‘ఐఎన్ఎస్ విరాట్‌ను గాంధీ కుటుంబం వ్యక్తిగత టాక్సీలా ఉపయోగించింది’: నరేంద్ర మోదీ

రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీని నంబర్ వన్ అవినీతి పరుడని వ్యాఖ్యానించిన నరేంద్ర మోదీ మరోసారి ఎన్నికల ర్యాలీలో రాజీవ్ గాంధీని టార్గెట్ చేశారు.

ఈసారి దిల్లీలోని రాంలీలా మైదాన్ ఆయన విమర్శలకు వేదికైంది. బుధవారం రాజధానిలో తన మొదటి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను విమర్శిస్తూ, ఆ పార్టీ కాంగ్రెస్ చర్యలను బయటపెడుతున్నప్పుడు తనకు కోపం ఎందుకొస్తుందో చెప్పారు.

రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు గాంధీ కుటుంబం విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్‌ను ప్రైవేటు ట్యాక్సీలా ఉపయోగించేదని ఆయన ఆరోపించారు

రాజధానిలో ఏడు ఎంపీ స్థానాల కోసం మే 12న ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ, గాంధీ కుటుంబం సెలవుల విహారానికి విమాన వాహక నౌకను ఉపయోగించి, దానిని అవమానించిందన్నారు.

మోదీ అంతకు ముందు రాజీవ్ గాంధీ దేశంలో నంబర్ వన్ అవినీతిపరుడు అని విమర్శించారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Reuters

నరేంద్ర మోదీ ఏమన్నారు?

ఎవరైనా కుటుంబంతో కలిసి విమాన వాహక నౌకలో సెలవులు ఆస్వాదించడానికి వెళ్లడం మీరెప్పుడైనా విన్నారా. మీరు ఈ ప్రశ్నకు ఆశ్చర్యపోకండి. అది జరిగింది.. మన దేశంలోనే జరిగింది. కాంగ్రెస్‌లో ఆ ప్రముఖ కుటుంబం దేశానికే గర్వకారణం అయిన ఐఎన్ఎస్ విరాట్‌ను తమ పర్సనల్ టాక్సీలా ఉపయోగించుకుంది. ఇది రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. ఆయన పది రోజులు సెలవులు గడపడానికి వెళ్లారు. ఐఎన్ఎస్ విరాట్ ఆ సమయలో భారత జలాల్లో గస్తీ కోసం మోహరించారు. కానీ, దానిని సెలవులు గడపడానికి వెళ్తున్న రాజీవ్ గాంధీ కుటుంబం కోసం పంపించారు. ఆ తర్వాత ఆయన తన మొత్తం పటాలాన్ని తీసుకుని ఐఎన్ఎస్ విరాట్ ఒక ప్రత్యేక ద్వీపం చేరుకుంది. పది రోజులు అక్కడే ఉంది. రాజీవ్ గాంధీతో సెలవులు గడపడానికి ఆయన అత్తింటి వారు కూడా వచ్చారు. విదేశీయులను భారత యుద్ధ నౌకలో తీసుకెళ్లి దేశ భద్రతతో చెలగాటం ఆడారా లేదా అనేదే ఇక్కడ ప్రశ్న. లేదంటే ఆయన రాజీవ్ గాంధీ అని, ఆయన అత్తింటి వారు ఇటలీ నుంచి వచ్చారని అలా చేశారా?

రాజీవ్ గాంధీ నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం, నౌకాదళం ఆయన కుటుంబానికి, అత్తింటి వారికి ఆతిథ్యం ఇచ్చారని ప్రధాన మంత్రి మోదీ చెప్పారు. వారి సేవల కోసం ఒక హెలికాప్టర్‌ను కూడా అక్కడ ఉంచారన్నారు.

భారత నౌకాదళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత నౌకాదళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్ (2006 ఫిబ్రవరి 12వ తేదీన విశాఖపట్నంలో తీసిన చిత్రం)

ఇంతకీ విహారానికి వెళ్లారా? లేదా? ఇండియా టుడే వార్త ఏంటి?

2013 నవంబర్ 21న ప్రచురించిన ఇండియా టుడే వార్త ఆధారంగా నరేంద్ర మోదీ ఒక ట్వీట్ కూడా చేశారు. అందులో భారత సైన్యానికి చెందిన ప్రముఖ విమాన వాహక నౌకను వ్యక్తిగత సెలవులకు టాక్సీలా ఉపయోగించవచ్చని ఎవరైనా ఎప్పుడైనా ఊహించారా అన్నారు.

విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్ భారత నౌకా దళంలోకి 1987లో ప్రవేశించింది. సుమారు 30 ఏళ్లు సేవలు అందించిన తర్వాత 2016లో దానిని సేవల నుంచి వేరు చేశారు.

ఇండియా టుడే ప్రచురించిన వార్త ప్రకారం...

ఈ ద్వీపం లక్షద్వీప్‌లోని 36 దీవుల్లో ఒకటి. దీని పేరు బంగారాం. ఈ ద్వీపం పూర్తిగా నిర్జనంగా ఉంటుంది. సుమారు అర చదరపు కిలోమీటరు వ్యాపించి ఉంది.

ఈ ద్వీపంలో ఎన్నికలు కూడా బాగా ఆలోచించి నిర్వహిస్తారు. ఇక్కడ విదేశీ పౌరుల రాకపోకలపై ఎలాంటి నిషేధం లేదు. లక్షదీవుల అప్పటి పోలీస్ చీఫ్ పీఎన్ అగ్రవాల్ బంగారాం ద్వీపం చాలా సురక్షితం అని, ప్రపంచానికి దూరంగా ఉండే ప్రాంతం అని చెప్పారు. ఈ ప్రాంతం ప్రకృతి పరంగా సహజంగా, సురక్షితంగా ఉంటుంది అన్నారు.

ఈ వార్తల ప్రకారం ఇక్కడ ఉన్న వారందరూ హై ప్రొఫైల్ వారు అనేది దాచిపెట్టలేం. వీరిలో రాహుల్, ప్రియాంక గాంధీల నలుగురు స్నేహితులు, సోనియా గాంధీ సోదరి, మరిది, వారి కూతురు, సోనియా తల్లి, ఆమె సోదరుడు, మామయ్య ఉన్నారు. ఈ పర్యటనలో రాజీవ్ గాంధీ ఆప్త మిత్రుడు అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయాబచ్చన్, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ పిల్లల్లో అమితాబ్ సోదరుడు అజితాబ్ కూతురు కూడా ఉన్నారు.

రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ 1987 డిసెంబర్ 30న మధ్యాహ్నం ఈ అందమైన దీవికి చేరుకున్నారు. అమితాబ్ బచ్చన్ మాత్రం ఒక రోజు తర్వాత కొచిన్-కవరత్తి హెలికాప్టర్‌లో అక్కడకు చేరుకున్నారు.

బంగారాం ద్వీపం దగ్గర అమితాబ్ బచ్చన్ పర్యటన వార్తను రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించారు.

అమితాబ్ హెలికాప్టర్ బంగారాం నుంచి కొంత దూరంలో ఉన్న కవరత్తిలో ఇంధనం నింపుకోడానికి వెళ్లినప్పుడు ఆయన అక్కడ దిగారు. దీంతో అమితాబ్ అక్కడికి వచ్చారనే విషయం అందరికీ తెలిసిపోయింది.

తర్వాత అమితాబ్ సెలవులు ముగించి తిరిగి వస్తున్నప్పుడు కొచిన్ ఎయిర్ పోర్టులో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఫొటోగ్రాఫర్ ఒకరు ఆయన ఫొటో తీశారు. అమితాబ్‌కు దాని గురించి కోపం కూడా వచ్చింది. ఫొటోగ్రాఫర్‌ను ఆయన హెచ్చరించారు కూడా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)