#10YearChallenge: ఈ సోషల్ మీడియా చాలెంజ్లో ఫొటోలు పెడుతున్నారా... జాగ్రత్త

ఫొటో సోర్స్, Instagram
#10YearChallenge… ప్రపంచ వ్యాప్తంగా ఫేస్బుక్, ట్విటర్లో విపరీతంగా ట్రెండ్ అవుతోన్న కొత్త చాలెంజ్ ఇది. ఇందులో భాగంగా జనాలు తమ పదేళ్ల క్రితంనాటి ఫొటోను, ప్రస్తుత ఫొటోను తీసుకొని పక్కపక్కన పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
గతంలో తాము ఎలా ఉన్నారో, ఇప్పుడు ఎలా మారారో చెప్పేందుకే ఇలా #10yearChallenge పేరుతో ఫొటోలు షేర్ చేస్తున్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
దీనికి ఎంతలా స్పందన వస్తోందంటే, ఈ చాలెంజ్ మొదలైన 3 రోజుల్లోనే 52 లక్షల మందికిపైగా తమ ఫొటోలను షేర్ చేశారు.
కానీ, ఈ చాలెంజ్ వెనుక అనేక కోణాలు ఉన్నాయని, ఇదో బిజినెస్ ఐడియా కూడా కావొచ్చని, కాబట్టి దీంతో జాగ్రత్తగా ఉండాలని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంతకీ ఈ ట్రెండ్ ఎలా మొదలైంది? ఈ చాలెంజ్ వల్ల ఎదురయ్యే సమస్యలేంటి?

ఫొటో సోర్స్, Twitter
ఎవరు పాల్గొన్నారు?
10 ఇయర్ చాలెంజ్ను 2009 వర్సెస్ 2019 చాలెంజ్, గ్లో అప్ చాలెంజ్ అని పిలుస్తున్నారు. దీన్ని ఎవరు మొదలుపెట్టారన్న దానిపై ఇప్పటిదాకా ఎలాంటి స్పష్టత లేదు. అయితే ఫేస్బుక్ చూపించే మెమరీస్ స్ఫూర్తితో ఇది మొదలై ఉంటుందని భావిస్తున్నారు.
సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు కూడా ఈ చాలెంజ్లో భాగమవుతున్నారు. శ్రుతిహాసన్, కరణ్ జోహార్, శిల్పా శెట్టి, సోనమ్ కపూర్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి చాలామంది భారతీయులు ఇందులో భాగమయ్యారు.
అయితే, కేవలం అందానికే ప్రాధాన్యమిస్తూ చాలామంది తమ అందాన్ని చూపించుకునేందుకే ఈ చాలెంజ్ ప్రాధాన్యమిస్తోందనే విమర్శలున్నాయి.
కొందరు సెలెబ్రిటీలు మాత్రం దానికి భిన్నంగా స్పందించారు. రోహిత్ శర్మ పై ఫొటోను షేర్ చేస్తూ, నాకు బాగా ఆందోళన కలిగిస్తోన్న 10 ఇయర్స్ చాలెంజ్ ఇదే అని పోస్ట్ చేశారు. రాశీ ఖన్నా కూడా ‘ఓ ఫొటోను పోస్ట్ చేసి, అప్పుడు నన్ను చాలామంది వెక్కిరించేవాళ్లు. కానీ నన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అని రాసుకొచ్చారు.

ఫొటో సోర్స్, Instagram
సమస్యలేంటి?
అయితే ఈ 10 ఇయర్స్ చాలెంజ్ దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని సైబర్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్ తన కృత్రిమ మేధా వ్యవస్థకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ఈ ఫొటోలను ఉపయోగించే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి.
అదెలాగంటే, ఇప్పటికే ఫేస్బుక్లో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇలా పదేళ్ల నాటి ఫొటోలు, ఇప్పటి ఫొటోలు ఒకే దగ్గర చేరితే, ఆ ముఖాల్లో వచ్చిన మార్పులను స్టడీ చేయడం ద్వారా మనుషుల మొహాలను గుర్తించే టెక్నాలజీని ఆ సంస్థ మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది.
కానీ, ఫేస్ బుక్ మాత్రం దాన్ని ఒప్పుకోవట్లేదు. యూజర్లకు తమ వెబ్సైట్లో ఫేషియల్ రికగ్నిషన్ ఆప్షన్ను ఆఫ్ చేసుకునే అవకాశం కూడా ఉందని అది సూచిస్తోంది.

మరోపక్క ఈ ఫొటోలు ప్రకటనకర్తలకు కూడా టార్గెట్గా మారే అవకాశం ఉంటుంది. పదేళ్ల క్రితం ఫొటోలను, ఇప్పటి ఫొటోలను విశ్లేషించడం ద్వారా బ్యూటీ ప్రాడెక్ట్స్, ఇతర వైద్య సేవల ప్రకటనలను యూజర్లకు ఎక్కువ సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది.
అలాగే పదేళ్లలో మరీ ఎక్కువ మార్పులు వచ్చినట్టు కనిపిస్తే, అలాంటి వారిని ఇన్సూరెన్స్ సంస్థలు కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అంటే, మొత్తంగా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉంది.
ఫొటోల మార్ఫింగ్కు కూడా చాన్స్ ఉండటంతో కాస్త ఆచితూచి ఫొటోలను షేర్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









