అఫ్గానిస్తాన్: షియాల మసీదుపై ఆత్మాహుతి బాంబు దాడి... 37 మంది మృతి

బాంబుదాడి జరిగింది ఈ మసీదులోనే
ఫొటో క్యాప్షన్, బాంబుదాడి జరిగింది ఈ మసీదులోనే

అఫ్గానిస్తాన్‌లోని ఒక షియా మసీదుపై శుక్రవారం నాటి ప్రార్థనల సమయంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 37 మంది మరణించారు. మరో 70 మంది గాయపడ్డారు.

కాందహార్‌లోని ఇమాన్ బార్గా మసీదులో మూడు బాంబు పేలుడులు సంభవించాయి. విరిగిపోయిన కిటికీలు, చెల్లాచెదురుగా ఉన్న మృతదేహాలున్న ఫొటోలు షేర్ అవుతున్నాయి.

పేలుడుకి ఎవరు బాధ్యులన్నది ఇంతవరకూ తెలియలేదు.

పేలుడు తీవ్రతకు గాయపడినవారికి మీర్ వాయిస్ ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక వైద్యుడొకరు బీబీసీతో చెప్పారు.

పేలుడులో కుటుంబసభ్యులను కోల్పోయి విలపిస్తున్న వ్యక్తి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పేలుడులో కుటుంబసభ్యులను కోల్పోయి విలపిస్తున్న వ్యక్తి

ఐఎస్ తీవ్రవాద సంస్థకు అఫ్గానిస్తాన్ శాఖగా పనిచేస్తున్న ఐఎస్-కే సంస్థ ఈ బాంబుదాడి వెనుక ఉన్నట్లు భావిస్తున్నారని బీబీసీ అఫ్గానిస్తాన్ ప్రతినిధి సయ్యద్ కిర్మానీ తెలిపారు.

గత శుక్రవారం కుందుజ్ నగరంలోని షియా మసీదుపై జరిగిన బాంబు దాడిలో 50 మందికిపైగా మరణించారు.

అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగిన తరువాత జరిగిన ఆ అతిపెద్ద దాడికి తామే కారణమని ఐఎస్-కే ప్రకటించుకుంది.

తాలిబాన్లు ప్రభుత్వం ఏర్పాటుచేయడాన్ని వ్యతిరేకిస్తున్న ఐఎస్-కే అఫ్గానిస్తాన్‌లో అనేక దాడులకు పాల్పడింది.

అత్యంత హింసాత్మక సంస్థ ఐఎస్-కే

అఫ్గానిస్తాన్‌లోని అన్ని జిహాదిస్ట్ గ్రూపుల కంటే ఐఎస్-కే అత్యంత హింసాత్మకమైనది. ఇది సున్నీ ముస్లిం గ్రూప్.

షియా ముస్లింలను తీవ్రంగా వ్యతిరేకించే వీరు వారిని లక్ష్యంగా చేసుకుంటారు.

అఫ్గానిస్తాన్ రాజకీయ నాయకులు, భద్రతా దళాలు, మంత్రిత్వ కార్యాలయాలను, తాలిబాన్లను, అమెరికా, నాటో సేనలను, అంతర్జాతీయ సహాయ సంస్థలను, షియా మైనారిటీలు, సిక్ మైనారిటీలను కూడా వీరు లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)