ఇరాన్: జనరల్ ఖాసిం సులేమానీ సమాధి వద్ద జంట పేలుళ్లు, 103 మంది మృతి, 141 మందికి గాయాలు

ఫొటో సోర్స్, ANADOLU
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ ఖాసిమ్ సులేమానీ నాలుగో వర్ధంతి రోజున ఆయన సమాధికి సమీపంలో జరిగిన జంట పేలుళ్లలో 103 మందికి పైగా మరణించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
కెర్మన్ నగరంలోని సాహెబ్ అల్ జమాన్ మసీదు సమీపంలో ఒక ఊరేగింపు జరుగుతుండగా ఈ పేలుళ్లు సంభవించినట్లు ఇరిబ్ పేర్కొంది.
అధికారిక మీడియా పేర్కొన్నదాని ప్రకారం, రెండు భయంకరమైన పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి.
ఈ ఘటనలో మరణాల సంఖ్య 103కి పెరిగిందని ఇరాన్లో ఎమర్జెన్సీ సేవలను అందించే సంస్థ తెలిపింది. పేలుళ్ల కారణంగా చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు చెప్పింది.

ఫొటో సోర్స్, ANADOLU
ఘటనా స్థలం నుంచి ఇప్పటివరకు 50 మందిని తరలించినట్లు కెర్మన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.
గాయపడిన వారిని రక్షించేందుకు వెళ్లిన ముగ్గురు రెస్క్యూ సిబ్బంది రెండో పేలుడు ఘటనలో మరణించినట్లు రెడ్ క్రెసెంట్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం వెల్లడించింది.
గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపింది.
దీన్నొక ‘‘ఉగ్రవాద దాడి’’ అని కెర్మన్ డిప్యూటీ గవర్నర్ను వ్యాఖ్యానించినట్లు ఇరిబ్ తెలిపింది.
ఆన్లైన్లో ప్రసారం అవుతున్న ఒక వీడియో, నేల మీద అనేక శవాలు పడి ఉన్నట్లుగా చూపుతోంది.
అమెరికా డ్రోన్ దాడిలో 2020లో మరణించిన జనరల్ సులేమానీ నాలుగో వర్ధంతిని పురస్కరించుకొని వందలాది మంది బుధవారం ఆయన సమాధి వైపు ఊరేగింపుగా వెళ్తున్నట్లుగా సోషల్ మీడియా వీడియోలు చూపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, IRNA
‘‘10 నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు’’
రెండు బాంబులు పేలడం వల్ల ఈ విస్పోటనం సంభవించినట్లు కెర్మన్ మెడికల్ ఎమర్జెన్సీ సెంటర్ చీఫ్ షాహాబ్ సాలెహీ చెప్పారు.
ఈ పేలుళ్లు 10 నిమిషాల వ్యవధిలో జరిగినట్లు కెర్మన్ మేయర్ సయీద్ షర్బా తెలిపారు.
బాంబులను రెండు బ్యాగుల్లో పెట్టి, వాటిని రిమోట్ ద్వారా పేల్చినట్లు ఇరాన్ న్యూస్ ఏజెన్సీ తస్నీమ్ పేర్కొంది.
వీలైనంత త్వరగా ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ప్రజల్ని అధికారులు కోరారు.

ఫొటో సోర్స్, UGC
నాలుగో వర్ధంతి కోసం గుమిగూడిన జనం
ఖాసిమ్ సులేమానీ నాలుగో వర్ధంతి కార్యక్రమం కోసం భారీగా జనాలు పోగయ్యారని, రోడ్లన్నీ నిండిపోయాయని రెడ్ క్రెసెంట్ సీఈవో చెప్పారు.
‘‘పేలుడు శబ్ధం భయంకరంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
ప్రజలు భయంతో పరుగులు పెడుతున్న ఫొటోలను ఇరాన్ అధికారిక మీడియా ప్రసారం చేసింది.

ఫొటో సోర్స్, Social Media
ఇరాన్లో పవర్ఫుల్ నేత ఖాసిమ్ సులేమానీ
సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని తర్వాత ఇరాన్లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా జనరల్ ఖాసిమ్ సులేమానీని పరిగణించేవారు.
రివల్యూషనరీ గార్డ్స్ ఓవర్సీస్ ఆపరేషన్స్ విభాగం ‘ ద క్వాడ్స్ ఫోర్స్’ కమాండర్గా ఆయన ఈ ప్రాంతం అంతటా ఇరాన్ పాలసీ రూపశిల్పిగా ఉండేవారు.
క్వాడ్ ఫోర్స్ రహస్య మిషన్లకు ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరించారు. హమాస్, హెజ్బుల్లా సహా ఇతర సాయుధ గ్రూపులు, ప్రభుత్వ మిత్ర పక్షాలకు మార్గదర్శకత్వం, నిధులు, ఆయుధాలు, ఇంటెలిజెన్స్, లాజిస్టికల్ మద్దతును అందించేవారు.
2020లో జనరల్ ఖాసిం హత్యకు ఆదేశించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సులేమానీని ‘‘ప్రపంచంలోని నంబర్వన్ టెర్రరిస్టు’’గా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: గంజాయి సాగు చేయకపోతే బతికేలా లేమని ఆ రైతులు ఎందుకు అంటున్నారు?
- ఆంధ్రప్రదేశ్: పుంజుది దక్షిణ అమెరికా.. పందెం గోదావరి జిల్లాలో
- ‘బతికున్నవారి కంటే శవాలే నయం’.. మృతదేహాలకు పోస్ట్మార్టం చేసే మహిళ
- కాళేశ్వరం ప్రాజెక్ట్: తెలంగాణ మంత్రుల పర్యటనతో తేలిందేమిటి... కుంగిన మేడిగడ్డ బరాజ్ పియర్లను ఏం చేస్తారు?
- 6 గ్యారెంటీలకు ఎక్కడ, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? రైతు భరోసా, ఉచిత కరెంటు, రూ.4,000 పింఛను పథకాలకు ఎవరు అర్హులు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)










