విస్తీర్ణమున్న భవనం ఉండకూడదు.
కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు (పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఉంది), ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, పెన్షనర్లు ఉండకూడదు.
వైఎస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్
పెట్టుబడి సాయం అందించడం ద్వారా రైతుల ఆర్థిక ఇబ్బందలను తగ్గించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
భూమి ఎంత ఉందన్నదానితో సంబంధం లేకుండా అర్హులైన రైతులకు పీఎం కిసాన్ కింద వచ్చే రూ.6 వేలతో కలిపి మూడు వాయిదాల్లో ఏడాదికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తారు.
భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.
అర్హతలు:
కౌలు రైతులైతే ‘పంట సాగుదారు హక్కు ఒప్పంద పత్రం’ సమర్పించడం తప్పనిసరి. అటవీ భూములను సాగు చేస్తున్నకౌలుదారులు... ఇనాం, డి-పట్టా, దేవాదాయ శాఖ భూములను సాగు చేస్తున్న రైతులు కూడా అర్హులే.
లబ్ధిదారుని కుటుంబంలో పెళ్లి కాని పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నా, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా పథకం వర్తిస్తుంది.
వైఎస్ఆర్ చేయూత
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కోసం ఈ పథకం తెచ్చారు.
ఈ పథకం కింద ఒక్కో కుటుంబంలో ఓ మహిళకు ఏడాదికి రూ.18,750 వేల చొప్పున నాలుగేళ్లలో రూ.75వేల సాయం అందిస్తారు.
అర్హతలు:
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలై ఉండాలి.
కుటుంబ నెలవారీ ఆదాయం రూ.10వేల లోపు ఉండాలి.
మాగాణి భూమి 3 ఎకరాలలోపు... లేదా మెట్ట గానీ, మెట్ట, మాగాణి కలిపి గానీ 10 ఎకరాలలోపు ఉన్నవారికే వర్తిస్తుంది.
పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి భవనం ఉండకూడదు.
విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లకు మించకూడదు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు, నాలుగు చక్రాల వాహనం (ఆటో, ట్యాక్సీ, ట్రాక్టర్కు మినహాయింపు ఉంది) ఉన్నవారు అనర్హులు.
వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటున్న వారు అనర్హులు.
వైఎస్ఆర్ వాహనమిత్ర
స్వయం ఉపాధి కోసం కొత్తగా ఆటో, ట్యాక్సీ వంటివి కొనుక్కున్నవారికి ఆర్థిక సాయం అందించేందుకు ఈ పథకం పెట్టారు.
లబ్ధిదారులకు రూ.10 వేలు చొప్పున సాయం చేస్తారు.
అర్హతలు:
2020, మే 16లోగా వాహనం కొనుగోలు చేసి ఉండాలి.
భార్య పేరిట వాహనం కొనుగోలు చేసి నడుపుతున్నవారు కూడా అర్హులే.
లబ్ధిదారులకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండటం తప్పనిసరి.
ట్రాక్టర్, లైట్ లోడెడ్ వాహనాలకు ఈ పథకం వర్తించదు.
వీటితో పాటు డ్వాక్రా రుణాలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా, రైతులకు వడ్డీ లేని రుణాలు, విదేశీ విద్య పథకం, వైఎస్ఆర్ మత్స్యకార నేస్తం, వైఎస్ఆర్ లా నేస్తం, విద్యా కానుక, వైఎస్ఆర్ పెళ్లి కానుక, వైఎస్ఆర్ కంటి వెలుగు తదితర పథకాలను కూడా ఏపీ ప్రభుత్వం తెచ్చింది.
ఈ పథకాలకు గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా గానీ... గ్రామ, వార్డు సచివాలయానికి నేరుగా వెళ్లి గానీ ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చు. https://gramawardsachivalayam.ap.gov.in/ వెబ్పోర్టల్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. , వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్నవారికి ఏయే పత్రాలు ఎంత సమయంలోపు ఇవ్వాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

ఫొటో సోర్స్, facebook/ysrcpofficial
‘పాత పథకాలకే కొత్త పేర్లు’
ఇదిరవకు తమ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త పేర్లు పెట్టుకుని, ప్రచార ఆర్భాటాలకు పోతోందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం వ్యాఖ్యానించింది.
అమ్మ ఒడి సహా అనేక పథకాల్లో తీవ్ర ఆంక్షలతో వడపోత చేసి, పేదలను పథకాలకు దూరం చేస్తున్నారని శాసనసభలో తెలుగుదేశం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి బీబీసీతో అన్నారు.
‘‘జగన్మోహన్ రెడ్డి పాత పథకాలకు కొత్త పేర్లు పెడుతున్నారు. ఏదో సాధించామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. తెలుగుదేశం హయాంలో అమలైన మంచి పథకాలను జగన్ ప్రభుత్వం తీసేసింది. పసుపు కుంకుమ ద్వారా మేం ఎంతో మందికి ప్రయోజనం కల్పించాం. బీసీలకు చాలా ఉపయోగపడ్డ ఆదరణ పథకం వంటివాటిని కూడా నిలిపివేశారు’’ అని చెప్పారు.
‘‘హాస్టల్ విద్యార్థులకు ఇచ్చే స్కాలర్ షిప్లను ఆపేసి జగనన్న విద్యాదీవెన అని అంటున్నారు. ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు. అంతా ప్రచార ఆర్భాటమే. వెఎస్సార్సీపీ నేతల అవినీతి కూడా ఇప్పటికే బయటపడింది’’ అని అన్నారు.
‘సంక్షేమంలో కొత్త చరిత్ర’
సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్టించిందని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జి. శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
‘‘జగన్ హయాంలో అమలు చేసిన పథకాలు దేశంలో ఎక్కడా లేవు. విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు చేస్తున్నారు. ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 90శాతం మేనిఫెస్టో అమలు చేయడం ఓ చరిత్ర. రూ.80వేల కోట్లతో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం’’ అని ఆయన బీబీసీతో చెప్పారు.
ప్రభుత్వం అన్ని వర్గాలనూ ఆదుకుంటోందని... అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా పనిచేస్తోందని అన్నారు.
‘‘లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగుతోంది. గ్రామ సచివాలయంలో జాబితా పెడుతున్నాం. అందులో చోటుదక్కని అర్హులను చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నేరుగా నగదు బదిలీ కావడం వల్ల ఎంతో మేలు జరుగుతోంది’’ అని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సంక్షేమంలో జగన్ పాలన ఓ మైలు రాయి అని ఆయన వర్ణించారు.
అదనపు సమాచారం: వి. శంకర్, బీబీసీ కోసం
ఇవి కూడా చదవండి:
- అమెరికా వీసాలు.. విశేషాలు
- రూ.50,000కి చేరిన బంగారం ధర.. ఇప్పుడు కొంటే లాభమా.. అమ్మితే మంచిదా
- ప్రభుత్వ స్టేట్ హోంలో 57 మంది బాలికలకు కరోనావైరస్... పరీక్షల్లో ఏడుగురు గర్భవతులని వెల్లడి
- ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఎందుకు ఇవ్వట్లేదు?
- రష్యా అమ్మాయిల మనసు దోచుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుందా?
- ముంబయిలోని మురికివాడ ధారావిలో కరోనాను ఎలా కంట్రోల్ చేశారు
- టిబెట్ను చైనా ఎప్పుడు, ఎలా తన ఆధీనంలోకి తీసుకుంది?
- భారత్, చైనా ఘర్షణల తరువాత లేహ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి
- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం
- వైఎస్ జగన్ ఇంటర్వ్యూ: ‘నాకు ఈరోజు డబ్బు మీద ఆశ లేదు. నాకు ఉన్నది ఒకే ఒక ఆశ, అదేంటంటే..’
- వైఎస్ రాజశేఖర రెడ్డి: హెలికాప్టర్ అదృశ్యం తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








