ఏ340: 303 మంది భారతీయులతో టేకాఫ్ అయి గమ్యం చేరని విమానం.. మధ్యలో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
303 మంది భారత ప్రయాణికులతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి బయలుదేరిన విమానాన్ని శుక్రవారం ఫ్రాన్స్లో అదుపులోకి తీసుకున్నారు.
దుబయి నుంచి నికరాగువా రాజధాని మనాగ్వాకు విమానం వెళ్లాల్సి ఉంది.
అయితే, ఈ ఎయిర్బస్ A340 విమానాన్ని మానవ అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్నారని, అందుకే అదుపులోకి తీసుకున్నట్లు ఫ్రెంచ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
విమానం గురించి రహస్య సమాచారం అందడంతో వాట్రి విమానాశ్రయంలో (పారిస్కు 150 కిలోమీటర్ల దూరంలో) నిలిపివేసినట్లు ఫ్రాన్స్ అధికారులు తెలిపారు.
విమానం నిలిపివేసిన తర్వాత అందులో కొంతమందిని భద్రతాధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత విమానాశ్రయాన్ని సీల్ చేశారు. విమానాన్ని నికరాగువాకు ఎందుకు తీసుకెళుతున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.
ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం ఘటనను ధ్రువీకరించింది, ఫ్రెంచ్ అధికారులు ఈ విషయాన్ని తెలియజేసినట్లు ఒక ప్రకటనలో చెప్పింది.
"భారత సంతతికి చెందిన కొందరు పౌరులతో దుబయి నుంచి నికరాగువా వెళుతున్న విమానం ఫ్రాన్స్లోని విమానాశ్రయంలో సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఎంబసీ బృందం అక్కడికి చేరుకుంది, వారికి కాన్సులర్ యాక్సెస్ కూడా లభించింది. ఎంబసీ దీనిపై దర్యాప్తు చేస్తోంది" అని రాయబార కార్యాలయం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ విమానం మానవ అక్రమ రవాణాకు ఉపయోగించారా?
రొమేనియన్ చార్టర్ కంపెనీ అయిన లెజెండ్ ఎయిర్లైన్స్కు చెందిన విమానమది.
ఫ్రెంచ్ అధికారుల విచారణకు సహకరించడానికి కంపెనీ సిద్ధంగా ఉందని ఎయిర్ లైన్స్ లాయర్ లిలియానా బాకయోకో ఫ్రెంచ్ మీడియాకు తెలిపారు.
మరికొద్ది రోజుల్లో మళ్లీ ఇక్కడి నుంచి విమానం టేకాఫ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫ్రాన్స్లోని నేషనల్ ఆర్గనైజేషన్ ఎగైనెస్ట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యూనిట్ అయిన జునాల్కో ఈ కేసు దర్యాప్తును చేపట్టిందని ఫ్రెంచ్ వార్తాపత్రిక 'లా మోండే' తెలిపింది.
విమానంలో ఉన్న అందరినీ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
విమానాశ్రయం చుట్టూ భారీ భద్రత
విమానం ఫ్రాన్స్లో ల్యాండ్ అయిన తర్వాత, ప్రయాణికులను మొదట విమానంలోనే ఉండమని కోరినట్లు ఫ్రెంచ్ అధికారులు తెలిపారు.
కాసేపటి తర్వాత ప్రయాణికులను వాట్రి విమానాశ్రయంలోని ప్రధాన హాలుకు తీసుకెళ్లి అక్కడ గురువారం రాత్రి కోసం బస ఏర్పాటు చేశారు.
అనంతరం విమానాశ్రయం చుట్టూ భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
విమానంలో మానవ అక్రమ రవాణా జరుగుతోందని 'గుర్తుతెలియని వ్యక్తుల' నుంచి సమాచారం అందిందని ఫ్రాన్స్లోని ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
కఠినంగా ఇమిగ్రేషన్ విధానాలు
ఇటీవలి కాలంలో యూరప్, అమెరికాలు ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేశాయి.
యుక్రెయిన్పై రష్యా దాడి, ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం, అనేక ఆఫ్రికా దేశాలలో అంతర్యుద్ధం కారణంగా అమెరికా, యూరప్లకు అక్రమంగా వెళ్లే వారి సంఖ్య పెరిగింది.
ఇలాంటి పరిస్థితుల్లో మానవ స్మగ్లర్ల ఆగడాలు కూడా ఎక్కువయ్యాయి. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి ఈ రాకెట్లను నడుపుతున్న వ్యక్తులు అక్రమంగా అమెరికా, యూరప్ దేశాలకు ప్రజలను తీసుకెళ్తున్నారు.
అయితే, ఈ దేశాల్లో బయటి నుంచి వచ్చే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. బ్రిటన్కు కుటుంబాలను తీసుకురావాలనుకునే వ్యక్తులకు ఏటా కనీసం రూ.40 లక్షల (38,700 పౌండ్లు) సంపాదన ఉండాలని బ్రిటన్ తెలిపింది.
ఈ చట్టం 2025 ప్రారంభంలో అమల్లోకి వస్తుందని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తెలిపారు. ప్రస్తుతం బ్రిటన్లో ఏటా రూ.19 లక్షలు (£18,600) సంపాదిస్తున్న వ్యక్తి కుటుంబాన్ని తీసుకురావచ్చు.
కొద్ది రోజుల క్రితం బ్రిటన్ హోం మంత్రి జేమ్స్ క్లెవర్లీ వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు ఐదు అంశాల ప్రణాళికను ప్రకటించారు.
గతేడాది మూడు లక్షల మంది బ్రిటన్కు రావడానికి అర్హత సాధించారని తెలిపారు. అయితే రాబోయే కొన్నేళ్లలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు బ్రిటన్కు రాలేరు.
2022లో 7,45,000 మంది వలసదారులు బ్రిటన్కు వచ్చారు. దీనిపై చాకచక్యంగా మాట్లాడితే చాలు. ఇమ్మిగ్రేషన్ విధానం న్యాయంగా, పారదర్శకంగా ఉండాలి.
ఇవి కూడా చదవండి
- ఇంట్లోనే చనిపోయినా పదేళ్ల వరకు ఎవరికీ తెలియలేదు.. ఆ వృద్ధురాలి మరణం దేశాన్నే కదిలించింది
- ‘నన్ను, నా చెల్లిని కాపాడబోయి మా నాన్న వరదలో కొట్టుకుపోయారు. కానీ...’
- దావూద్ ఇబ్రహీం: పోలీస్ కానిస్టేబుల్ కొడుకు అండర్ వరల్డ్ డాన్ ఎలా అయ్యాడు?
- ఐపీఎల్-2024: రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్తోనే ఉంటాడా, వేరే దారి చూసుకుంటాడా?
- కోవిడ్: కేరళలో కరోనా కొత్త సబ్వేరియంట్ జేఎన్.1, పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం ఏం చెప్పింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














