రష్యా-యుక్రెయిన్ సంక్షోభం: భారత వైఖరిపై ఇంత చర్చ ఎందుకు

ఫొటో సోర్స్, AFP
రష్యా, యుక్రెయిన్ ఉద్రిక్తతలపై భారత్ వైఖరి గురించి సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. చాలామంది భారత వైఖరిని ప్రశ్నిస్తున్నారు. అలాగే భారత్ను సమర్థించేవారు కూడా పెద్దసంఖ్యలో ఉన్నారు.
తూర్పు యుక్రెయిన్లోని డొనాట్స్క్, లుహాస్క్స్ ప్రాంతాలను స్వతంత్ర భూభాగాలుగా గుర్తిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.
ఈ రెండు ప్రాంతాలూ రష్యా అండ ఉన్న తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్నాయి. వీటిని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ డొనాట్స్క్, లుహాస్క్స్గా పిలుస్తున్నారు. 2014 నుంచి ఈ తిరుగుబాటుదారులు, యుక్రెయిన్తో పోరాడుతున్నారు.
అంతేకాకుండా ఈ ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా పుతిన్, తమ సైనికులను ఆదేశించారు.
పుతిన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మంగళవారం ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో యుక్రెయిన్, రష్యా ఉద్రిక్తతలపై భారత్, తన వైఖరిని వెల్లడించింది.
ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి... భద్రతామండలి అత్యవసర సమావేశంలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తూ అన్ని దేశాలు సంయమనం పాటించాలని కోరారు.
''యుక్రెయిన్ తూర్పు సరిహద్దుల్లోని పరిణామాలను, రష్యా ప్రకటనలను భారత్ గమనిస్తూనే ఉంది. రష్యా, యుక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడం చాలా ఆందోళనకర పరిణామం. ఆ ప్రాంతంలోని శాంతి భద్రతలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అన్ని దేశాల భద్రతా ప్రయోజనాల కోసం, ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత్వాన్ని నెలకొల్పడం కోసం ఉద్రిక్తతలను తగ్గించేలా తక్షణ చర్యలు తీసుకోవాలి'' అని తిరుమూర్తి అన్నారు.
ఒకవైపు పాశ్చాత్య దేశాలు పుతిన్పై విరుచుకుపడుతుండగా భారత్ మాత్రం 'రష్యా చర్యను ఖండించలేదు. యుక్రెయిన్ సార్వభౌమత్వం గురించి మాట్లాడలేదు'. దీంతో భారత్ వైఖరి చర్చనీయాంశం అయింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
భారత్ ఎందుకు తటస్థ వైఖరిని అవలంభిస్తోంది?
యూరోపియన్ యూనియన్తో పాటు అంతర్జాతీయ సంబంధాలపై పనిచేసే రిచర్డ్ గోవన్ ఈ వ్యవహారంపై ట్వీట్ చేశారు.
''ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో యుక్రెయిన్ సంక్షోభం గురించి మాట్లాడిన 'నాటో' కూటమిలో లేని దేశాలలో మొదటిది భారతదేశం. దౌత్యవిధానాల ద్వారా ఉద్రిక్తతలు తగ్గించడం గురించి భారత్ మాట్లాడింది. అంతేగానీ రష్యా చర్యను ఖండించడం, యుక్రెయిన్ సార్వభౌమత్వం గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు'' అని రిచర్డ్ ట్వీట్ చేశారు.
''జనవరి 31న, ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో యుక్రెయిన్పై చర్చ గురించి నిర్వహించిన ఓటింగ్లో భారత్తో పాటు కెన్యా కూడా పాల్గొనలేదు. కానీ మంగళవారం కెన్యా అకస్మాత్తుగా తన వైఖరిని మార్చుకుంది. పుతిన్ నిర్ణయాలను తీవ్రంగా ఖండించింది. తూర్పు యుక్రెయిన్లో తాజా పరిస్థితి, ఆఫ్రికాలో వలస పాలన అనంతరం సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలా ఉందని కెన్యా వర్ణించింది. రష్యా పరిగణించనప్పుడు వలస సరిహద్దును ఆఫ్రికా దేశాలు మాత్రం ఎందుకు పరిగణించాలని కెన్యా ప్రశ్నించింది'' అని రిచర్డ్ ట్వీట్లో చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
యుక్రెయిన్ విషయంలో భారత వైఖరిపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భారత్లోని ప్రముఖ ఇంగ్లీష్ వార్తా పత్రిక 'ది హిందూ' అంతర్జాతీయ వ్యవహారాల ఎడిటర్ స్టాన్లీ జానీ తన అభిప్రాయాన్ని ఇలా రాసుకొచ్చారు.
''యుక్రెయిన్పై భారత వైఖరిని విమర్శిస్తున్నవారు ప్రాథమిక వాస్తవాలను మర్చిపోతున్నారు. భారత్, రష్యాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయి. సొంత ప్రయోజనాలకు వ్యతిరేకంగా భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు'' అని ఆయన వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
రష్యా, యుక్రెయిన్లలో ఉద్రిక్తతల పెరుగుదల, భారత్కు చాలా సున్నితమైన విషయం అని తన సంపాదకీయంలో ది హిందూ పత్రిక పేర్కొంది.
భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్... జర్మనీ, ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. యూరోపియన్ ప్రతినిధులతో సంభాషణ సందర్భంగా ఆయన రష్యా- యుక్రెయిన్ గురించి కాకుండా ఇండో-పసిఫిక్పై దృష్టి కేంద్రీకరించేందుకు ప్రయత్నించారు.
''ఇదే సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటనకు వెళ్లారు. దీన్ని భారత్ గమనిస్తోంది. రష్యాలో ఉద్రిక్త పరిస్థితులు భారత్కు ఏవిధంగానూ మంచివి కాదు. రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థల డెలివరీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఏఏటీఎస్ఏ చట్టం ప్రకారం అమెరికా, భారత్కు వ్యతిరేకంగా రష్యాపై ఆంక్షలు విధించవచ్చు. ఈ నేపథ్యంలో భారత్ సంకట స్థితిలో నిలిచింది" అని సంపాదకీయం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా, రష్యా మధ్య చిక్కుకున్న భారత్
రష్యా- యుక్రెయిన్ సంక్షోభంలో భారత విధానంపై ఫిబ్రవరి 22న అమెరికా మ్యాగజీన్ 'ఫారిన్ అఫైర్స్' ఒక కథనాన్ని ప్రచురించింది. యుక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబేలా ప్రకటనను కూడా అందులో ప్రస్తావించింది.
''భారత్ ఏమాత్రం సంకోచం లేకుండా... రష్యా చర్యలను తాము అంగీకరించబోమని ప్రకటిస్తే, తమకు ఎంతో మద్దతుగా నిలిచినట్లు ఉంటుందని ఫిబ్రవరి 3న కుబేలా భారత్కు బహిరంగ విజ్ఞప్తిని చేశారని 'ఫారిన్ అఫైర్స్' పేర్కొంది.
కుబేలా చేసిన విజ్ఞప్తి గురించి 'ఫారిన్ అఫైర్స్' మ్యాగజీన్ ఇలా రాసింది.
''భారత్ను కుబేలా ఇలా అభ్యర్థించారంటే, దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ప్రపంచ వేదికపై భారత్ చాలా కీలక దేశం. భారత్కు అమెరికాతో కంటే కూడా రష్యాతోనే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ రష్యాను భారత్ విమర్శిస్తే, ఈ ఆందోళన కేవలం పాశ్చాత్య దేశాలకే పరిమితం కాదని రష్యాకు తెలిసొస్తుంది. అంతేకాకుండా ప్రజాస్వామ్యానికి భారత్ దృఢమైన మద్దతునిస్తుందని... అమెరికాతో భవిష్యత్ భాగస్వామ్యాల కోసం న్యూదిల్లీ ఎదురుచూస్తుందనే సందేశాన్ని కూడా పంపుతుంది. ఇది యుక్రెయిన్పై చైనా వైఖరికి భిన్నంగా కూడా ఉంటుంది. యుక్రెయిన్ అంశంలో చైనా చాలా శాంతంగా వ్యవహరిస్తోంది'' అని ఆ మ్యాగజీన్ రాసుకొచ్చింది.
''భారత్ సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఏ చర్య తీసుకున్నా, సొంత ప్రయోజనాలకు దెబ్బ పడుతుంది. ఒకవేళ రష్యాను విమర్శిస్తే... తమకు ఎంతో ముఖ్యమైన, చారిత్రక మిత్రునికి భారత్ దూరం కావాల్సి వస్తుంది. ఇదే జరిగితే చైనాకు రష్యా దగ్గరవుతుంది. చైనాను భారత్ అతిపెద్ద ముప్పుగా పరిగణిస్తుంది''
''ఒకవేళ భారత్ బహిరంగంగా రష్యాకు మద్దతు పలికితే అమెరికాతో సంబంధాలు ప్రభావితం అవుతాయి. భారత్, అమెరికాలు పూర్వకాలం నుంచి సన్నిహితంగా ఏమీ లేవు. కానీ దౌత్యపరంగా ఇరుదేశాలు కీలక భాగస్వాములు. ఒకవేళ భారత్ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్ధంగా ఉంటే అమెరికా, రష్యాలకు కోపం రావొచ్చు. భారత్ను అస్థిరమైన, విశ్వసనీయత లేని భాగస్వామిగా ఇరుదేశాలు పరిగణించే అవకాశం ఉంది'' అని ఆ కథనం పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
భారత తాజా వైఖరికి కారణం ఏమిటి?
'ఫారిన్ అఫైర్స్' ప్రచురించిన ఈ కథనంపై 'ద హెరిటేజ్ ఫౌండేషన్'లో దక్షిణాసియా పరిశోధకుడు జెఫ్ ఎం స్మిత్ ట్వీట్ చేశారు.
''ఇందులో తార్కికత ఉంది. కానీ భారత సామర్థ్యాన్ని అతిగా ఊహించుకున్నట్లుగా నాకు అనిపిస్తోంది. రష్యా నిర్ణయాన్ని భారత్ ప్రభావితం చేయలేదు. కనీసం యుక్రెయిన్ విషయంలో ఇది జరగదు. ఎందుకంటే ఇది వారికి చాలా సున్నితమైన అంశం. ఈ విషయంలో పుతిన్ ఎవరి మాటా వినడం లేదు. మిత్రదేశాల నుంచి వచ్చే ఒత్తిడిని కూడా ఆయన లెక్కచేయరు.''
''ఒకవేళ దాడి జరిగితే మాత్రం రష్యా తీరును ఖండించాలని భారత్పై మరింత ఒత్తిడి పెరుగుతుంది. భారత తాజా వైఖరి కారణంగా, ఈయూతో సంబంధాలు క్షీణించాయనే అంశాన్ని నేను అంగీకరించను. దౌత్యపరమైన చర్యల ద్వారానే యుక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించవచ్చని భారత్ పేర్కొందనే విషయాన్ని గుర్తించాలి. అంటే ఎలాంటి సైనిక చర్యకు భారత్ మద్దతు ఇవ్వడం లేదని అర్థం చేసుకోవాలి'' అని ఆయన ట్వీట్ చేశారు.
'ద బ్రూకింగ్ ఇన్స్టిట్యూషన్' సీనియర్ పరిశోధకులు తన్వీ మదన్, భారత వైఖరికి మద్దతు తెలిపారు. భారత వైఖరిని విమర్శిస్తున్నవారంతా రష్యాతో భారత్ సంబంధాలను మరచిపోతున్నారని తన్వీ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
''భారత్, రష్యా సంబంధాల్లో రెండు కోణాలు ఉన్నాయి. అందులో ఒకటేమో అధికారిక కోణం. దీనిగురించి అందరూ మాట్లాడతారు. రెండోదాని గురించి ఎవరూ చర్చించట్లేదు. సానుకూల అంశం ఏమిటంటే... ఒక భాగస్వామిగా రష్యా, భారత్కు మిలిటరీ సాంకేతికత, ఇతర అంశాలలో సహాయం చేస్తుంది. మిగతా దేశాలు ఇలా చేయవు. ప్రతికూలాంశం ఏమిటంటే చైనా అంశంలో అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రయోజనాలను రష్యా దెబ్బతీయవచ్చు. రష్యాను భారత్ ఒక మద్దతుదారుగా చూడొచ్చు. లేదా తమ ప్రయోజనాలకు ముప్పు కలిగించే దేశంగా కూడా భావించవచ్చు. కానీ భారత్ మాత్రం రష్యా నుంచి అధిక ప్రయోజనాలను, మద్దతును కూడగట్టుకునేందుకే ప్రయత్నిస్తోంది. రష్యాతో విరోధాన్ని వ్యతిరేకిస్తుంది'' అని తన్వీ వివరించారు.
''మిలిటరీ సామగ్రి విషయంలో భారత్కు రష్యా హాని చేయగలదు. భారత మిలిటరీ పరికరాల్లో 50-80 శాతం రష్యాలో తయారైనవే. అంటే సాధారణ పరిస్థితుల్లో కూడా రష్యా నుంచి విడిభాగాలు, సాంకేతికత, నిర్వహణ భారత్కు అవసరం. ఇది భారత్కు సామాన్యమైన విషయం కాదని బహుశా చాలామంది ప్రజలు మర్చిపోతున్నారు. రెండేళ్ల క్రితం మొదలైన భారత్-చైనా సరిహద్దు వివాదం ఇంకా ముగిసిపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా నుంచి మిలిటరీ సహాయం చాలా కీలకం.''
''ఇవన్నీ అభూతకల్పనలే అని చాలా మంది అంటారు. కానీ వారు అనుకునేది నిజం కాదు. తనకు అవమానాలు ఎదురవుతున్నాయని పుతిన్ భావిస్తే, ఆయనను ఎదుర్కోవడం చాలా కష్టమనే సంగతి మనకు తెలుసు. ఎవరు కించపరిచినా ఆయన ఉపేక్షించరు. ఆయనకు జరిగినట్లే ఎదుటివారికి కూడా అదే గతిని పట్టిస్తారు'' అని తన్వీ చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- డీఫిబ్రిలేషన్ ఇచ్చి ఉంటే మంత్రి గౌతమ్ రెడ్డి ప్రాణాలు కాపాడగలిగేవారా?
- కర్ణాటక: బజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసు.. పోలీసులు ఏం చెబుతున్నారు?
- బంగారం గని సమీపంలో పేలుడు, 60 మంది మృతి
- వృద్ధిమాన్ సాహాకు రిటైర్ కావాలని కోచ్ ద్రవిడ్ సలహా, ఇద్దరి మధ్యా ఏం జరిగింది?
- ఉద్యోగాలు: ఊపందుకుంటున్న యాంటీ-వర్క్ ఉద్యమం.. దీని లక్ష్యాలేమిటి, ప్రభావాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














