తండ్రి చావుకు కారణమని అత్తారింటిపై ప్రతీకారం... అయిదుగురికి విషం పెట్టి చంపిన కోడలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నితేష్ రావుత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న హత్యాకాండ కలకలం సృష్టించింది. 20 రోజుల వ్యవధిలో శంకర్ కుంభారే, విజయ కుంభారే, కోమల్, ఆనంద, రోషన్ అనే ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు.
అయితే, ఈ ఐదుగురినీ హత్య చేసింది ఆ ఇంటి కోడలేనని దర్యాప్తులో తేలింది. అంతేకాదు ఈ హత్యాకాండలో ఆమెకు అత్తారింటి తరఫు బంధువొకరు సాయం చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.
నిందితులైన సంఘమిత్ర కుంభారే (కోడలు), రోసా రామ్టేకేలను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరినీ కోర్టులో హాజరుపరచగా, 10 రోజుల పోలీసు కస్టడీ విధించారు న్యాయమూర్తి.

ఫొటో సోర్స్, NITESH RAUT/BBC
అసలేం జరిగింది?
అహేరి తాలూకాలోని మహాగావ్లో 20 రోజుల్లో కుంభరే కుటుంబంలోని తల్లిదండ్రులు, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఇలా వరుసగా ఐదుగురు అనుమానాస్పద రీతిలో మరణించారు.
పోలీసుల దర్యాప్తులో అసలు కుట్ర బయటపడింది. ఈ కేసు వివరాలను గడ్చిరోలి అదనపు పోలీసు సూపరింటెండెంట్ యతీష్ దేశ్ముఖ్ వివరించారు.
“మహాగావ్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు అహేరి పోలీస్ స్టేషన్కు సమాచారం అందింది. మేం వెంటనే దర్యాప్తు ప్రారంభించాం. వేర్వేరు రోజుల్లో కుటుంబ సభ్యులు విషం తాగారు. అందరూ అనారోగ్యం పాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఇద్దరు చంద్రాపూర్లోని ఆసుపత్రిలో, ముగ్గురు నాగ్పూర్లోని ఆసుపత్రిలో మరణించారు. శంకర్ కుంభరే పెద్ద కుమారుడు సాగర్, డ్రైవర్ రాకేష్, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు, వారి పరిస్థితి నిలకడగా ఉంది'' అని యతీష్ దేశ్ముఖ్ వెల్లడించారు.
"బాధితులందరిలో వాంతులు, ఒంటి నొప్పులు, కడుపు నొప్పి, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపించాయి. మొదట ముగ్గురు చనిపోయినపుడు ఖచ్చితమైన కారణం తెలియలేదు వైద్యులకు. అయితే నాలుగు, ఐదవ మరణాల తరువాత ఇది విష ప్రయోగమని అనుమానించారు" అని తెలిపారు అడిషినల్ ఎస్పీ.
''కోడలు సంఘమిత్ర స్టేట్మెంట్ తీసుకున్నపుడు ఆమె సమాధానం అనుమానాస్పదంగా ఉందని గమనించాం. పైగా మృతుల కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవు. దీంతో కోడలిని విచారించాం. సంఘమిత్ర, రోసా రామ్టేకే ఇద్దరూ వేర్వేరు రోజులలో కుటుంబ సభ్యులకు ఆహారం ద్వారా విషమిచ్చి, ఐదుగురు చనిపోయేలా చేశారు" అని అన్నారు అడిషినల్ ఎస్పీ.

ఫొటో సోర్స్, NITESH RAUT/BBC
ఎందుకు చంపారు?
అత్తమామలు తనను వేధించారని కోడలు సంఘమిత్ర ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. సంఘమిత్ర, రోషన్ కుంభరేలు ఏడాది క్రితం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.
కొన్నిరోజుల కిందట సంఘమిత్ర తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, తన తండ్రి మృతికి అత్తింటి వేధింపులే కారణమని భావించిన సంఘమిత్ర అత్తారింటిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది.
దీంతో అందరినీ చంపేసింది. సంఘమిత్రకు రోసా రామ్టేకే సాయం చేశారు. విజయ కుంభరే తల్లి తరపు బంధువు రోసా. ఇరు కుటుంబాల మధ్య భూ వివాదం ఉంది.
కుంభారే కుటుంబాన్ని అంతమొందిస్తే భూమిలో వాటా ఇవ్వాల్సిన అవసరం ఉండదనే ఉద్దేశంతో రోసా హత్యలో భాగమయ్యారు.
సంఘమిత్ర, రోసా ఇద్దరూ కలిసి హత్యకు కుట్ర పన్నారు, కుటుంబ సభ్యులకు వేర్వేరు రోజుల్లో విషమిచ్చారు. దీంతో ఐదుగురూ చనిపోయారు.
ఇవి కూడా చదవండి
- గగన్యాన్: మానవ అంతరిక్ష యాత్రకు ఇస్రో వేస్తున్న తొలి అడుగు
- డ్రీమ్ 11 యాప్లో క్రికెట్ ఆడి ఈ ఎస్సై కోటిన్నర ఎలా గెలుచుకున్నారు? ఆ తర్వాత ఏమైంది?
- ఇజ్రాయెల్తో పోరుకు సిద్ధమంటున్న హిజ్బొల్లా సంస్థ చరిత్ర ఏంటి?
- తెలంగాణ ఎన్నికలు: ఆ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు మహిళలే అయినా ఒక్కరూ ఎమ్మెల్యే కాలేకపోయారు, ఎందుకు?
- భూకంపం వచ్చిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసించడం ఎంత వరకు సేఫ్, ఎలా తెలుసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














