IND vs AUS: ఆస్ట్రేలియాపై భారత్ విజయం.. ధోనీ, జాదవ్ అర్థ సెంచరీలు

ఎంఎస్ ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌ను భారత జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది.

భారత జట్టు 48.2 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 240 పరుగులు చేసింది.

భారత బ్యాట్స్‌మెన్లలో కేదార్ జాదవ్ అత్యధికంగా 87 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 81 పరుగులు చేశారు. జాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఎంఎస్ ధోనీ 72 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 59 పరుగులు చేశాడు. చివరి రెండు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టి భారత జట్టుకు విజయం అందించాడు.

237 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు నాలుగు పరుగులకే మొదటి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 44 పరుగులు చేసి ఔటయ్యాడు.

రోహిత్ శర్మ 66 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 37 పరుగులు, అంబటి రాయుడు 19 బంతుల్లో రెండు ఫోర్ల సహాయంతో 13 పరుగులు చేసి ఔటయ్యారు.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

అంతకు ముందు ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ ఖవాజా 76 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్ల సహాయంతో 50 పరుగులు, మ్యాక్స్ వెల్ 51 బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో 40 పరుగులు, స్టోనిస్ 53 బంతుల్లో ఆరు ఫోర్ల సహాయంతో 37 పరుగులు చేశారు.

సున్నా పరుగులకే ఓపెనర్ ఆరోన్ ఫించ్ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా వంద పరుగుల్లోపే మూడు వికెట్లు నష్టపోయింది.

భారత బౌలర్లలో బుమ్రా, మొహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. కేదార్ జాదవ్ ఒక వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)