బోరిస్ జాన్సన్: రక్షణ బంధం పటిష్టం చేయడమే లక్ష్యంగా భారత్లో పర్యటించనున్న బ్రిటన్ ప్రధాని

ఫొటో సోర్స్, PA Media
ఎప్పటినుంచో వాయిదా పడుతున్న భారత్ పర్యటనకు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఈ వారంలో రాబోతున్నారు. రెండు దేశాల మధ్య రక్షణ బంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన భారత్లో పర్యటించనున్నారు.
దిల్లీలో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జాన్సన్ సమావేశం కానున్నారు. రక్షణ, వాణిజ్య బంధాలపై ప్రధానంగా వీరు చర్చల్లో దృష్టి కేంద్రీకరిస్తారు.
ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బోరిస్ జాన్సన్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇదివరకు ఆయన పర్యటనలు కోవిడ్-19 వ్యాప్తి వల్ల వాయిదా పడ్డాయి.

ఫొటో సోర్స్, PA Media
యుక్రెయిన్పై రష్యా దాడి అనంతరం, ఆయుధ సంపత్తి కోసం రష్యా మీద ఆధారపడటాన్ని తగ్గించాలని భారత్ను ఒప్పించేందుకు బ్రిటన్ ప్రయత్నిస్తోంది.
గత నెలలో బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ భారత్లో పర్యటించారు. రష్యాపై ఆంక్షలను విధించేందుకు భారత్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. మరోవైపు రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఆహార భద్రతల్లో సహకారంపై కూడా చర్చలు జరిపారు.
ఫిబ్రవరి 24న యుక్రెయిన్పై రష్యా దాడిని భారత్ ఖండించలేదు. మరోవైపు రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓటింగ్కు కూడా భారత్ దూరంగా ఉంది.
తాజా పర్యటనలో భాగంగా బోరిస్ జాన్సన్ గురువారం గుజరాత్లో పర్యటించనున్నారు. బ్రిటన్, భారత్లలో కీలక రంగాల్లో పెట్టుబడులపై ఆయన ప్రకటన చేసే అవకాశముంది. సైన్స్, ఆరోగ్యం, టెక్నాలజీ రంగాల్లో సహకారంపైనా మాట్లాడే అవకాశముంది.

ఫొటో సోర్స్, PA Media
వ్యూహాత్మక భాగస్వామి
భారత్ పర్యటనకు ముందు మీడియాతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడారు. ‘‘మన శాంతి, సుసంపన్నతలకు నియంతృత్వ దేశాల నుంచి ముప్పు ఎదురవుతుండటంతో మన రెండు ప్రజాస్వామ్య దేశాలు ఒకే మాటపై నిలవడం చాలా ముఖ్యం’’అని ఆయన అన్నారు.
‘‘ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటి. మరోవైపు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కూడా. చాలా రంగాల్లో భారత్ను ప్రధాన వ్యూహాత్మక భాగస్వామిగా బ్రిటన్ గుర్తిస్తోంది. నా పర్యటన ద్వారా రెండు దేశాలకు మేలుచేసే కార్యక్రమాలకు పునాదులు పడతాయి. ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధి నుంచి ఇంధనం, రక్షణ రంగాల్లో ప్రధాన అంశాలపై చర్చలు జరుపుతాం’’ అని కూడా బోరిస్ జాన్సన్ అన్నారు.
నిజానికి, బోరిస్ జాన్సన్ గత ఏడాది ఏప్రిల్లో భారత్కు రావాల్సి ఉంది. అయితే, కోవిడ్-19 వ్యాప్తి నడుమ ఆ పర్యటన వాయిదా పడింది. మరో వైపు భారత్ను బ్రిటన్ అప్పుడు రెడ్ లిస్ట్లో చేర్చింది. అంటే ఇక్కడి నుంచి వచ్చే ప్రజలు పది రోజులపాటు హోటల్లో తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాల్సిందే.
మొదట్లో కరోనావైరస్ కేసులు పెరుగుతున్నప్పటికీ బోరిస్ జాన్సన్ పర్యటన కొనసాగుతుందని బ్రిటన్ ప్రభుత్వం చెప్పింది.
అయితే, పర్యటనకు బదులుగా ఆన్లైన్లో ప్రధాని నరేంద్ర మోదీతో బోరిస్ జాన్సన్ మాట్లాడారు.
బ్రిటన్లో లాక్డౌన్ విధించడం వల్ల జనవరి 2021లో కూడా బోరిస్ జాన్సన్ భారత్ పర్యటన వాయిదా పడింది.
ఇవి కూడా చదవండి:
- హనుమాన్ జయంతి: దిల్లీ జహాంగీర్పురీలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు, పోలీసులకు గాయాలు
- అంబేడ్కర్ రెండో పెళ్ళి కథ: 'ప్రియాతి ప్రియమైన షారూ... ప్రేమతో నీ రాజా'
- ఇండియన్ స్టాండర్డ్ టైమ్: ఈశాన్య రాష్ట్రాలు రెండో టైమ్ జోన్ కావాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి
- బాయిల్డ్, రా రైస్ మధ్య తేడా ఏమిటి? తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై వివాదం ఎందుకు
- మోహన్ భాగవత్: ‘‘15ఏళ్లలో అఖండ భారత్ కల సాకారం’’.. నెటిజన్లు ఏం అంటున్నారంటే..
- యుక్రెయిన్లో రష్యా యుద్ధ ట్యాంకులను భారీగా ఎందుకు కోల్పోతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)










