2023లో మానవ జీవితాల్ని మార్చబోయే 5 శాస్త్రీయ పరిశోధనలు

ఇస్రో ఆదిత్య మిషన్

ఫొటో సోర్స్, ISRO

గత ఏడాది అంటే 2022లో సైన్స్, వైద్యం, అంతరిక్షరంగంలో మనం అద్భుతమైన పురోగతిని చూశాం.

పోయిన ఏడాది నాసా చేపట్టిన ఆర్టెమిస్ ప్రోగ్రామ్స్ వంటివి చంద్రుని వైపు మనుషులు మళ్లీ ఆసక్తిగా చూసేలా చేశాయి. మరి ఈ ఏడాది ఎలాంటి అద్భుతాలను చూడనున్నాం?

చంద్రుడు

ఫొటో సోర్స్, POT

1. ఇస్రో ఆదిత్య

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన విశ్వం చిత్రాలను చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇలాంటి మరిన్ని అద్భుతాలను ఈ ఏడాది కూడా చూడొచ్చు.

సుమారు ఆరేళ్లపాటు సోలార్ ఆర్బిట్‌లో తిరిగే యూక్లిడ్ టెలిస్కోప్‌ను 2023లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించనుంది. అంతరిక్షపు 3డీ మ్యాప్‌ను యూక్లిడ్ టెలిస్కోప్ తయారు చేస్తుంది.

సుదూరంలోని నక్షత్రాలు, గెలాక్సీల నుంచి వచ్చే ఎక్స్-రే కిరణాలను గుర్తించేందుకు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ సన్నాహాలు చేస్తోంది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అనేక అంతరిక్ష మిషన్స్ చేపట్టనుంది. సూర్యుని మీద పరిశోధనలు చేసేందుకు ఈ ఏడాది ఆదిత్య అనే మిషన్‌తోపాటు చంద్రయాన్-3ని కూడా చేపడుతోంది ఇస్రో.

చంద్రుడు

ఫొటో సోర్స్, NASA

2. చంద్రుని మీదకు మనిషి

చంద్రుని మీదకు మరొకసారి మనిషిని పంపేందుకు నాసా సిద్ధమవుతోంది. గత ఏడాది డిసెంబరులో ఆర్టెమిస్‌లో భాగంగా పంపిన ఒరాయిన్ క్యాప్సుల్ చంద్రుని వద్దకు వెళ్లి తిరిగి క్షేమంగా భూమి మీదకు వచ్చింది.

2024 నాటికి చంద్రుని మీదకు మనిషి పంపాలని నాసా భావిస్తోంది కాబట్టి, అందుకు సంబంధించిన మరిన్ని పరిశోధనలు, సన్నాహకాలు ఈ ఏడాదిలో ఉండనున్నాయి.

గగన్‌యాన్‌ మిషన్ ద్వారా మనుషులను చంద్రుని మీదకు పంపాలని ఇస్రో భావిస్తోంది. 2024లో ఈ మిషన్ చేపట్టనున్నారు. ఇందుకు ముందుగా స్పేస్ క్రాఫ్ట్‌ను పరీక్షించాల్సి ఉంటుంది. అందువల్ల ఈ ఏడాది మనుషులు లేని స్పేస్‌క్రాఫ్ట్‌ను చంద్రుని వద్దకు ఇస్రో పంపే అవకాశం ఉంది. అది విజయవంతమైతే ఆ తరువాత మిషన్‌లో మనుషులను చంద్రుని మీదకు పంపుతారు.

జపాన్‌కు చెందిన హకుటో-ఆర్ మాడ్యుల్ చంద్రుని మీద సాఫ్ట్ ల్యాండ్‌కు ప్రయత్నించనుంది. చంద్రయాన్-3 మిషన్ ద్వారా ఇస్రో తొలి రోవర్‌ను చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద దించనుంది.

అందరిలో ఆసక్తి రేపుతున్న మరొక సంస్థ స్పేస్ ఎక్స్‌కు చెందిన స్టార్‌షిప్. ప్రపంచంలో తొలిసారి సాధారణ ప్రజలతో కూడిన స్టార్‌షిప్ చంద్రుని వద్దకు వెళ్లనుంది. జపాన్‌కు చెందిన సంపన్నుడు యుసాకా, మరొక 8 మందితో కలిసి ఆరు రోజుల పాటు విహరించనున్నారు.

జన్యుపటం

ఫొటో సోర్స్, Getty Images

3. జెనెటిక్ ఇంజినీరింగ్

మనుషుల జన్యునిర్మాణాన్ని సవరించగల జెనెటిక్ ఇంజినీరింగ్‌కు సంబంధించిన ‘క్రిస్పర్-కాస్‌9’ థెరపీకి ఈ ఏడాది అనుమతులు లభించొచ్చు. జెనెటిక్ ఇంజినీరింగ్ అనేది వైద్యరంగంలో ఒక విప్లవంగా చెప్పుకోవచ్చు.

సికెల్ సెల్ వంటి వ్యాధుల్లో రక్తకణాల్లోని జన్యులోపాలను ఈ పద్ధతి ద్వారా సమర్థవంతంగా సరిదిద్దినట్లు క్లినికల్ ట్రయిల్స్‌ ఫలితాలు చెబుతున్నాయి.

ఫార్మా కంపెనీలు వెర్టెక్స్, క్రిస్పర్ థెరప్యూటిక్స్ కలిసి సికెల్ సెల్ వ్యాధి కోసం ‘ఎక్సా-సెల్’ అనే ట్రీట్‌మెంట్‌ను రూపొందిస్తున్నాయి. వచ్చే మార్చిలో అనుమతుల కోసం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయనున్నాయి.

అనుమతులు లభిస్తే సికెల్ సెల్‌తో బాధపడే వారికి ఒక చికిత్సా పద్ధతి అందుబాటులోకి వస్తుంది.

మెదడు

ఫొటో సోర్స్, Getty Images

4. అల్జీమర్స్‌కు మందు

పోయిన ఏడాది అల్జీమర్స్‌కు మందును కనిపెట్టినట్లు ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో ఈ మందుకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌ అనుమతులు ఇవ్వొచ్చని భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మందు అల్జీమర్స్ తొలి దశలోనే పని చేస్తుంది. ఈ వ్యాధి చికిత్సలో ఇది తొలి అడుగు అని పరిశోధకులు చెబుతున్నారు.

5. కొత్త తరం వ్యాక్సీన్లు

వ్యాక్సిన్

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్‌ కోసం ఎంఆర్‌ఎన్‌ఏ అంటే మెసేంజర్ రైబోన్యూక్లిక్ యాసిడ్ ఆధారిత కొత్త తరం వ్యాక్సిన్లను రూపొందించారు. ఇతర వ్యాధులకు కూడా ఈ టెక్నాలజీ ఆధారంగానే వ్యాక్సిన్లు డెవలప్ చేస్తున్నారు.

మలేరియా, టీబీ, జెనిటల్ హెర్పిస్, హెచ్‌ఐవీ, సిస్టిక్ ఫైబ్రోసిస్, క్యాన్సర్ వంటి వాటికి ఈ విధంగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేయొచ్చు.

మరికొద్ది రోజుల్లో మలేరియా, టీబీలకు సంబంధించి తొలి ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్‌ను జర్మనీకి చెందిన బయోన్‌టెక్ కంపెనీ మనుషుల మీద పరీక్షించనుంది. అలాగే అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ మోడెర్నా కూడా జెటిల్ హెర్పిస్ వ్యాక్సిన్‌ను టెస్ట్ చేయనుంది.

క్యానర్స్‌ కణాలను ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ గుర్తించి నాశనం చేస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)