బోరిస్ జాన్సన్: రక్షణ బంధం పటిష్టం చేయడమే లక్ష్యంగా భారత్‌లో పర్యటించనున్న బ్రిటన్ ప్రధాని

బోరిస్ జాన్సన్, మోదీ

ఫొటో సోర్స్, PA Media

ఎప్పటినుంచో వాయిదా పడుతున్న భారత్ పర్యటనకు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఈ వారంలో రాబోతున్నారు. రెండు దేశాల మధ్య రక్షణ బంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన భారత్‌లో పర్యటించనున్నారు.

దిల్లీలో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జాన్సన్ సమావేశం కానున్నారు. రక్షణ, వాణిజ్య బంధాలపై ప్రధానంగా వీరు చర్చల్లో దృష్టి కేంద్రీకరిస్తారు.

ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బోరిస్ జాన్సన్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇదివరకు ఆయన పర్యటనలు కోవిడ్-19 వ్యాప్తి వల్ల వాయిదా పడ్డాయి.

బోరిస్ జాన్సన్

ఫొటో సోర్స్, PA Media

యుక్రెయిన్‌పై రష్యా దాడి అనంతరం, ఆయుధ సంపత్తి కోసం రష్యా మీద ఆధారపడటాన్ని తగ్గించాలని భారత్‌ను ఒప్పించేందుకు బ్రిటన్‌ ప్రయత్నిస్తోంది.

గత నెలలో బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ భారత్‌లో పర్యటించారు. రష్యాపై ఆంక్షలను విధించేందుకు భారత్‌ను ఒప్పించే ప్రయత్నం చేశారు. మరోవైపు రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఆహార భద్రతల్లో సహకారంపై కూడా చర్చలు జరిపారు.

ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా దాడిని భారత్ ఖండించలేదు. మరోవైపు రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓటింగ్‌కు కూడా భారత్ దూరంగా ఉంది.

తాజా పర్యటనలో భాగంగా బోరిస్ జాన్సన్ గురువారం గుజరాత్‌లో పర్యటించనున్నారు. బ్రిటన్, భారత్‌లలో కీలక రంగాల్లో పెట్టుబడులపై ఆయన ప్రకటన చేసే అవకాశముంది. సైన్స్, ఆరోగ్యం, టెక్నాలజీ రంగాల్లో సహకారంపైనా మాట్లాడే అవకాశముంది.

బోరిస్ జాన్సన్, మోదీ

ఫొటో సోర్స్, PA Media

వ్యూహాత్మక భాగస్వామి

భారత్ పర్యటనకు ముందు మీడియాతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడారు. ‘‘మన శాంతి, సుసంపన్నతలకు నియంతృత్వ దేశాల నుంచి ముప్పు ఎదురవుతుండటంతో మన రెండు ప్రజాస్వామ్య దేశాలు ఒకే మాటపై నిలవడం చాలా ముఖ్యం’’అని ఆయన అన్నారు.

‘‘ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ కూడా ఒకటి. మరోవైపు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కూడా. చాలా రంగాల్లో భారత్‌ను ప్రధాన వ్యూహాత్మక భాగస్వామిగా బ్రిటన్ గుర్తిస్తోంది. నా పర్యటన ద్వారా రెండు దేశాలకు మేలుచేసే కార్యక్రమాలకు పునాదులు పడతాయి. ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధి నుంచి ఇంధనం, రక్షణ రంగాల్లో ప్రధాన అంశాలపై చర్చలు జరుపుతాం’’ అని కూడా బోరిస్ జాన్సన్ అన్నారు.

వీడియో క్యాప్షన్, క్వీన్ ఎలిజబెత్ 2: ప్లాటినం జూబ్లీ పూర్తి చేసుకున్న తొలి సామ్రాజ్ఞి

నిజానికి, బోరిస్ జాన్సన్ గత ఏడాది ఏప్రిల్‌లో భారత్‌కు రావాల్సి ఉంది. అయితే, కోవిడ్-19 వ్యాప్తి నడుమ ఆ పర్యటన వాయిదా పడింది. మరో వైపు భారత్‌ను బ్రిటన్ అప్పుడు రెడ్ లిస్ట్‌లో చేర్చింది. అంటే ఇక్కడి నుంచి వచ్చే ప్రజలు పది రోజులపాటు హోటల్‌లో తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సిందే.

మొదట్లో కరోనావైరస్ కేసులు పెరుగుతున్నప్పటికీ బోరిస్ జాన్సన్ పర్యటన కొనసాగుతుందని బ్రిటన్ ప్రభుత్వం చెప్పింది.

అయితే, పర్యటనకు బదులుగా ఆన్‌లైన్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో బోరిస్ జాన్సన్ మాట్లాడారు.

బ్రిటన్‌లో లాక్‌డౌన్ విధించడం వల్ల జనవరి 2021లో కూడా బోరిస్ జాన్సన్ భారత్ పర్యటన వాయిదా పడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)