కరోనావైరస్: ఆంధ్రప్రదేశ్ జైళ్లలో కోవిడ్-19 కేసులు... ఖైదీల బంధువుల్లో ఆందోళన

ఫొటో సోర్స్, Bobby
- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రిమాండ్ ఖైదీలు కొందరికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. ఇప్పటి వరకూ 4 జైళ్లలో ఖైదీలు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. వారిలో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఇద్దరు, రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఒకరు , తిరుపతి సబ్ జైల్లో ఒకరు, అనంతపురం జిల్లా జైలులో ఒకరు ఉన్నారు.
నెల్లూరు సెంట్రల్ జైలులో నమోదయిన కేసులలో ఇద్దరినీ ప్రస్తుతం కోవిడ్-19 ఆసుపత్రికి తరలించారు. వారిని ఓ దొంగతనం కేసులో చిన్నబజార్ పోలీసులు అదుపులోకి తీసుకోగా, కోర్టు ఆదేశాలతో 12వ తేదీన రిమాండ్కి తరలించిన్నట్టు జైలు అధికారులు వెల్లడించారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో 15వ తేదీన వారిని ఆసుపత్రికి తరలించారు.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో కరోనా పాజిటివ్ నమోదయిన నిందితుడు విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ప్రకటించారు. అత్యాచారం కేసులో అరెస్టయి ఈనెల 16వ తేదీన రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వచ్చినట్టు వెల్లడించారు. అతన్ని క్వారంటైన్ కి తరలించారు. జైలులో అతనితో పాటు ఉన్న ఖైదీలుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు జైలు ప్రకటించారు.
తమిళనాడుకి చెందిన ఓ నిందితుణ్ణి బాలికపై అత్యాచారయత్నం చేసిన కేసులో తిరుపతి జైలుకి రిమాండ్ కోసం తరలించారు. అతనికి పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం రుయా ఆసుపత్రిలోని ఐసోలేషన్ సెంటర్ కి తరలించారు.
అనంతపురం జిల్లా జైలులో కూడా ఓ అండర్ ట్రయల్ ఖైదీకి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అతన్ని కూడా ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు వచ్చిన పాజిటివ్ కేసులన్నీ రిమాండ్ ఖైదీలకు సంబంధించినవే. జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న వారిలో వైరస్ కేసులు ఇంతవరకూ లేవని అధికారులు చెబుతున్నారు.
ఏప్రిల్ మొదటి వారంలో రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న సుమారు 600 మంది ఖైదీలను ఇంటీరియమ్ బెయిల్ పై విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా సాధారణ కేసుల్లో ఇరుక్కున్న వారిని అప్పట్లో విడుదల చేశారు. ఆ తర్వాత మళ్లీ మే మధ్యలో తిరిగి వారంతా జైళ్లకి చేరినట్టు అధికారులు ప్రకటించారు. అప్పట్లో కేసులు నమోదు కాకపోవడంతో అందరినీ తిరిగి జైళ్లకి తరలించారు.
కానీ ప్రస్తుతం కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మరోసారి పెరోల్ పై పంపించే ప్రతిపాదన పరిశీలించాలని పలువురు కోరుతున్నారు. కరోనా కేసులు విస్తృతమవుతున్న సమయంలో ఖైదీల విషయంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని మళ్లీ సొంత ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేయాలని మానవహక్కుల కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు కోరుతున్నారు.

ఫొటో సోర్స్, jc diwakarreddt
జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు విషయంలో హైరానా
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు, టీడీపీ నేత అస్మిత్ రెడ్డిని ఈనెల 13నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. లారీలు, బస్సుల రిజిస్ట్రేషన్లలో పాల్పడిన అవకతవకల ఆరోఫణలపై వారిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అదే రోజు వారిని కోర్టు ముందు హాజరుపరచగా రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
కానీ, వారిని రిమాండ్ లో తీసుకోవడానికి అనంతపురం జిల్లా జైలు అధికారులు ఆసక్తిచూపలేదు. దాంతో వారి ఉత్తర్వులలో మార్పు చేసిన మళ్లీ అనంతపురం నుంచి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడప సెంట్రల్ జైలుకి తరలించాల్సి వచ్చింది.
అనంతపురం జైలులో వారిద్దరినీ చేర్చుకోపోవడానికి కారణం కరోనా వైరస్. సరిగ్గా 13వ తేదీనే అండర్ ట్రయల్ ఖైదీకి కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తం కావాల్సి వచ్చింది. జైలులో 3 రోజుల పాటు రిమాండ్ లో ఉండగా ఆ కరోనా పాజిటివ్ వచ్చిన నిందితుడితో సఖ్యతగా ఉన్నవారందరికీ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. సిబ్బంది కూడా కొంత ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కొత్తగా రిమాండ్ ఖైదీలను వెంటనే చేర్చుకోవడం సాధ్యం కాదని చెప్పాల్సి వచ్చింది. దాంతో హుటాహుటిన ఆదేశాలు మార్చి కడప తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఫొటో సోర్స్, Bobby
ఖైదీలకు కూడా క్వారంటైన్, అదే ఫలితాన్నిచ్చింది
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 4 సెంట్రల్ జైళ్లు (విశాఖ, రాజమహేంద్రవరం, కడప, నెల్లూరు) ఉన్నాయి. వాటితో పాటుగా జిల్లా జైళ్లు 8, స్పెషల్ సబ్ జైల్స్ 11, మహిళా జైలు 1, సబ్ జైళ్ళు 60 ఉన్నాయి. వాటిలో సుమారుగా 5వేల మంది ఖైదీలున్నారు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన వెంటనే జైళ్ల శాఖ అప్రమత్తం కావడంతో పాటుగా పలు మార్పులు కూడా చేసినట్టు జైళ్ల శాఖ ఐజీ జి జయవర్థన్ బీబీసీకి తెలిపారు.
ఆయన మాట్లాడుతూ "జైళ్లలో ఖైదీల విషయంలో భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా మార్పులు చేశాం. గదుల్లో ఎక్కువ మంది ఉండకుండా జాగ్రత్తలు పడుతున్నాం. ప్రతీ ఖైదీకి మాస్కూలు ధరించేలా ఆదేశాలు ఇచ్చాము. వాటిని పంపిణీ చేశాము. శానిటైజర్లు అందిస్తున్నాం. జైలు లోపల వైరస్ ఉండే అవకాశం లేదు. బయటి నుంచి వెళ్లే వారితోనే సమస్య రావచ్చు. అందుకు తగ్గట్టుగా కొత్తగా వచ్చే వారందరికీ పరీక్షలు చేయిస్తున్నాం.
రిమాండ్ ఖైదీల విషయంలో కూడా 21 రోజుల పాటు క్వారంటైన్ పాటించేలా చూస్తున్నాం. కొన్ని సబ్ జైళ్లలో అలాంటివి పాటించడానికి అవసరమైనన్ని గదులు లేవు. అయినప్పటికీ తగు రీతిలో వ్యవహరించాలని సూచించాము. సిబ్బంది కూడా అన్ని జాగ్రత్తలు పాటించేలా ఆదేశాలు ఇచ్చాము. నిత్యం ఇళ్లకు పోయి వచ్చే సిబ్బంది పూర్తి శానిటైజేషన్ చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్నాము. ఇప్పటి వరకూ ఈ జాగ్రత్తలు ఫలించాయి. 3నెలలుగా జైలు లోపల ఉన్న వారికి కరోనా వచ్చిన దాఖలాలు లేవు" అంటూ వివరించారు.

పాజిటివ్ కేసులు వచ్చిన జైళ్లలో పరీక్షలు
ఏప్రిల్ మొదటి నుంచి ఇప్పటి వరకూ జైల్లోకి కొత్తగా వెళ్లే ఖైదీలందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలుత టెస్టింగ్ శాంపిల్ స్వీకరించిన తర్వాత మాత్రమే వారిని అనుమతిస్తున్నారు. అయితే వారు జైలులో రిమాండ్ కి వెళ్లిన తర్వాత రెండు, మూడు రోజులకు రిపోర్ట్ వస్తున్నాయి. జూన్ రెండో వారం వరకూ జైళ్లలో ఎటువంటి కేసులు నమోదు కాలేదు. శిక్ష అనుభవిస్తున్న వారు గానీ, రిమాండ్ ఖైదీలకు గానీ పాజిటివ్ నమోదు కావడంతో ప్రశాంతంగా కనిపించింది. కానీ ఇప్పుడు వరుసగా ఒక్కో జైలులో కేసుల సంఖ్య కనిపిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే నాలుగు జైళ్లలో కేసులు రావడంతో కొంత కంగారు పెడుతోంది.
తిరుపతి జైల్లో కరోనా నమోదు అయిన వెంటనే సిబ్బంది 16 మందితో పాటుగా 72 మంది ఖైదీలకు పరీక్షలు నిర్వహించారు. అదే విధంగా నెల్లూరు, రాజమహేంద్రవరం సెంట్రల్ జైళ్లు, అనంతపురం లో కూడా అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించినట్టు ఆయా జైళ్ల అధికారులు తెలిపారు.

- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- కరోనావైరస్: మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా?
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

ఖైదీల కుటుంబీకుల్లో ఆందోళన
కృష్ణా జిల్లా పెనమలూరుకి చెందిన పి రమేష్ కుటుంబ వ్యవహరాల కేసులో ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అతని పరిస్థితిపై కుటుంబంలో ఆందోళన మొదలయ్యింది. రమేష్ తల్లి గడిచిన రెండు వారాల్లో రెండుసార్లు జైలు వరకూ వెళ్లినట్టు చెబుతున్నారు. కానీ జైళ్ల శాఖ మార్చిన నిబంధనల ప్రకారం ఆమెకు ప్రత్యక్ష ఇంటర్వ్యూ దక్కడం లేదు.
కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన నాటి నుంచి నేరుగా ఇంటర్వ్యూలు నిలిపేశారు. అయితే వారానికి నాలుగు రోజుల పాటు రోజుకి 10 నిమిషాల చొప్పున ఫోన్ కాల్స్ కి అనుమతిస్తున్నామని జైళ్ల శాఖ ఐజీ బీబీసీకి తెలిపారు. ఖైదీలు సూచించిన రెండు నెంబర్లలో మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చామన్నారు. దాని వల్ల నేరుగా ఇంటర్వ్యూలు లేకపోయినా వారికి ఎటువంటి సమస్యలు రాకుండా ఊరట కలిగించేలా ఈ మార్పు చేసినట్టు ఆయన వివరించారు.
నేరుగా తమ వాళ్ళని చూడాలనుకుంటే మాత్రం సాధ్యం కాకపోవడంతో ఆందోళనగా ఉందని సెంట్రల్ జైలు ఖైదీ రమేష్ తల్లి వసంత బీబీసీకి తెలిపారు. "ఆవేశంలో చేసిన తప్పిదానికి జైలు పాలయ్యాడు. ఆ తర్వాత ఇంటర్వ్యూలకు అవకాశం ఉండడంతో కొంత చూసుకోవడానికి ఉండేది. నెలకు రెండు, మూడు సార్లు వెళ్లి వచ్చేదానిని. ఇప్పుడు అనుమతి ఇవ్వడం లేదు. కరోనా వల్ల కుదరదంటున్నారు. జైల్లో కూడా కేసులు వస్తున్నాయి. ఏమవుతుందో అనే బెంగగా ఉంటోంది. జైల్లో అంతా కలిసే ఉంటారు. కాబట్టి ఇంకా కంగారుగా ఉంది" అంటూ ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు.
వసంత తో పాటుగా వందల మంది ఖైదీల కుటుంబాల్లో ఇలాంటి ఆందోళన కొంత ఉన్నప్పటికీ ప్రస్తుతానికి జైళ్లన్నీ సురక్షితంగానే ఉన్నాయని ఏపీ జైళ్ల శాఖ చెబుతోంది. తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల ఫలితం ఇస్తోందని చెబుతున్నారు.
ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జైళ్ల ఖైదీలతో ప్రత్యేక ఇంటర్వ్యూల విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఐజీ తెలిపారు. ఈ నెలాఖరు నాటికి సమీక్ష చేసి పరిస్థితిని బట్టి జూలై నుంచి భౌతికదూరం పాటించేలా ఇంటర్వ్యూలకు అవకాశం పరిశీలించాల్సి ఉందన్నారు.
కరోనావైరస్ హెల్ప్లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి
- జైల్లో సొరంగం తవ్వారు.. 75 మంది ఖైదీలు పరారయ్యారు
- ఎల్ చాపో గజ్మన్: ప్రపంచంలోనే అత్యంత పేరుమోసిన నేరస్తుడు
- గ్యాంగ్స్టర్ జాన్ డిలింగర్ బాడీని 85 ఏళ్ళ తరువాత సమాధి నుంచి ఎందుకు తవ్వి తీస్తున్నారు?
- ఇది హెలికాప్టర్లలో పరారైన దొంగల కథ - నమ్మలేరు కానీ నిజం
- ‘మా నాన్న ఒక గ్యాంగ్స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
- వెయ్యి మంది ప్రాణాలు తీసిన హంతకుడు.. కెమెరాల ముందు తన పాత్రలో తనే నటించాడు..
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








