యమునా నదిలో ఈ విషపూరిత నురగ ఎందుకొస్తోంది?

నీటిలో పెద్దయెత్తున ఏర్పడిన నురగను చూస్తున్న చిన్నారి

భారత్‌లోని ముఖ్యమైన నదుల్లో ఒకటైన యమునా నదిలో ప్రతి సంవత్సరం పెద్దయెత్తున విషపూరితమైన నురగ ఏర్పడుతోంది. నీటిలోని ప్రాణులకు, పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలిగిస్తోంది. దేశంలోని అనేక కాలుష్య ప్రభావిత నదుల్లో యమున ఒకటి. ఇంతకూ ఈ నురగ ఎలా ఏర్పడుతోంది? దీనిని నియంత్రించాలంటే ఏం చేయాలి?

పారిశ్రామిక వ్యర్థాలు, శుద్ధిచేయని ఇతర వ్యర్థాలే ఈ నురగకు మూల కారణం. శుద్ధిచేయని మురుగు నీటిలో చాలా కలుషిత పదార్థాలుంటాయి. వీటిలో అత్యంత సమస్యాత్మకమైనది ఫాస్ఫేట్.

నదులు, ఇతర నీటి వనరుల అడుగున ఉండే మడ్డిలో ఫాస్ఫేట్ పేరుకుంటుంది. కలుషితాల కారణంగా నీటిలో ఆక్సిజన్ స్థాయి పడిపోతుంది. వాన లేదా పెనుగాలుల వల్ల నీటివనరుల్లోని నీరు బాగా కదిలినప్పుడు ఫాస్ఫేట్, ఇతర కలుషితాలు విడుదలవుతాయి. అప్పుడు నురగ ఏర్పడుతుంది.

దిల్లీలో యుమునా నదిలో ఇదే జరుగుతోంది. ఏ ప్రాణీ బతకలేనంత తక్కువ స్థాయికి నీటిలోని ఆక్సిజన్ చేరుకొంటోంది.

కాలుష్యం

'కెనడా, అమెరికా నుంచి నేర్చుకోవాలి'

కెనడా లాంటి దేశాల నుంచి భారత్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని పర్యావరణ కార్యకర్త టీవీ రామచంద్రన్ చెప్పారు.

''కెనడా, అమెరికాలతోపాటు ఐరోపాలోని పలు దేశాల్లో లోగడ ఈ సమస్య తలెత్తింది. అప్పుడు ఫాస్ఫేట్ ఆధారిత డిటర్జెంట్‌పై నిషేధం విధించారు. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. అయితే భారత్‌లో ఫాస్ఫేట్‌పై నియంత్రణ లేదు'' అని ఆయన విచారం వ్యక్తంచేశారు.

యమునా నది సహజ ప్రవాహాన్ని పునరుద్ధరించాలని కూడా నిపుణులు చెబుతున్నారు.

''నది సహజ ప్రవాహానికి వీలు కల్పించలేకపోతే కాలుష్య నియంత్రణ సాధ్యం కాదు. భారత్ లాంటి దేశాల్లో కలుషిత జలాల కారణంగా నదులు, ఇతర నీటివనరులు దెబ్బతింటున్నాయి. నీటిలోని ప్రాణులు చనిపోతున్నాయి'' అని పర్యావరణ కార్యకర్త మనోజ్ మిశ్రా ఆందోళన వ్యక్తంచేశారు.

వీడియో క్యాప్షన్, యమునా నదిలో ఈ నురగ ఎందుకు ఏర్పడుతోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)