పాండోరా పేపర్స్: తాము ఏ తప్పూ చేయలేదంటున్న పలువురు దేశాధ్యక్షులు

పండోరా పేపర్స్

పాండోరా పేపర్లలో పేర్లు బయటపడిన పలువురు నేతలు తాము ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు.

పలువురు దేశాధ్యక్షులు, రాజకీయ నాయకులు, సంపన్నుల రహస్య ఆస్తులు, ఆర్థిక లావాదేవీల గుట్టును పాండోరా పేపర్స్‌ బయటపెట్టాయి.

ఈ పత్రాల్లోని 35 మంది ప్రస్తుత, మాజీ నేతల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జోర్డాన్ రాజు అబ్దుల్లా టూ బిన్ అల్-హుస్సేన్ కూడా ఉన్నారు.

తాము ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ ఇద్దరూ ప్రకటనలు విడుదల చేశారు.

కింగ్ అబ్దుల్లాకు "విదేశాల్లో ఆస్తులు ఉండడం అసాధారణం, అనుచితమేమీ కాదు" అని జోర్డాన్ రాయల్ పాలెస్ చెప్పింది.

జోర్డాన్ రాజు 1999లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్రిటన్, అమెరికాలో ఆస్తులు కొనడానికి రహస్యంగా 100 మిలియన డాలర్ల (రూ.745 కోట్లకు పైనే)కు పైగా ఖర్చు చేశారని లీకైన పత్రాల్లో ఉంది.

రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆయన అంతర్గత సర్కిల్‌లోని వ్యక్తులకు సంబంధించిన ఆస్తుల వివరాలు బయటికి రావడంపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందించారు.

"ఈ సమాచారం ఏంటి, ఇది దేని గురించి అనే విషయంలో ఇప్పటికీ స్పష్టతలేదు. పుతిన్ అంతర్గత సర్కిల్ అక్కడ దాచిన సంపద ఏదీ మాకు కనిపించడం లేదు" అని ఆయన మీడియాతో అన్నారు.

వీడియో క్యాప్షన్, పాండోరా పత్రాల్లో ఉన్న ప్రముఖులెవరు?

పాండోరా పేపర్స్‌లో ఉన్న మిగతా నేతలు

చెక్ ప్రధాని ఆండ్రెజ్ బేబిస్: దక్షిణ ఫ్రాన్స్‌లో 12 మిలియన్ పౌండ్ల(రూ.121 కోట్లకు పైనే)కు రెండు విల్లాలు కొనుగోలు చేయడానికి ఉపయోగించిన ఆఫ్ షోర్ పెట్టుబడి కంపెనీ గురించి ఈయన వెల్లడించలేదని చెబుతున్నారు.

కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యట్టా: అధ్యక్షుడు, ఆయన కుటుంబంలోని మరో ఆరుగురు సభ్యులకు 13 ఆఫ్ షోర్ కంపెనీలతో సంబంధాలున్నాయని పండోరా పేపర్స్‌ చెబుతున్నాయి.

చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా: బిలియనీర్, వ్యాపారవేత్త అయిన పినేరా పర్యావరణం పరంగా అత్యంత సున్నితమైన ఒక ప్రాంతంలోని ఇనును, రాగి గనిని తన చిన్ననాటి స్నేహితుడికి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నట్లు స్పెయిన్ ఎల్ పయాస్ పత్రిక వివరించింది.

అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్: బ్రిటన్‌లో 400 మిలియన్ పౌండ్ల(రూ.4055 కోట్లు పైనే)కు పైగా విలువైన ఆస్తుల ఒప్పందాల్లో అధ్యక్షుడి కుటుంబానికి, ఆయన సన్నిహితులకు రహస్య ప్రమేయం ఉన్నట్టు చెబుతున్నారు.

"ఈ వారంలో జరగబోయే ఎన్నికలను ప్రభావితం చేయడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారని, తాను ఏ తప్పులు, అక్రమాలూ చేయలేదు" అని చెక్ ప్రధాని ఆండ్రెజ్ ట్వీట్ చేశారు.

"విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఈ లీకులపై వివరంగా మాట్లాడతాను" అని కెన్యా అధ్యక్షుడు కెన్యట్టా చెప్పారు.

కెన్యట్టా కుటుంబం.. దేశ సంపదను తమ ఆఫ్ షోర్ కంపెనీల్లో దాచినట్లు పండోరా పత్రాల్లో ఎలాంటి ఆధారాలూ కనిపించలేదు.

ఇక "డోమింగా మైనింగ్ ప్రాజెక్టు విక్రయంలో తన పాత్రను, ఆ సమాచారాన్ని పినేరా ఖండించారు" అంటూ చిలీ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

అజర్‌బైజాన్ అధ్యక్షుడు అలియేవ్, ఆయన కుటుంబాన్ని సంప్రదించేందుకు తాము చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ది గార్డియన్ తెలిపింది.

పండోరా పత్రాలలో పేర్లున్న తమ దేశ పౌరులపై దర్యాప్తు జరిపిస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్ మంత్రులతోపాటూ, వందల మంది పాకిస్తానీల పేర్లు ఇందులో ఉన్నాయి.

పండోరా పేపర్స్

వాషింగ్టన్ డీసీలోని 'ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్' (ఐసీఐజే) ఈ సమాచారాన్ని సేకరించింది. ఇది 140కి పైగా మీడియా సంస్థలతో కలిసి పరిశోధన చేసి, ఆ వివరాలను పాండోరా పేపర్స్ పేరుతో బయటపెట్టింది.

బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్‌, పనామా, బెలిజ్, సైప్రస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన 14 ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీల నుంచి సంపాదించిన దాదాపు 12 మిలియన్ల (కోటీ 20 లక్షలు) పత్రాలను 650 మందికి పైగా రిపోర్టర్లు అధ్యయనం చేశారు.

బ్రిటన్‌లో బీబీసీ పనోరమా, గార్డియన్‌తో కలిసి ఈ పరిశోధన చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)