జైల్లో సొరంగం తవ్వారు.. 75 మంది ఖైదీలు పరారయ్యారు

ఫొటో సోర్స్, Paraguay's ABC Color
పరాగ్వే దేశంలోని పెడ్రొ జాన్ కబల్లెరో నగరంలోని ఒక జైలు నుంచి 75 మంది ఖైదీలు తప్పించుకోవడం చర్చనీయాంశం అయ్యింది.
జైలు ప్రధాన ద్వారం నుంచే ఈ ఖైదీలంతా నడుచుకుంటూ బయటకెళ్లారని, వీరు తప్పించుకోవడానికి జైలు గార్డులు సహాయం చేసి ఉంటారని జైలు అధికారులు అనుమానిస్తున్నారు.
జైల్లో ఒక సొరంగాన్ని కూడా అధికారులు కనుగొన్నారు. అయితే, ఈ 'ఎస్కేప్ ఆపరేషన్'ని కప్పిపుచ్చేందుకే ఈ సొరంగం తవ్వి ఉంటారని భావిస్తున్నారు.
తప్పించుకుని పారిపోయిన ఖైదీల్లో చాలామంది బ్రెజిల్ దేశంలోని అతిపెద్ద ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్యాంగ్ అయిన ఫస్ట్ కమాండ్ ఆఫ్ ది క్యాపిటల్ (పీపీసీ)కి చెందినవారు.
బ్రెజిల్లోని సావో పాలో నగరం కేంద్రంగా పనిచేసే ఈ క్రిమినల్ గ్యాంగ్లో దాదాపు 30 వేల మంది సభ్యులు ఉన్నారు. వీరంతా మత్తు పదార్థాలను, ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తుంటారు. బ్రెజిల్తో పాటుగా చుట్టుపక్కలే ఉన్న పరాగ్వే, బొలీవియా, కొలంబియాల్లో కూడా ఈ ముఠా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
పెడ్రొ జాన్ కబల్లెరో నగరంలోని ఈ జైలు కూడా బ్రెజిల్ సరిహద్దుకు సమీపంలోనే ఉంది.

ఫొటో సోర్స్, Paraguay's ABC Color
ఆదివారం జైలు అధికారులు వచ్చి పీపీసీ సభ్యులను నిర్బంధించిన జైలు సెల్ను పరిశీలించారు. ఆ గది మొత్తం ఖాళీగా ఉంది. దాంట్లో దాదాపు 200 ఇసుక సంచులు కనిపించాయి.
సొరంగం నుంచి బయటకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ఒక ఖైదీని అధికారులు పట్టుకున్నారు.
ఈ వ్యవహారంలో జైలు అధికారుల పాత్ర ఉందని స్పష్టంగా తెలుస్తోందని దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఈక్లిడెస్ అకెవెడొ చెప్పారు.
''మేం టన్నెల్ని కనుగొన్నాం. కానీ, ఖైదీలను తప్పించడానికి లేదంటే దీన్నంతా కప్పిపుచ్చడానికి ఈ టన్నెల్ తవ్వారని భావిస్తున్నాం. జైలు సిబ్బంది సహకారం ఉంది'' అని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
గత కొద్ది రోజులుగా చిన్నచిన్న గ్రూపులుగా ఖైదీలను జైలు నుంచి తప్పించారని ఇంటెలిజెన్స్ సమాచారం తమకు ఉందని ఆయన వెల్లడించారు.
ఇదంతా జరుగుతున్నప్పుడు జైలు డైరెక్టర్ సెలవులో ఉన్నారు.

ఫొటో సోర్స్, Paraguay's ABC Color
జైలు అధికారులందరినీ విధుల నుంచి తొలగించి, వారిని అరెస్ట్ చేయాలని న్యాయ శాఖ మంత్రి సెసిలియా పెరెజ్ ఆదేశాలు జారీ చేశారని ల నసియన్ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
జైలు రెండో అంతస్తులో ఉన్న ఖైదీలు కూడా తప్పించుకున్నారని, వారి గదులన్నీ తెరచి ఉన్నాయని ఏబీసీ కార్డినల్ రేడియోతో మాట్లాడుతూ ఆమె అన్నారు.
ఖైదీలను తప్పించడానికి ఏజెంట్లకు సుమారు రూ.57 లక్షలు ఒప్పందం కుదిరినట్లు తమకు సమాచారం అందిందని, ఇది స్పష్టమైన అవినీతి అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఖైదీల్లో కొందరు బ్రెజిల్ వాసులు ఉన్నారు. వారంతా సరిహద్దు దాటి పారిపోయారని అకెవెడో చెప్పారు.
సరిహద్దు నుంచి బ్రెజిల్ వైపు ప్రాంతంలో కొన్ని దగ్ధమైన వాహనాలు కనిపించాయి.
బ్రెజిల్-పరాగ్వే సరిహద్దు ప్రాంతం మత్తు పదార్థాల అక్రమ రవాణా మార్గంగా పేరొందింది.

ఇవి కూడా చదవండి:
- ఈ ఫోటో మీ మానసిక ఒత్తిడిని చెప్పేస్తుందా? అసలు నిజమేంటి?
- వెయ్యి మంది ప్రాణాలు తీసిన హంతకుడు.. కెమెరాల ముందు తన పాత్రలో తనే నటించాడు..
- కొలంబియా: కుక్కను చంపితే రూ. 50 లక్షలు.. తలకు వెల కట్టిన డ్రగ్ మాఫియా.. కుక్కకు భద్రత పెంచిన పోలీసులు
- 'ఓ హత్య జరగబోతోంది... అది నాదే'
- ఏపీకి మూడు రాజధానులు.. పాలనకు విశాఖ, అసెంబ్లీకి అమరావతి, కర్నూలులో హైకోర్టు
- మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన ఫొటోలను గాంధీ స్మృతి మ్యూజియంలో నుంచి ఎందుకు తీసేశారు?
- భవిష్యత్తులో యంత్రాలు మనుషుల్లా మాట్లాడగలవా?
- గాలి నుంచి ఆహారం తయారు చేస్తున్న ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు.. ఇదెలా సాధ్యం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)










