అల్ జవహిరి మరణం తర్వాత అల్ ఖైదా పరిస్థితి ఏమిటి, కొత్త నాయకత్వం సిద్ధంగా ఉందా

ఫొటో సోర్స్, CNN VIA GETTY IMAGES
- రచయిత, ఫ్రాంక్ గార్డెనర్
- హోదా, బీబీసీ సెక్యూరిటీ కరెస్పాండెంట్
అల్ ఖైదా అధినేత అల్ జవహిరి గత వారాంతంలో హతమయ్యాడు. ఇది పూర్తిగా అనూహ్యమైన పరిణామం కాకపోయినా ఆకస్మిక పరిణామమే. ఇప్పుడు ఒక తప్పనిసరి ప్రశ్న తలెత్తుతుంది. అతడు మిగిల్చిన సంస్థ అల్ ఖైదా పరిస్థితి ఏమిటి?
అరబిక్లో అల్ ఖైదా అంటే 'పునాది' అని అర్థం. ప్రపంచ వ్యాప్తంగా పశ్చిమ దేశాల ప్రయోజనాల మీద దాడులు చేయటానికి అంకితమయ్యామని ప్రకటించుకున్న ఒక ఉగ్రవాద సంస్థ అది. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో.. పశ్చిమ దేశాలకు చాలా సన్నిహితంగా ఉన్న, 'తగినంతగా ఇస్లామిక్' కాని దేశాల ప్రభుత్వాలను కూలదోస్తామనీ ప్రకటించింది.
1980వ దశకం చివరిలో అఫ్గాన్ - పాకిస్తాన్ సరిహద్దు భూభాగాల్లో ఇది ఏర్పడింది. అఫ్గానిస్తాన్ మీద దండయాత్ర చేసి ఆక్రమించుకున్న నాటి సోవియట్ సైన్యం మీద పోరాడిన అరబ్ వాలంటీర్ ఆర్మీలో మిగిలిన వారితో ఈ సంస్థ తయారైంది.
ఒక తరం ముందు అల్ ఖైదా అనే పేరు ప్రపంచమంతటా ప్రతి ఇంటికీ తెలిసిన పేరు. పశ్చిమ ప్రపంచ భద్రతకు అన్నిటికన్నా ప్రథమ ముప్పుగా పరిగణించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు? ఎందుకంటే ఆ సమయంలో ఈ సంస్థ అత్యంత సాహసోపేతమైన, సంక్లిష్టమైన దాడులను విజయవంతంగా అమలుచేసింది. దానివల్ల మరింత మంది హింసాత్మక అనుచరులు ఈ సంస్థ శ్రేణుల్లో చేరారు.
1998లో కెన్యా, టాంజానియా దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాల మీద అల్ ఖైదా ఏక కాలంలో బాంబుదాడులు చేసింది. ఆ దాడుల్లో ఎక్కువగా ఆఫ్రికా పౌరులు చనిపోయారు.
2000 సంవత్సరంలో ఏడెన్ హార్బర్లో ఉన్న అమెరికా యుద్ధనౌక యూఎస్ఎస్ కోల్ ను..భారీ ఎత్తున పేలుడు పదార్థాలు నింపిన స్పీడ్ బోట్తో ఢీకొట్టింది. ఆ దాడిలో 17 మంది సెయిలర్లు చనిపోయారు. వంద కోట్ల డాలర్ల యుద్ధనౌక దెబ్బతింది.
అనంతరం 2001 సెప్టెంబర్ 11వ తేదీన న్యూయార్క్ మీద ఆకాశం నిర్మలంగా ఉన్న ఉదయం వేళ ''ప్రపంచం శాశ్వతంగా మారిపోయే'' పరిణామానికి కారణమైంది.
నెలల తరబడి రహస్యంగా ప్లాన్ చేసిన అల్ ఖైదా ఆపరేటర్లు.. నాలుగు అమెరికా ఎయిర్లైన్స్ విమానాలను ఆకాశంలో హైజాక్ చేశారు. వాటిలో రెండిటిని న్యూయార్క్లోని విఖ్యాత వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలకు ఢీకొట్టించారు. ఆ రెండు ఆకాశహర్మ్యాలు నిప్పుల్లో కుప్పకూలాయి.
మరొక విమానాన్ని అమెరికా రక్షణ విభాగం కేంద్ర స్థానమైన పెంటగాన్ మీద కూల్చారు. ఇక నాలుగో విమానంలో హైజాకర్ల మీద ప్రయాణికులు పైచేయి సాధించారు. అది ఓ పొలంలో కూలిపోయింది. అందులో ఉన్న వారందరూ చనిపోయారు.
ఆ రోజు ఆ దాడుల్లో దాదాపు 3,000 మంది జనం చనిపోయారు. అది "9/11" ఘటనగా చరిత్రకెక్కింది.
అమెరికా ప్రధాన భూభాగం మీద అత్యంత దారుణమైన ఉగ్రదాడి అది. ఆ దాడితో అమెరికా సారథ్యంలో వివాదాస్పద 'ఉగ్రవాదం మీద యుద్ధం' మొదలైంది. అది రెండు దశాబ్దాల పాటు సాగింది.
అఫ్గానిస్తాన్లోని పర్వతాల్లో గల అల్ ఖైదా స్థావరాల్లో 9-11 దాడులకు కుట్ర, ప్రణాళికా రచన జరిగింది. అక్కడ అల్ ఖైదాకు ఆశ్రయం ఇచ్చింది తాలిబాన్లు. కాబట్టి అమెరికా, బ్రిటన్లు ఆ దేశం మీద దండెత్తాయి. తాలిబాన్లను గద్దె దించాయి. అల్ ఖైదాను తరిమి వేశాయి.
కానీ తప్పించుకు తిరుగుతున్న అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ను వెదికి పట్టుకుని చంపటానికి అమెరికాకు మరో పదేళ్లు పట్టింది. 2011 మే నెలలో పాకిస్తాన్లో ఉన్న బిన్ లాడెన్ను అమెరికా హతమార్చింది.
అప్పటి నుంచీ ఏం జరిగింది? ఇప్పుడు అల్ ఖైదా ఏ పరిస్థితుల్లో ఉంది?

అగ్రనాయకత్వంలో మార్పు.. ఓ కొత్త ప్రత్యర్థి
ఒసామా బిన్ లాడెన్ హతమైన అనంతరం..అల్ ఖైదా అగ్రనాయకత్వాన్ని తక్షణమే డాక్టర్ అయ్మన్ అల్ జవహిరి భర్తీ చేశారు. పుస్తకాలు ఎక్కువగా చదివే జవహిరిని లాడెన్కు మార్గదర్శిగా భావిస్తారు. జవహిరిని అమెరికా నిఘా సంస్థలు గుర్తించి హతమార్చాయి.
ఈజిప్టుకు చెందిన మాజీ నేత్ర శస్త్ర వైద్యుడు అయిన జవహిరి 11 ఏళ్లు అల్ ఖైదా నాయకుడిగా కొనసాగారు. అయితే తనకన్నా ముందు నాయకుడైన బిన్ లాడెన్కు యువ, హింసాత్మక ఆలోచనలున్న జిహాదీవాదుల్లో ఉన్న కరిష్మా కానీ, అభిమానం కానీ జవహిరి సంపాదించలేకపోయాడు.
పశ్చిమ దేశాలు, వాటి మిత్ర దేశాల మీద దాడులు చేయాలని ఎల్లప్పుడూ పిలుపునిస్తూ అతడు రికార్డు చేసి విడుదల చేసే వీడియో సందేశాలు సుదీర్ఘంగా, విసుగు పుట్టించేలా ఉండేవి. అతడికి మాస్ అప్పీల్ లేదు.
అల్ ఖైదా నుంచి జిహాదీవాదులు బయటకువెళ్లి కొత్తగా ఏర్పడిన అతి హింసాత్మక 'ఇస్లామిక్ స్టేట్' లేదా 'ఐసిస్' (ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ షామ్ - షామ్ అంటే ట్రేటర్ సిరియా)లో చేరటం ఎప్పుడో మొదలైంది.
కొత్త దాడులు చేయాలన్న ఆతృత గల యువ జిహాదీవాదులు.. అల్ ఖైదా ఎక్కువగా మాటలు చెప్తుంటే.. ఐసిస్ పని చేస్తోందంటూ అల్ ఖైదా నాయకత్వాన్ని ఎద్దేవా చేసేవారు.

ఫొటో సోర్స్, UNKNOWN
మెరుగైన నిఘా.. తక్కువ విజయాలు
అమెరికా మీద 9-11 దాడులు అమెరికా నిఘా వ్యవస్థ వైఫల్యానికి పరాకాష్ట.
అమెరికా కొన్ని ఆధారాలను పట్టుకోలేకపోయినప్పటికీ.. సీఐఏ, ఎఫ్బీఐలు తమ వద్ద ఉన్న రహస్యాలను పరస్పరం పంచుకోకపోవటం.. ఆ దాడులు విజయవంతంగా జరగటానికి కొంత వరకూ కారణం.
ఆ పరిస్థితి మారింది. అమెరికా, పశ్చిమ దేశాల నిఘా సంస్థలకు ఇప్పుడు చాలా మెరుగైన సమాచారం లభిస్తోంది. వాటి మధ్య సహకారం పెరిగింది. అల్ ఖైదా, ఐసిస్లలో అంతర్గత ఇన్ఫార్మర్లను ఆయా నిఘా సంస్థలు రిక్రూట్ చేసుకోవటం వల్ల ఉగ్రవాద దాడులలో విజయాలు తగ్గాయి.

అఫ్గానిస్తాన్లో సురక్షిత ఆశ్రయం?
కానీ అఫ్గానిస్తాన్ నుంచి గత ఏడాది గందరగోళ పరిస్థితుల్లో పశ్చిమ దేశాలు వైదొలగటం.. అల్ ఖైదాకు ప్రమాదకరమైన కొత్త అవకాశాలను కల్పించిందనే అంశాన్ని విస్మరించటానికి వీలులేదు.
అఫ్గాన్ రాజధాని కాబూల్లోనే తాలిబాన్ నాయకత్వానికి అతి సమీపంలో సౌకర్యవంతంగా జీవించటానికి ఓ 'సురక్షితమైన ఇంటి'ని అల్ జవహిరి సమకూర్చుకోగలిగారు. అంటే తాలిబాన్లో కరడుగట్టిన జిహాదీవాద శక్తులకు.. అల్ ఖైదాతో సంబంధాలు తెంచుకోవాలనే ఉద్దేశమే లేదని ఈ వాస్తవం చాటుతోంది.
అల్ ఖైదాకు అఫ్గానిస్తాన్ అంటే ఓ విశిష్ట ప్రత్యేకత ఉంది.
1980లలో దండెత్తి వచ్చిన సోవియట్ల మీద పోరాడటానికి నాటి యువ, సంపన్న, ఆదర్శవాద ఒసామా బిన్ లాడెన్.. తన కుటుంబ ఇంజనీరింగ్ నైపుణ్యాలను తీసుకువచ్చి పర్వతాల కింద గుహ సముదాయాలను నిర్మించింది ఇక్కడే.
అతడు 1996 నుంచి 2001 వరకూ తాలిబాన్ సంరక్షణలో నివసించిందీ ఇక్కడే. ఇప్పుడు తమ మిత్రులైన తాలిబాన్లు తిరిగి అధికారంలోకి రావటంతో ఇక్కడే తన ఉనికిని పునఃప్రతిష్టించాలని అల్ ఖైదా భావిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
ఆఫ్రికా - కొత్త జిహాదీ యుద్ధరంగం
ఒకప్పుడు అల్ ఖైదా అనేది భౌగోళికంగా చిన్నది. కేంద్రీకృతమై ఉండేది. నాయకత్వంతో అతి సన్నిహితంగా పనిచేసేది. కానీ ఇప్పుడది ఒక అంతర్జాతీయ ఫ్రాంచైజీగా మారింది. ప్రపంచం నలుమూలలా దాని అనుచరులు ఉన్నారు. ప్రభుత్వ పాలన లేని, ఉన్నా అతి పేలవంగా ఉన్న ప్రాంతాల్లో వీరు ఎక్కువగా ఉన్నారు.
ఉదాహరణకు సోమాలియాలో అల్-ఖైదా అనుబంధ సంస్థ అల్-షబాబ్ అతి పెద్ద జిహాదీవాద బృందంగా కొనసాగుతోంది.
అల్ ఖైదా, ఐసిస్ వంటి జిహాదీవాద బృందాలకు ఇప్పుడు ఆఫ్రికా సరికొత్త యుద్ధరంగంగా మారింది. ముఖ్యంగా వాయువ్య ఆఫ్రికాలోని సాహెల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వీటి ప్రాబల్యం అధికంగా ఉంది.
ఆయా ప్రాంతాల్లో తాము 'మతభ్రష్ట' ప్రభుత్వాలుగా పరిగణిస్తున్న ప్రభుత్వాలను కూలదోయటం కోసం పోరాడుతున్న ఈ జిహాదీ సంస్థలు.. పరస్పరం కూడా పోరాడుతున్నాయి. వీటి మధ్య యుద్ధంలో పౌరులు చిక్కుకుని అల్లాడుతున్నారు.
పశ్చిమాసియా
అల్ ఖైదా అనేది స్వాభావికంగా పశ్చిమాసియా ప్రాంతానికి చెందిన ఉగ్రవాద సంస్థగానే ఉంది. బిన్ లాడెన్ సౌదీ అరేబియన్. అల్ జవహిరి ఈజిప్టు వాసి. మిగతా సీనియర్ నాయకత్వమంతా కూడా దాదాపుగా అరబ్ ప్రాంతానికి చెందిన వారే.
వాయువ్య సిరియాలో అల్ ఖైదా ఉనికి ఇంకా గణనీయంగానే ఉంది. అక్కడ అనుమానిత రహస్య స్థావరాలపై అమెరికా డ్రోన్లతో దాడులు చేయటం, ప్రత్యేక బలగాలు దాడులు చేయటం తరచుగా జరుగుతూ ఉంటుంది.
అల్ జవహిరి మరణంతో.. క్షీణిస్తున్న తన బలాన్ని పునరుద్ధరించుకోవటానికి అల్ ఖైదా ఓ కొత్త నాయకుడి సారధ్యంలో, సరికొత్త వ్యూహంతో ముందుకు రావచ్చు.
ఏదైనా నిఘా సంస్థ ఈ ఉగ్రవాద బృందంతో ముప్పు దాని నాయకత్వంతో పాటే చనిపోయిందని నిర్ధారణకు వచ్చినట్లయితే అది తెలివితక్కువే అవుతుంది.
ఇవి కూడా చదవండి:
- పాము, కప్ప: ప్రపంచానికి 1,39,087 కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని కలిగించిన రెండు జీవులు..
- క్యాసినో అంటే ఏంటి, అందులో ఏం చేస్తారు... చట్టాలు ఏం చెబుతున్నాయి?
- వయాగ్రా ప్రభావం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి... సైడ్ ఎఫెక్టులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ‘‘హిందూ దేశం’’: భారతీయ ముస్లింలలో ఎలా భయాన్ని పుట్టిస్తున్నారు, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, మారేందుకు ఏం చేయాలి
- ఆహారం: నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా... ఈ ప్రచారంలో నిజమెంత?
- మంకీపాక్స్: 'జననేంద్రియాలపై కురుపులు... దుస్తులు ధరిస్తే తట్టుకోలేనంత మంట'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












