లూలా: 'ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడు కావొచ్చు.. కానీ, ప్రపంచానికి చక్రవర్తి కాదు'.. బ్రెజిల్ అధ్యక్షుడు 'బీబీసీ' ఇంటర్వ్యూలో ఇంకా ఏం చెప్పారంటే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లోన్ వేల్స్, లింద్రో ప్రెజెర్స్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా అన్నారు.
లూలా తరచుగా ట్రంప్ను విమర్శిస్తూ ఉంటారు.
అయితే, వారిద్దరి మధ్య మాటలు కూడా నిలిచిపోయినట్లు ఈ ఇంటర్వ్యూతో వెల్లడైంది.
ట్రంప్, బ్రెజిల్ ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్లు విధించారు. రెండు దేశాల మధ్య చర్చల తర్వాత ట్రంప్ ఈ టారిఫ్లను తగ్గిస్తారని ఆశించారు.
కానీ, ఆ చర్చలు సఫలం కాలేదని లూలా వ్యాఖ్యలతో స్పష్టమైంది.
బ్రెజిల్తో అమెరికాకు వాణిజ్య మిగులు ఉన్నప్పటికీ, ట్రంప్ జులైలో బ్రెజిల్ వస్తువులపై 50 శాతం టారిఫ్ విధించారు.
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు, రైట్ వింగ్ నేత అయిన జైర్ బోల్సోనారోపై 'తిరుగుబాటు కుట్ర' కేసు విచారణ జరుగుతుండటమే దీనికి కారణమని ఆయన అన్నారు.
అమెరికా సుంకాలు పూర్తిగా రాజకీయపరమైనవని లూలా అభివర్ణించారు. ఈ కారణంగా అమెరికా వినియోగదారులు ఇప్పుడు బ్రెజిల్ వస్తువులను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందని అన్నారు.


'ట్రంప్ తప్పులకు మూల్యం చెల్లించనున్న అమెరికన్లు'
అమెరికాకు ఎగుమతి అయ్యే కాఫీ, బీఫ్ ఉత్పత్తులపై ట్రంప్ టారిఫ్ల ప్రభావం పడింది.
బ్రెజిల్తో సంబంధాల విషయంలో అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న తప్పులకు అమెరికా ప్రజలు మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని లూలా అన్నారు.
ట్రంప్, లూలా నేరుగా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు.
ట్రంప్కు నేరుగా ఎందుకు ఫోన్ చేయలేదని, ఆయనను సంప్రదించడానికి ఎందుకు ప్రయత్నించలేదని లూలాను అడిగినప్పుడు, ''ఆయన ఎప్పుడూ మాట్లాడాలని అనుకోలేదు. అందుకే నేను కూడా ఎప్పుడూ ఫోన్ చేయలేదు'' అని బదులిచ్చారు.
లూలా కావాలంటే ఎప్పుడైనా తనకు ఫోన్ చేయవచ్చని గతంలో ట్రంప్ అన్నారు.
కానీ, ట్రంప్ ప్రభుత్వంలోని వ్యక్తులకు మాట్లాడటమే ఇష్టం లేదని లూలా అన్నారు.
అమెరికా టారిఫ్ల గురించి తనకు బ్రెజిల్ వార్తాపత్రికల ద్వారా తెలిసిందని బీబీసీతో లూలా అన్నారు.
''అమెరికా అధ్యక్షుడు మర్యాదపూర్వకంగా చర్చలు జరపలేదు. కేవలం సోషల్ మీడియా ద్వారా టారిఫ్లు ప్రకటించారు'' అని తెలిపారు.
అమెరికా అధ్యక్షుడితో సంబంధాలెలా ఉన్నాయని అడిగినప్పుడు, 'అసలు ఏ సంబంధమూ లేదు' అని ఆయన సమాధానమిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
'ట్రంప్ ఏమీ ప్రపంచానికి చక్రవర్తి కాదు'
అమెరికా గత అధ్యక్షులు, బ్రిటన్ ప్రధాన మంత్రులు, యూరప్, చైనా, యుక్రెయిన్, వెనిజులా ఇలా ప్రపంచంలోని అన్ని దేశాలతో తాను సంబంధాలు కొనసాగించానని లూలా అన్నారు.
ఈ ఏడాది రష్యాలో జరిగిన రెండో ప్రపంచ యుద్ధం వార్షికోత్సవ వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు హాజరయ్యారు. పుతిన్తో తన సంబంధాలను ఆయన తెంచుకోలేదు.
ట్రంప్, పుతిన్లలో ఎవరితో మీ సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని అడిగినప్పుడు, పుతిన్తో తన బంధాన్ని ఆయన సమర్థించుకున్నారు.
''ఈ సంబంధం ఈరోజుది కాదు. నేను, పుతిన్ అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచే మా బంధం కొనసాగుతోంది. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు నేను అధ్యక్ష పదవిలో లేను. అందుకే ట్రంప్తో పెద్దగా నాకు సంబంధాలు లేవు. ట్రంప్కు బోల్సోనారోతో సంబంధం ఉంది, బ్రెజిల్తో కాదు'' అని లూలా అన్నారు.
వచ్చే వారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ట్రంప్ తనకు ఎదురుపడితే ఆయనను పలకరిస్తానని లూలా చెప్పారు.
'ఎందుకంటే, నేనొక నాగరికుడిని. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావొచ్చు. కానీ, ప్రపంచానికి చక్రవర్తి కాదు' అని అన్నారు.
ట్రంప్పై లూలా చేసిన విమర్శల గురించి అడిగినప్పుడు.. గతంలో బ్రెజిల్పై అమెరికా అధ్యక్షుడు చేసిన బహిరంగ వ్యాఖ్యలను బీబీసీ పరిశీలించాలని అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
'ప్రభుత్వాన్ని కూల్చడానికి బోల్సోనారో ప్రయత్నించారు'
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో గురించి కూడా లూలా మాట్లాడారు. గత వారం ఆయనకు శిక్ష పడింది.
బ్రెజిల్ సుప్రీంకోర్టులోని ఐదుగురు న్యాయమూర్తుల్లో నలుగురు బోల్సోనారోను తిరుగుబాటు కుట్రలో దోషిగా నిర్ధరించారు.
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తిరుగుబాటుకు కుట్ర పన్నినందుకు ఆయనకు 27 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.
బోల్సోనారో, ఆయన స్నేహితులు కలిసి దేశానికి హాని చేశారని, తిరుగుబాటుకు ప్రయత్నించారని, తనను హత్య చేయడానికి కుట్ర పన్నారని బీబీసీతో లూలా చెప్పారు.
'బోల్సోనారోపై దౌర్జన్యం జరుగుతోందని, బ్రెజిల్లో ప్రజాస్వామ్యం లేదని ట్రంప్ అన్నారు. ఆయన అబద్ధాలు సృష్టిస్తున్నారు' అంటూ విమర్శించారు.
2021 జనవరి 6న, అమెరికా క్యాపిటల్ హిల్పై జరిగిన దాడి బ్రెజిల్లో జరిగి ఉంటే ట్రంప్పై విచారణ జరిగేదని లూలా అన్నారు.
'శాశ్వత సభ్యదేశాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాయి'
ఐక్యరాజ్యసమితి (యూఎన్)లో సంస్కరణలకు ఆయన మద్దతు తెలిపారు.
''ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలకు నిర్ణయాలపై వీటో అధికారం ఉంది. ఇది అధికార సమతుల్యాన్ని మార్చేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచిన దేశాల పక్షాన మొగ్గుతుంది. కోట్లాది మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించే బ్రెజిల్, జర్మనీ, భారత్, జపాన్, ఆఫ్రికా ఇందులో భాగం కావడం లేదు.
అందుకే ఐక్యరాజ్యసమితికి సంఘర్షణలను పరిష్కరించే శక్తి లేదు. యుద్ధం వంటి విషయాలపై ఐదు శాశ్వత సభ్యదేశాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాయి'' అని లూలా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'యుక్రెయిన్పై దాడిని ఖండించాం'
చైనా, రష్యాలతో తమ కూటమిని లూలా సమర్థించుకున్నారు.
యుక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ప్రకటించిందని, అయినప్పటికీ రష్యా నుంచి బ్రెజిల్ చమురు కొనుగోలు చేస్తోందని అడిగినప్పుడు.. యుక్రెయిన్పై దాడిని ఖండించిన మొదటి దేశాల్లో బ్రెజిల్ కూడా ఉందని ఆయన చెప్పారు.
ఐక్యరాజ్యసమితి సరిగ్గా పని చేసి ఉంటే యుక్రెయిన్, గాజా యుద్ధాలు జరిగేవి కాదని అన్నారు. ఇవి ''యుద్ధాలు కాదు, మారణహోమాలు'' అని ఆయన అభివర్ణించారు.

ఫొటో సోర్స్, Getty Images
మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా?
2026 అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలా? లేదా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదని 79 ఏళ్ల లూలా చెప్పారు.
తన ఆరోగ్యం, పార్టీ, రాజకీయ వాతావరణం, తన గెలుపు అవకాశాలపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు.
ఇటీవల లూలా ప్రజాదరణ తగ్గింది. కానీ, ట్రంప్ టారిఫ్ల తర్వాత ఆయనకు రాజకీయంగా లాభం చేకూరినట్లు కనిపిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














