రాజీవ్ గాంధీ చివరి క్షణాల్లో ఏం జరిగింది? ఒక యువతి గంధపు మాల తీసుకుని ఆయన పాదాలను తాకేందుకు వంగగానే..

ఫొటో సోర్స్, Keystone/Getty Images
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తన హత్యకు కొన్ని గంటల ముందే అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ ఒక మాట అన్నారు. ‘‘అమెరికా అధ్యక్షుడిని ఎవరైనా చంపాలనుకుంటే అది పెద్ద విషయమేం కాదు. నన్ను చంపినందుకు ఆ హంతకుడు కూడా తన జీవితాన్ని వదులుకోవాలని నిర్ణయించుకోవాలి. అలా జరిగితే ప్రపంచంలోని ఏ శక్తీ నన్ను కాపాడలేదు."
1991 మే 21న రాత్రి పది గంటల 21 నిమిషాలకు తమిళనాడులోని శ్రీపెరంబదూర్లో అలాగే జరిగింది.
నల్లగా, బొద్దుగా 30 ఏళ్లున్న ఒక యువతి ఒక గంధపు మాల తీసుకుని భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వైపు కదిలింది. ఆమె ఆయన పాదాలను తాకేందుకు వంగగానే, చెవులు పగిలిపోయేలా ఒక పేలుడు సంభవించింది.
ఆ సమయంలో వేదికపై రాజీవ్ గాంధీని గౌరవిస్తూ ఒక పాట ఆలపిస్తున్నారు.. ‘‘రాజీవ్ జీవితమే మా జీవితం... ఇందిరాగాంధీ కుమారుడికి సమర్పించని ఈ జీవితం జీవితమే కాదు.’’
అక్కడికి సుమారు 10 గజాల దూరంలో గల్ఫ్ న్యూస్ ప్రతినిధి, ప్రస్తుతం డెక్కన్ క్రానికల్, బెంగళూరులో స్థానిక సంపాదకులు అయిన నీనా గోపాల్ ఉన్నారు. రాజీవ్ గాంధీ సహచరుడు సుమన్ దూబేతో మాట్లాడుతున్నారు.

"నేను బతికానంటే అది ఒక అద్భుతమే"
నీనా ఆ రోజును గుర్తు చేసుకున్నారు. "నేను సుమన్తో మాట్లాడ్డం ప్రారంభించి రెండు నిమిషాలు కూడా కాలేదు, నా కళ్ల ముందే బాంబు పేలింది. నేను సాధారణంగా తెల్ల బట్టలు వేసుకోను. ఆ రోజు హడావుడిగా ఒక తెల్ల చీర కట్టుకున్నాను. బాంబు పేలగానే, నేను నా చీర వైపు చూశాను. అది మొత్తం నల్లగా మారిపోయింది. దానిపైన మాంసం ముద్దలు, రక్తపు చుక్కలు పడ్డాయి. నేను బతికానంటే అది ఒక అద్భుతమే. నా ముందు నిలబడ్డ అందరూ ఆ పేలుడులో చనిపోయారు."
"బాంబు పేలడానికి ముందు చిటపటమని టపాసులు పేలిన శబ్దం వచ్చింది, వెంటనే నిశ్శబ్దం ఏర్పడింది. తర్వాత భారీ శబ్దంతో బాంబు పేలింది. నేను ముందుకు పరిగెత్తా, అక్కడ ఉన్న వారి బట్టలకు మంటలు అంటుకున్నాయి. అందరూ అరుస్తున్నారు. భయంతో చుట్టూ పరుగులు తీస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రాణాలతో ఉన్నారో, లేదో మాకు తెలియలేదు" అన్నారు నీనా.
శ్రీపెరంబదూర్లో ఆ భయంకర పేలుడు సమయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతలు మూపనార్, జయంతి నటరాజన్, రామమూర్తి అక్కడ ఉన్నారు. పొగలు అలముకోవడంతో రాజీవ్ గాంధీ కోసం వెతకడం ప్రారంభించారు. ఆయన శరీరంలో ఒక భాగం, సగం తల కనిపించింది. ఆయన కపాలం ఛిద్రమైంది. దాని నుంచి బయటికొచ్చిన మెదడు, ఆయన సెక్యూరిటీ అధికారి పీకే గుప్తా కాళ్లపై పడి ఉంది. ఆయన కూడా అంతిమ ఘడియల్లో ఉన్నారు.

ఫొటో సోర్స్, VT FREEZE FRAME
పేలుడు తర్వాత స్థితి
తర్వాత జీకే మూపనార్ ఒక చోట ఇలా రాశారు.. " పేలుడు జరగగానే నేను పరుగులు తీశాను. నా ముందు శవాల భాగాలు పడి ఉన్నాయి. రాజీవ్ సెక్యూరిటీ అధికారి ప్రదీప్ గుప్తా అప్పటికి బతికే ఉన్నారు. ఆయన నావైపు చూశారు. ఏదో చెప్పాలనుకున్నారు, నా కళ్ల ముందే ప్రాణాలు వదిలారు. ఆయన రాజీవ్ గాంధీని ఎవరికో అప్పగించాలని అనుకుంటున్నట్టు అనిపించింది. నేను ఆయన తల ఎత్తాలనుకున్నా. నా చేతికి మాంసం ముక్కలు, రక్తమే వచ్చింది. వాటిని ఒక టవలుతో కప్పేశాను" అన్నారు.
మూపనార్కు కాస్త దూరంలోనే జయంతీ నటరాజన్ షాక్తో నిలబడి పోయారు.
తర్వాత ఆమె కూడా ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు.. "పోలీసులందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. నాకు శవాలు కనిపిస్తున్నాయి. రాజీవ్ కనిపిస్తారేమోనని వెతుకుతున్నా. మొదట నాకు ప్రదీప్ గుప్తా కనిపించారు. ఆయన మోకాళ్ల దగ్గర.. నేలపై ముఖం ఛిద్రమైన ఒక తల కనిపించింది. నా నోటి నుంచి ‘ఓ మై గాడ్... దిస్ లుక్స్ లైక్ రాజీవ్’ అనే మాట వచ్చింది".
అక్కడే నిలబడ్డ నీనా గోపాల్ ముందుకు నడిచి కొన్ని నిమిషాల ముందు రాజీవ్ నిలబడ్డ చోటుకు వెళ్లారు.
"నేను ఎంత దూరం వెళ్లగలనో, అంతవరకూ వెళ్లాను. అప్పుడు నాకు రాజీవ్ గాంధీ శరీరం కనిపించింది. నేను ఆయన లోటో బూట్లు చూశా, తర్వాత చేయి చూశా, దానికి గుచ్చీ వాచ్ ఉంది. కాసేపటి ముందు నేను కారు వెనక సీటులో కూర్చుని ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నా, రాజీవ్ ముందు సీటులో కూర్చున్నారు. ఆయన మణికట్టు వాచీ తరచూ నా కళ్లకు కనిపిస్తూ వచ్చింది" అని నీనా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
10 గంటల 25 నిమిషాలకు 10 జన్పథ్లో..
"అంతలోనే రాజీవ్ గాంధీ డ్రైవర్ నా దగ్గరకు వచ్చి కార్లో కూర్చోండి అన్నాడు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపొండి అన్నాడు. నేను ఇక్కడే ఉంటాను అనగానే, తను ఇక్కడ చాలా గందరగోళం జరగబోతోంది అన్నాడు. మేం బయల్దేరాం. రాజీవ్ శవాన్ని తీసుకెళ్తున్న ఆ అంబులెన్స్ వెనకే ఆస్పత్రికి వెళ్లాం."
10 గంటల 25 నిమిషాలకు దిల్లీలో రాజీవ్ నివాసం 10, జన్పథ్ దగ్గర నిశ్శబ్దం అలుముకుంది. రాజీవ్ ప్రైవేట్ సెక్రటరీ విన్సెంట్ జార్జ్ చాణక్యపురిలో ఉన్న తన ఇంటి వైపు వెళ్లిపోయారు.
ఆయన ఇంట్లోకి అడుగు పెట్టగానే, ఫోన్ రింగ్ వినిపించింది. అవతలి వైపు నుంచి ఆయనకు తెలిసిన ఒక వ్యక్తి "చెన్నైలో రాజీవ్ గాంధీ సభలో బాంబు పేలుడు జరిగిందని" చెప్పాడు.
జార్జ్ మళ్లీ 10 జన్పథ్కు పరుగులు తీశారు, అప్పటికే సోనియా, ప్రియాంక కూడా పడుకోడానికి వెళ్లిపోయారు. అప్పుడే వాళ్లకు కూడా "ఏం కాలేదు కదా" అని ఫోన్లు వచ్చాయి. సోనియా ఇంటర్కామ్లో జార్జ్ను పిలిచారు. జార్జ్ ఆ సమయంలో చెన్నైలో పి.చిదంబరం భార్య నళినితో మాట్లాడుతున్నారు. వాళ్ల మాటలు పూర్తయ్యేవరకూ తను లైన్లోనే ఉంటానని సోనియా ఆయనతో అన్నారు.
రాజీవ్ గాంధీ లక్ష్యంగా ఒక పేలుడు జరిగిందనే విషయాన్ని నళిని నిర్ధారించారు. కానీ సోనియాకు ఈ వార్త చెప్పడానికి జార్జ్ ధైర్యం చేయలేకపోయారు. 10 గంటల 50 నిమిషాలకు ఫోన్ మరోసారి మోగింది.

ఫొటో సోర్స్, Getty Images
సోనియా గాంధీకి వార్త తెలియగానే..
రషీద్ కిద్వాయ్ సోనియా జీవిత చరిత్ర పుస్తకంలో ఇలా పేర్కొన్నారు.. "ఫోన్ చెన్నై నుంచి వచ్చింది. ఈసారి ఫోన్ చేసిన వారు తాము ఎలాగైనా మేడమ్ లేదా జార్జ్తో మాట్లాడాలని చెప్పారు. తను నిఘా విభాగానికి చెందిన వ్యక్తినని చెప్పారు. కంగారు పడిపోయిన జార్జ్ రాజీవ్ ఎలా ఉన్నారని ఆయన్ను అడిగారు. ఆ వైపు నుంచి ఐదు సెకన్లు మాట వినిపించలేదు. కానీ జార్జ్కి అతను అలాగే ఉండిపోతాడేమో అనిపించంది. దాంతో బొంగురుపోయిన గొంతుతో ఆయన గట్టిగా అరిచారు, "రాజీవ్ ఎలా ఉన్నారో చెప్పవేంటి?" అన్నారు. దాంతో ఫోన్ చేసిన వ్యక్తి "సర్, ఆయన మనకిక లేరు" అన్నాడు. ఆ తర్వాత లైన్ డెడ్ అయ్యింది."
"మేడమ్, మేడమ్ అని అరుస్తూ ఇంటి లోపలికి పరిగెత్తారు జార్జ్. నైట్ గౌన్లో ఉన్న సోనియా వెంటనే బయటికి వచ్చారు. ఏదో జరగరానిది జరిగిందని ఆమెకు అర్థమైపోయింది."
సాధారణంగా ప్రశాంతంగా ఉండే జార్జ్, అలా ఇంతకు ముందెప్పుడూ కనిపించలేదు. జార్జ్ వణికిపోతున్న గొంతుతో "మేడమ్ చెన్నైలో ఒక దాడి జరిగింది" అన్నాడు.
సోనియా ఆయన కళ్లలోకి చూస్తూ "ఈజ్ హీ అలైవ్" అని అడిగారు. జార్జ్ మౌనమే సోనియాకు జరిగిన ఘోరం గురించి తెలిసేలా చేసింది.
"ఆ తర్వాత సోనియా నిశ్చేష్టులయ్యారు. 10 జన్పథ్ గోడలు మొదటి సారి సోనియా రోదించడం విన్నాయి. ఆమె ఎంత గట్టిగా ఏడ్చారంటే, అప్పుడప్పుడే బయట ఉన్న గెస్ట్ రూంలోకి చేరుకుంటున్న కాంగ్రెస్ నేతలందరికీ ఆ ఏడుపులు స్పష్టంగా వినిపించాయి. అక్కడ అందరికంటే ముందు రాజ్యసభ సభ్యుడు మీమ్ అప్జల్ వచ్చారు" అని రషీద్ ఆ పుస్తకంలో రాశారు.

హత్య వెనుక ఎల్టీటీఈ హస్తం
"సోనియా ఏడ్చిన శబ్దం బయట వరకూ వినిపించిందని ఆయనే నాకు చెప్పారు. ఆ సమయంలో సోనియాకు ఆస్తమా అటాక్ చాలా తీవ్రంగా వచ్చింది. ఆమె దాదాపు స్పృహతప్పిపోయారు. ప్రియాంక ఆమె మందుల కోసం వెతుకుతున్నారు. కానీ అవి దొరకలేదు. ఆమె సోనియాను ఊరడించే ప్రయత్నం కూడా చేశారు. కానీ సోనియాపై ఆమె మాటలు ఎలాంటి ప్రభావం చూపించ లేకపోయాయి.’’
ఈ కేసు విచారణ కోసం సీఆర్పీఎఫ్ ఐజీ డాక్టర్ డీఆర్ కార్తికేయన్ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు.
తర్వాత కొన్ని నెలల్లోనే ఈ హత్యారోపణలతో ఎల్టీటీఈకి చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు.
ప్రధాన నిందితుడు శివరాజన్, ఆయన సహచరులు అరెస్ట్ కావడానికి ముందు సైనైడ్ తీసుకున్నారు.

ఫొటో సోర్స్, AFP
ఏడాది లోపే చార్జిషీటు దాఖలు
డాక్టర్ కార్తికేయన్ బీబీసీతో మాట్లాడుతూ "హరిబాబు కెమెరా నుంచి ఆ పది ఫొటోలు లభించడమే మా మొదటి విజయం అని చెప్పచ్చు. మేం సాధారణ ప్రజల సూచనలు తీసుకోడానికి పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చాం. ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చాం. మాకు మొత్తం 4 వేల టెలిఫోన్ కాల్స్ వచ్చాయి. ప్రతి కాల్నూ సీరియస్గా తీసుకున్నాం. అన్ని చోట్లా తనిఖీలు చేయడం ప్రారంభించాం. దాంతో త్వరగానే ఈ కేసులో సత్ఫలితాలు వచ్చాయి" అన్నారు.
"మేం దీని కోసం తొలి రోజు నుంచే 24 గంటలూ విరామం తీసుకోకుండా వారమంతా పనిచేశాం. నేను రోజూ పని తర్వాత రాత్రి రెండు గంటలకు కాసేపు పడుకోవడానికి గెస్ట్ హౌస్ వెళ్లేవాడ్ని. మొత్తం దర్యాప్తు మూడు నెలల్లో పూర్తైంది. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రావడం ఆలస్యమైంది. అయినా హత్య జరిగిన ఏడాది లోపే మేం కోర్టులో చార్జిషీటు దాఖలు చేయగలిగాం."
కొన్ని రోజుల తర్వాత సోనియా గాంధీ తను నీనా గోపాల్ను కలవాలని అనుకుంటున్నట్టు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
"భారత రాయబార కార్యాలయం అధికారులు దుబయ్ ఫోన్ చేసి సోనియా నన్ను కలవాలని అనుకుంటున్నట్టు నాకు చెప్పారు. జూన్ మొదటి వారంలో నేను అక్కడికి వెళ్లాను. మా ఇద్దరికీ అది చాలా కఠినమైన కలయిక. అంతిమ ఘడియల్లో రాజీవ్ మూడ్ ఎలా ఉందని, ఆయన చివరిసారి ఏం చెప్పారని ఆమె నన్ను పదేపదే అడిగారు" అని నీనా గోపాల్ చెప్పారు.
"నేను ఆయన మంచి మూడ్లో ఉన్నారని, ఎన్నికల్లో విజయం కోసం ఉత్సాహంగా ఉన్నారని" ఆమెకు చెప్పాను. ఆమె నా చేయి పట్టుకుని అలా ఏడుస్తూనే ఉండిపోయారు. ఆమె జయంతి నటరాజన్తో ఆ గల్ఫ్ న్యూస్ అమ్మాయి మీనా (నీనా బదులు మీనా అన్నారు) ఎక్కడుందని అడిగినట్టు నాకు తర్వాత తెలిసింది. జయంతీ నా వైపు వచ్చేందుకు వెనక్కు తిరిగింది. అప్పుడే ఆ పేలుడు జరిగింది" అని నీనా చెప్పారు.

ఫొటో సోర్స్, STEFAN ELLIS/Getty Images
రాజీవ్ మాటలు నిజం అయ్యాయి
ఇందిరా గాంధీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న పీసీ అలగ్జాండర్ తన "మై డేస్ విత్ ఇందిరాగాంధీ" అనే పుస్తకంలో "ఇందిరా గాంధీ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ కారిడార్లో సోనియా, రాజీవ్ గొడవ పడడం తనకు కనిపించిందని" రాశారు.
రాజీవ్ సోనియాతో "పార్టీ నన్ను ప్రధాన మంత్రిగా ప్రమాణం చేయాలని కోరుకుంటోంది" అన్నారు. సోనియా ఆయనతో అలా చేయద్దని చెప్పింది. "వాళ్లు నిన్ను కూడా చంపేస్తారు" అంది. దానికి రాజీవ్ "నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా" అన్నారు.
ఏడేళ్ల తర్వాత రాజీవ్ చెప్పిన ఆ మాటలే నిజమయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- ‘ఏసుక్రీస్తును అలా భావించలేను.. మీ స్టాంపును వాడలేను’
- రాహుల్గాంధీ ఈమెను పెళ్లి చేసుకోబోతున్నారని వదంతులొచ్చాయి. ఇంతకీ ఈమె ఎవరు?
- ఎంఎస్ ధోని: ‘నమ్మిన దాని కోసం పోరాడుతూనే ఉండండి’
- చంపారన్: ‘‘నేను దేవుణ్నీ, అహింసనీ, సత్యాన్నీ దర్శించాను’’
- హిట్లర్ మరణించాడని ప్రపంచానికి బీబీసీ ఎలా చెప్పింది?
- రాహుల్కు పగ్గాలు అప్పగించాక సోనియా ఏం చేస్తారు?
- ‘కర్ణాటక ఎన్నికల్లో ఓటమికి కాంగ్రెస్ నాయకత్వ లోపమే కారణం’
- ఓషో వల్లనే రాజీవ్ రాజకీయాల్లోకి వచ్చారా?
- అభిప్రాయం: కాంగ్రెస్ను ‘పీపీపీ’గా మార్చేసిన మోదీ-షా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









