చంద్రయాన్3: ఈ మిషన్తో చంద్రుడి గురించి కొత్తగా తెలిసిన విషయాలేంటి... అవి భవిష్యత్తును మార్చేస్తాయా?

ఫొటో సోర్స్, ISRO
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్ పంపిన చంద్రయాన్-3 మిషన్ స్పేస్ క్రాఫ్ట్ లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు చంద్రుడిపై 10 రోజులపాటు డేటా, ఫోటోల సేకరణ జరిపి వాటిని పరిశీలన కోసం భూమికి పంపాయి.
ల్యాండర్-రోవర్ లు పనిచేయడానికి అవసరమైన బ్యాటరీలు ఛార్జ్ అవడానికి సూర్యరశ్మి అవసరం. దక్షిణ ధ్రువంపై పగటి సమయం ముగియడంతో సెప్టెంబర్ తొలివారంలో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లను ఇస్రో స్లీప్ మోడ్ లోకి పంపింది.
మళ్లీ సెప్టెంబర్ 22వ తేదీన సూర్యోదయం అయ్యే సమయాన రెండూ తిరిగి యాక్టివ్ అవుతాయని ఇస్రో ఆశాభావం వ్యక్తం చేసింది.
ల్యాండర్ చంద్రుడిపై దిగిన క్షణం నుంచి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు తీసిన చిత్రాలు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్రో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఇవి చాలామంది భారతీయుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. కొంతమందిలో మాత్రం ఈ సమాచారం ప్రాముఖ్యత ఏంటి, అవి ఎందుకు ఉపయోగపడతాయని ఆన్లైన్ అడుగుతున్నారు.
వీటి గురించి తెలుసుకునేందుకు నాసా పూర్వపు శాస్త్రవేత్త, దిల్లీకి చెందిన స్పేస్ ఎడ్యుకేషన్ సంస్థ కో ఫౌండర్ మిలా మిత్రాను బీబీసీ సంప్రదించింది.
చంద్రయాన్-3 ఇప్పటి వరకు కనుక్కున్న విషయాలు, వాటికున్న ప్రాముఖ్యం గురించి వివరించమని కోరింది.

ఫొటో సోర్స్, ISRO
రోవర్ ప్రయాణించిన దూరం
ప్రజ్ఞాన్ రోవర్ను స్లీప్ మోడ్ లోకి పంపే కొన్ని గంటల ముందు “ప్రజ్ఞాన్ రోవర్ 100 మీటర్లు (328 అడుగులు) పైగా ప్రయాణించింది. ఇంకా కొనసాగుతోంది” అని ఇస్రో ట్వీట్ చేసింది..
ప్రజ్ఞాన్ సెకనుకు 1 సెంటీ మీటర్ వేగంతో 6 చక్రాలతో చాలా దూరమే ప్రయాణించింది.
దీని ప్రాముఖ్యాన్ని మిత్రా వివరిస్తూ, “ఎవరూ ఎక్కువగా అన్వేషించని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సంచరిస్తూ, బిలాల్లో పడిపోకుండా సురక్షితంగా రోవర్ ప్రయాణం చేసింది” అని అన్నారు.
ఈ సందర్భంగా రోవర్ కు అమర్చిన చక్రాల ప్రత్యేకతను మిత్రా వివరించారు.
రూకర్ బూగీ అని పిలిచే మెకానిజాన్ని ఇందులో వినియోగించారని అన్నారు. అంటే ఆరు చక్రాలు ఒకేసారి కదలవు. దీనివలన రోవర్ పైకి కిందకు కదిలేందుకు వీలవుతుంది. కానీ, ఒకవేళ లోతైన బిలంలో పడిపోతే పైకి రాలేకపోవచ్చు. అందువలన “రోవర్ను నేలపై ఉన్న బిలాల చుట్టూ వెళ్లేలా చేయడం, లేదంటే దిశ మార్చుకునేలా చేయడం ముఖ్యం” అన్నారు.
కమాండ్ సెంటర్ నుంచి శాస్త్రవేత్తలు రోవర్ కు అమర్చిన కెమెరాల ద్వారా, అక్కడ నేలపై ఏముందో గమనిస్తూ రోవర్ ను ముందుకు నడిపించారని ఆమె అన్నారు.
“రోవర్ ఆటోమేటెడ్ కాదు. అది పంపే చిత్రాలను ఆధారం చేసుకుని, కమాండ్ సెంటర్ నుంచి నియంత్రించారు. రోవర్ పంపే ఫోటోలు కమాండ్ సెంటర్ను చేరుకోవడంలో కాస్త ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ప్రజ్ఞాన్ రోవర్ సమాచారాన్ని మొదట విక్రమ్ ల్యాండర్ కు పంపుతుంది. ల్యాండర్ దానిని ఆర్బిటర్ లోకి పంపుతుంది. ఆర్బిటర్ భూమికి చేరవేస్తుంది” అని ఆమె తెలిపారు.
కాబట్టి, ఆదేశాలు రోవర్ను చేరే సమయానికి, అది బిలానికి కొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఉంది.
అయితే, ప్రజ్ఞాన్ రోవర్ రెండు బిలాల మధ్య నుంచి సురక్షితంగా ప్రయాణం చేసి, కమాండ్ సెంటర్ కు వేగంగా సమాచారం పంపిందని మిత్రా అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
విపరీతమైన వేడి, చలి
ల్యాండర్ విక్రమ్కు అమర్చిన ప్రోబ్ చంద్రుడి ఉపరితలంపై ఉన్న మట్టితోపాటు, 10 సెంటీ మీటర్ల లోతులో ఉన్న మట్టిని కూడా పరిశీలించి, తొలిదశ సమాచారాన్ని సేకరించి కమాండ్ సెంటర్కు పంపింది.
ఈ సమాచారంలో చంద్రుడి ఉపరితలంపైనా, నేల లోపల ఉన్న ఉష్ణోగ్రతల్లో గణనీయమైన వ్యత్యాసాలు కనిపించాయి.
ఉపరితలంపై ఉష్ణోగ్రత 60 డిగ్రీలు ఉండగా, లోతుకు వెళ్లే కొద్దీ భారీగా పడిపోయింది. 80 మిల్లీ మీటర్ల లోతున ఉష్ణోగ్రత -10 డిగ్రీలకు పడిపోయింది.
చంద్రుడిపై ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయని నాసా ఇంతకు ముందే తెలిపింది. ఆ ప్రకారం పగటిపూట చంద్రుడి భూమధ్య రేఖ సమీపాన ఉష్ణోగ్రత 120 డిగ్రీల సెల్సియస్, రాత్రివేళ -130డిగ్రీలు సెల్సియస్ పడిపోతుంది. శాశ్వతంగా సూర్మరశ్మి పడని బిలాల్లో ఉష్ణోగ్రత -250 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది.
ఉష్ణోగ్రతల్లో ఉన్న ఈ మార్పు చాలా కీలకమైనది మిత్రా అన్నారు. లూనార్ రిగోలిత్గా పిలిచే ఈ చంద్రుడి మీది మట్టిని మంచి ఇన్సులేటర్గా చెప్పవచ్చని అన్నారు.
“దీని ద్వారా ఏం తెలుసుకోవచ్చంటే వేడి, చలి, రేడియేషన్లను నిరోధించేందుకు ఈ మట్టిని ఉపయోగిస్తూ స్పేస్ కాలనీలను నిర్మించవచ్చు. అంతేకాకుండా, నేలలోపల నీటి ఉనికి ఉందనడానికి ఇది ఒక సూచన” అని అన్నారు.

ఫొటో సోర్స్, ISRO
చంద్రుడి పరిణామాన్ని తెలుసుకునేందుకు ఆధారం....
చంద్రుడి దక్షిణ ధ్రువపు ఉపరితలంలో ఉన్న మూలకాల ఉనికిని తెలుసుకునేందుకు రోవర్పై లేజర్ డిటెక్టర్ను అమర్చారు. ఈ లేజర్ డిటెక్టర్ ద్వారా ఉపరితలంలో అల్యూమియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్, ఆక్సీజన్ మూలకాలు ఉన్నాయని గుర్తించారు.
అన్నిటికన్నా ముఖ్యమైనది సల్ఫర్ ఉనికిని నిర్ధరించడమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలిసారిగా చంద్రుడి ఉపరితలంలో సల్ఫర్ ఉనికిని గుర్తించామని ఇస్రో పేర్కొంది.
చంద్రుడిపై సల్ఫర్ ఉనికి గురించి 1970లలోనే తెలుసు. అయితే, రోవర్ చంద్రుడి నేలపై ఉన్న ఖనిజం లేదా స్ఫటికంలోని భాగంలో ఉన్న సల్ఫర్ను కాకుండా, చంద్రుడి ఉపరితలంపైనే సల్ఫర్ ఉన్నట్లు గుర్తించడం అద్భుతమైన విషయంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
మట్టిలో సల్ఫర్ ఉనికిని కనుక్కోవడం చాలా కోణాలలో కీలకమైన అంశమని మిత్రా పేర్కొన్నారు.
“సాధారణంగా అగ్నిపర్వతాల నుంచే సల్ఫర్ వెలువడుతుంది. దీనిని బట్టి మనకు చంద్రుడి ఆవిర్భావం, భౌగోళిక పరిస్థితులు, పరిణామ క్రమంపై సమాచారం తెలుస్తుంది “ అని అన్నారు.
“ఇది మాత్రమే కాకుండా సల్ఫర్ కనిపించడమంటే చంద్రుడి ఉపరితలంపై నీటి ఉనికికి ఒక సూచిక. సల్ఫర్ సహజ ఎరువు. ఇక్కడ మరో మంచి విషయం ఏంటంటే చంద్రుడిపై సహజంగా మొక్కలు పెరగడానికి సల్ఫర్ పనికొస్తుంది”. అని అన్నారు.

ఫొటో సోర్స్, ISRO
చంద్రుడిపై ప్రకంపనలు?
ప్రకంపనలను రికార్డు చేసి విశ్లేషించే సామర్థ్యం ఉన్న ఇల్సా (ILSA) అనే పరికరాన్ని విక్రమ్ ల్యాండర్లో అమర్చారు. ఇది విక్రమ్ ల్యాండర్తో పాటు, రోవర్ కదలికలు, కార్యకలాపాల సమాచారాన్ని కూడా విశ్లేషిస్తుంది.
చంద్రుడి నేలలోని మార్పులను గమనించే ఇల్సా పరికరం ఒక విశేషమైన ఘటనను రికార్డు చేసిందని ఇస్రో తెలిపింది. అదే చంద్రుడిపై ప్రకంపనలు.
ఈ సంఘటనకు చాలా ప్రాధాన్యత ఉందని, మిత్రా అన్నారు. దీనికి చాలా వివరణలు, విశ్లేషణలు కూడా చాలా ఉండొచ్చని ఆమె అన్నారు.
“బహుశా అంతరిక్ష శిథిలాలు, గ్రహకలం, ఉల్క వంటివి చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రకంపనలు ఏర్పడి ఉండొచ్చు. లేదంటే సహజంగానే ఏర్పడి ఉండవచ్చు. 1970ల తర్వాత నమోదైన తొలి ప్రకంపనగా దీన్ని భావించవచ్చు. చంద్రుడి ఉపరితలం కింద ఏముంది? భౌగోళిక స్థితి ఎలా ఉంది? అన్న విషయాలను పరిశోధించేందుకు ఇది ఉపయోగపడవచ్చు’’ అని మిత్రా అన్నారు.

ఫొటో సోర్స్, NASA'S GODDARD SPACE FLIGHT CENTER
లూనార్ ప్లాస్మా అంటే?
ల్యాండర్ కు అమర్చిన ప్రోబ్ ద్వారా తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధృవంలో ఉపరితలానికి దగ్గరగా ఉన్న ప్లాస్మా వాతావరణాన్ని పరీక్షించినట్లు ఇస్రో ట్వీట్ ద్వారా తెలిపింది.
దక్షిణ ధృవంలో ప్లాస్మా తక్కువ ఉన్నట్లుగా పేర్కొంది. దీని అర్థం ఏంటో చాలామందికి తెలియలేదు.
దీని గురించి మిత్రా వివరిస్తూ... ప్లాస్మా అనేది వాతావరణంలో ఉన్న అయాన్, ఎలక్ట్రాన్ల ఉనికిని తెలియజేస్తుందని వెల్లడించారు. ఇవి రేడియో వేవ్ కమ్యూనికేషన్ పై ప్రభావం చూపిస్తాయని అన్నారు.
చంద్రయాన్-3 కూడా రేడియో వేవ్ కమ్యూనికేషన్ ను వినియోగిస్తోంది.
“ప్లాస్మా సాపేక్షంగా తక్కువ ఉండటం మంచి వార్తే. దీనివలన రేడియో వేవ్ కమ్యూనికేషన్ లో అంతరాయం చాలా తక్కువే” అన్నారు.

ఫొటో సోర్స్, ISRO
ల్యాండర్ విక్రమ్ కు ‘హాప్ పరీక్ష’
విక్రమ్ ల్యాండర్ను స్లీప్ మోడ్లోకి పంపే ముందు నిర్వహించిన ‘హాప్ ప్రయోగం’ విజయవంతం అయిందని ఇస్రో పేర్కొంది.
“కమాండ్ ను అనుసరించి విక్రమ్ ల్యాండర్ తాను దిగిన చోటు నుంచి 40 సెంటీమీటర్ల (16 ఇంచులు) ఎత్తుకు లేచి, 30-40 సెంటీమీటర్ల దూరంలో ల్యాండ్ అయింది” అని ఇస్రో తెలిపింది.
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో చంద్రుడిపై సేకరించిన నమూనాలను భూమి మీదకు తీసుకురావడానికి లేదా మానవసహిత ప్రయోగాల కోసం ఈ ల్యాండర్ ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది.
అయితే ఈ ప్రయోగం భారత్ భవిష్యత్తులో చేపట్టే అంతరిక్ష ప్రణాళిలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అన్న ప్రశ్నకు మిత్రా సమాధానం ఇచ్చారు.
చంద్రుడిపై దిగిన తర్వాత విక్రమ్ ల్యాండర్ ఇంజిన్ పనిచేస్తుందో లేదో ఈ ప్రయోగంతో నిర్థరణ అయిందని అన్నారు.
అంతేకాకుండా, విక్రమ్ ల్యాండర్ చంద్రుడి నేలపై ఉన్న వాతావరణంలో కూడా లిఫ్ట్ ఆఫ్ అయ్యే సామర్థ్యం ఉన్నదిగా తేలిందని తెలిపారు.
అంతకుముందు విక్రమ్ ల్యాండర్ను భూమిపై పరీక్షించారు. కమాండ్ సెంటర్ నుంచి చంద్రుడిపై పరీక్షించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)















