స్టూడెంట్స్ లోన్ యాప్ల నయా దందా.. గడువులోగా అప్పు తీర్చకుంటే బ్లాక్మెయిల్ :ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
స్టూడెంట్స్ లోన్ యాప్స్ యువకులకు ఎడాపెడా ఆన్లైన్లో లోన్లు ఇస్తూ, అడ్డగోలుగా వడ్డీలు పిండుతూ, బెదిరింపులకు దిగుతున్నాయని, ఫలితంగా పలువురు యువకులు ఒత్తిడికి గురై, అప్పులు తీర్చేందుకు దారి తప్పుతున్నారని 'సాక్షి' ఓ కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం, హైదరాబాద్ సైబర్క్రైమ్ స్టేషన్లో నమోదైన బీటెక్ విద్యార్థి ఉదంతమే దీనికి ఉదాహరణ. ఎం-పాకెట్ యాప్లో అప్పు తీసుకున్న ఇతడు దాన్ని తీర్చడానికి సైబర్ నేరానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు.
విద్యార్థులకు రుణాలిచ్చే ఎం-పాకెట్, లెండ్ కరో, క్రేజీబీ, స్లైస్పే, ఉదార్ కార్డ్, రెడ్కార్పెట్ వంటి యాప్స్ అనేకం ఉన్నాయి. ఎదుటి వారిని నేరుగా కలవకుండానే ఇవి రుణాలు ఇచ్చేస్తుంటాయి. యాప్ను డౌన్లోడ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా అప్పు తీసుకునే విద్యార్థి తన ఆధార్ కార్డు, టెన్త్ మెమో లేదా పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, స్టూడెంట్ ఐడీ అప్లోడ్ చేయాలి. ఈ యాప్స్ రూ.500 నుంచి రూ.10 వేల వరకు రుణం ఇస్తున్నాయి.
ఆ మేరకు విద్యార్థి కోరుకున్న మొత్తం కొన్ని గంటల్లోనే అతనికి చెందిన పేటీఎం, గూగుల్ పే వాలెట్స్లోకి వచ్చి పడుతుంది. వడ్డీ, పెనాల్టీ కలిపి నెలకు 5 శాతం నుంచి 10 శాతం వరకు అవుతోంది. రూ. 2,000 అప్పు తీసుకుంటే మొదటి నెల పూర్తయ్యేలోపు రూ. 2,114, రెండో నెలలో రూ. 2,225, మూడో నెలలో రూ.2,450 వరకు చెల్లించాలి.
స్టూడెంట్లోన్ యా ప్స్ను ప్లేస్టోర్స్ నుం చి డౌన్లోడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు.. కాంటాక్ట్స్, ఫొటో స్, లొకేషన్ యాక్సెస్ కోసం అనుమతి కోరుతుంది. దీన్ని యాక్సెప్ట్ చేస్తేనే యాప్ ఇన్స్టాల్ అవుతుంది. విద్యార్థులకు రుణాలిస్తున్న ఈ యాప్స్ తమకున్న యాక్సెస్ ద్వారా సదరు విద్యార్థి ఫోన్లోని కాంటాక్ట్స్ లిస్ట్ను ముందే కాపీచేసి పెట్టుకుంటున్నాయి. రుణం చెల్లించకున్నా, తమ ఫోన్లకు స్పందించకపోయినా వాట్సాప్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నాయి. తమ వద్ద వారి కాంటాక్ట్ లిస్ట్ ఉందని చెబుతూ.. మచ్చుకు కొన్ని కాంటాక్ట్స్ను పేస్ట్ చేస్తు న్నారు. 'తక్షణం డబ్బు చెల్లించకపోతే మీ కుటుంబసభ్యులు, స్నేహితులకు ఫోన్లుచేసి చెబుతా'మని బెదిరిస్తున్నారు. ఆపై అప్పు చెల్లింపునకు గంట గడువిస్తున్నారు. అప్పటికీ చెల్లించకుంటే ఫోన్కాల్స్ మొదలవుతాయి.
''ఇటీవలే లెండ్ కరో యాప్ బ్లాక్మెయిలింగ్పై ట్విట్టర్ ద్వారా మా దృష్టికొచ్చింది. స్టూడెంట్స్ లోన్ యాప్స్ కారణంగా పెడదారి పడుతున్న విద్యార్థులు మరెందరో ఉండొచ్చు. దీన్ని సీరియస్గా తీసుకుని అప్పులు ఇచ్చే యాప్స్పై విచారణ చేస్తున్నాం. వీటికి సరైన అనుమతులు ఉన్నాయా? ఏ మేరకు వడ్డీలు వసూలు చేస్తున్నాయి? ఏ తరహా బ్లాక్మెయిలింగ్స్కు పాల్పడుతున్నాయి? వంటివి ఆరా తీస్తున్నాం. మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లల ఫోన్లను చెక్చేస్తూ ఏయే యాప్స్ ఉన్నాయో పరిశీలించాలి'' అని సిటీ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.
హైదరాబాద్ నగరానికి చెందిన బీటెక్ విద్యార్థి మూడు నెలల క్రితం ఎంపాకెట్ యాప్ నుంచి రూ. 2,000 అప్పు తీసుకున్నాడు. అది వడ్డీతో కలిపి రూ. 2,450 అయ్యింది. 'యాప్' నుంచి ఒత్తిడి పెరగడంతో కట్టుతప్పాడు. పరీక్ష రాయడానికి వెళ్లిన ఇతగాడు ఎగ్జామ్హాల్ బయట ఉన్న ఓ యువతి బ్యాగ్ నుంచి సెల్ఫోన్ తస్కరించాడు. అందులో 'సే హాయ్' చాటింగ్ యాప్ డౌన్లోడ్ చేశాడు. అందులోని వివరాల ఆధారంగా సదరు యువతి మాదిరిగానే ఈ యాప్లో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. తనతో చాటింగ్ చేయాలన్నా, తన ఫొటోలు కావాలన్నా కొంత మొత్తం చెల్లించాలంటూ తన పేటీఎం వాలెట్ నంబర్ ఇచ్చాడు. ఈ విద్యార్థి ఇదంతా ఆ యువతి డూప్లికేట్ సిమ్ తీసుకునేలోపే, అదే సిమ్కార్డు వాడి ఇవన్నీ చేసేశాడు.
దీంతో ఒకరిద్దరు కొంత మొత్తం ఇతడి పేటీఎంకు డబ్బు పంపారు. ఈలోపు డూప్లికేట్ సిమ్ తీసుకున్న ఆ యువతికి నగదు చెల్లించిన ఇద్దరు ఫోన్లు చేయడంతో ఆమె కంగుతిని సిటీ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి విద్యార్థిని పట్టుకున్నారు. తాను ఎంపాకెట్ నుంచి అప్పు తీసుకోవడం, అది తీర్చడానికి తప్పు చేసినట్టు విచారణలో చెప్పాడు. ఆ విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ యువతి కేసు వద్దని పోలీసులను కోరింది. దీంతో అధికారులు సోమవారం వీరిద్దరినీ రాజీపడటానికి కోర్టుకు పంపారు. బీటెక్ విద్యార్థి తండ్రి, సోదరిని ఠాణాకు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆడుకుందామని చెప్పి చిన్నారిపై సామూహిక అత్యాచారం
కరీంనగర్లో ఓ బస్తీకి చెందిన తొమ్మిదేళ్ల బాలికను మాయమాటలు చెప్పి నమ్మించిన ముగ్గురు యువకులు.. ఆ చిన్నారిపై మూడు రోజుల పాటు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన గురువారం వెలుగుచూసిందని 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. మూడో తరగతి చదువుతున్న బాలికకు జ్వరం రావటంతో ఈ నెల 24న ఇంట్లోనే ఉంచి తల్లిదండ్రులు పనులకు వెళ్లారు. పొరుగు ఇళ్లలో ఉండే ఇద్దరు యువకులు (20, 18 ఏళ్ల వయసు)తో పాటు, ఒక 13 ఏళ్ల బాలుడు ఆడుకుందామని చెప్తూ ఆ బాలికను తీసుకెళ్లి ఆట పేరుతో అత్యాచారం చేశారు. ముగ్గురూ మూడు రోజులు అదే తీరులో అకృత్యానికి పాల్పడ్డారు.
ఈ నెల 26న సాయంత్రం బాలిక తీవ్ర అనారోగ్యంతో ఉండటంతో తల్లిదండ్రులు చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. బాలికను తల్లి అడిగినపుడు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు.
నిందితులు ముగ్గిరి మీద పోక్సో కేసు నమోదు చేశామని మూడో ఠాణా సీఐ చెప్పారు. బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రీతి బాయి హత్యాచారం కేసు సిబిఐకి అప్పగింత
కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ప్రీతి బాయి హత్యాచారం కేసును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించిందని ‘ప్రజాశక్తి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ గురువారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేశారు.
దిల్లీ ప్రత్యేక పోలీసుల చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ఈ కేసులో సిబిఐ విచారణకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు.
కర్నూలు మండలంలోని పదో తరగతి విద్యార్థిని ప్రీతి బాయిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన సంగతి తెలిసిందే.

ఫొటో సోర్స్, Getty Images
విశాఖలో 1638 కిలోల గంజాయి సీజ్
విశాఖపట్నంలో అక్రమంగా తరలిస్తున్న 1,638 కిలోల నిషేధిత గంజాయిని పోలీసులు పట్టుకున్నారని ‘నవ తెలంగాణ’ ఒక కథనంలో చెప్పింది.
ఆ కథనం ప్రకారం.. రెండు వాహనాల్లో తరలిస్తున్న గంజాయి పోలీసుల ప్రత్యేక ఆపరేషన్లో పట్టుబడిందని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ 1,638 కిలోల గంజాయి విలువ 2.45 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారిందా? వైద్య నిపుణులు ఏమంటున్నారు?
- కరోనావైరస్: వన్య ప్రాణులను తినడాన్ని నిషేధించిన చైనా ప్రభుత్వం
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- దిల్లీ హింస: అశోక్ నగర్లో మసీదుపై జాతీయ జెండా, కాషాయ జెండా ఎగరేసింది ఎవరు? - గ్రౌండ్ రిపోర్ట్
- దిల్లీ హింస: ఆర్ఎస్ఎస్, అమిత్ షాల పేర్లు చెప్పవద్దన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్
- దిల్లీ హింస: తుపాకీ పట్టుకుని పోలీసులపై కాల్పులు జరుపుతున్న ఈ వ్యక్తి ఎవరు?
- బాలాకోట్ వైమానిక దాడి జరిగి ఏడాది.. ఈ ప్రశ్నలకు భారత్, పాక్ రెండు దేశాల దగ్గరా సమాధానాలు లేవు
- పాకిస్తాన్ ఎవరికి భయపడి భారత వింగ్ కమాండర్ అభినందన్ను విడిచిపెట్టింది?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
- యాపిల్ మొట్టమొదటి ఇండియన్ స్టోర్ 2021లో ప్రారంభం: టిమ్ కుక్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








