తీరాన్ని తాకిన ఫెయింజల్ తుపాను, భారీ వర్షాలు, ఈదురు గాలులు..

ఫొటో సోర్స్, IMD
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఫెయింజల్ తుపాను పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని తాకింది. తమిళనాడులోని మహాబలిపురం– కరైకల్ మధ్యలో తీరం దాటడం మొదలైందని, పూర్తిగా తీరాన్ని దాటేందుకు నాలుగైదు గంటలు పట్టవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
తుపాను తీరం దాటే సమయంలో 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
తమిళనాడులోని తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం జిల్లాలతో పాటు ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ(భారత వాతావరణ శాఖ) అధికారులు సూచించారు.
ఫెయింజల్ తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

ఫెయింజల్ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ రావొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులపై తుపాను ప్రభావం పడింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం మధ్యాహ్నానికి 13 కిలోమీటర్ల వేగంతో కదులుతూ 'ఫెయింజల్' తుపానుగా బలపడింది.
దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తాతో పాటు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.
కొన్నిచోట్ల ఫ్లాష్ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. మిగిలినచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఫొటో సోర్స్, IMD.GOV.IN
ఏయే జిల్లాల్లో..
తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ బీబీసీతో చెప్పారు.
ప్రకాశం జిల్లా తీరం వెంబడి 70–90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని కడప జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్కు అవకాశం ఉందని వెల్లడించారు.

ఫొటో సోర్స్, IMD.GOV.IN
కృష్ణపట్నం పోర్టులో డేంజర్ సిగ్నల్ – 6
ఫెయింజల్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని పోర్టులనూ అధికారులు అప్రమత్తం చేశారు.
కృష్ణపట్నం పోర్టులో డేంజర్ 6వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. గంగవరం, విశాఖపట్నం, మచిలీపట్నం నిజాంపట్నం, కాకినాడ పోర్టుల్లో ‘డిస్టెన్స్ వార్నింగ్ సిగ్నల్’ 2 జారీ చేశారు.
కళింగపట్నం, భీమునిపట్నం పోర్టుల్లో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు..
తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అలలు మూడు మీటర్ల వరకూ ఎగసిపడే అవకాశం ఉన్నందున సందర్శకులు సముద్ర తీరానికి వెళ్లొద్దని సూచించారు.
దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు 80 కిలోమీటర్ల వేగంతోనూ, ఉత్తర కోస్తాలో 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు.
ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.
తిరుపతిలో విమాన సర్వీసులు రద్దు
తుపాను కారణంగా తిరుపతి జిల్లాలో శుక్రవారి రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.
తిరుపతి ఎయిర్పోర్టులో 4 విమాన సర్వీసులు రద్దు చేశారు.
ఇక్కడి నుంచి హైదరాబాద్, విశాఖ, బెంగళూరు వెళ్లాల్సిన 4 విమానాలను విమానాలను ఎయిర్ లైన్స్ రద్దు చేసింది.

ఫొటో సోర్స్, Telugu Desam Party
తుపానుపై ముఖ్యమంత్రి సమీక్ష
ఫెయింజల్ తుపాను పరిస్థితిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, సీఎంవో, రియల్ టైం గవర్నెన్స్ అధికారులు, అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని, పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, సహాయ చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయాత్తం కావాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ఫొటో సోర్స్, Getty Images
తమిళనాడులో రెడ్ అలర్ట్
ఫెయింజల్ తుపాను తీరం దాటనుండడంతో తమిళనాడులో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్లు, విల్లుపురం, కడలూర్, కళ్లకురిచ్చి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఈ జిల్లాల్లో 21 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.
తుపాను పశ్చిమ, వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఫెయింజల్ తుపాను కారణంగా చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కళ్లకురిచ్చి, కడలూర్ జిల్లాలతో పాటు పుదువాయిలోని కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నైలోని జోనల్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
దీంతో చెన్నై సహా తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్లు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)













