తాలిబాన్ల పాలన ఎలా ఉంటుందంటే..: ‘ఆడామగా మాట్లాడుకున్నా తప్పే.. ఇంటి తలుపుకొట్టి ఏమడిగితే అది ఇచ్చేయాల్సిందే’

మంత్రసాని పనిచేసే నూరియా హయా నిత్యం పురుష వైద్యులతో మాట్లాడాల్సి ఉంటుంది.
ప్రాధాన్యం ప్రకారం ఆమె ఆ రోజు ఏ క్లినిక్లో పనిచేయాలి.. ఏఏ గర్భిణులకు సేవలందించాలనేది వైద్యులే నిర్ణయిస్తారు.
అఫ్గానిస్తాన్లోని తఖర్ ప్రావిన్స్లో పెద్దగా సౌకర్యాలు ఉండని ఇష్కామిష్ ప్రాంతంలో ఆమె పనిచేస్తారు. తజకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే మారుమూల గ్రామీణ ప్రాంతమది.
అయితే, ఆ ప్రాంతాన్ని తాలిబాన్లు అధీనంలోకి తీసుకున్న తరువాత క్లినిక్లలో ఆడ, మగ సిబ్బంది మాట్లాడుకోవడంపై నిషేధం విధించారని 29 ఏళ్ల నూరియా హయా చెప్పారు.
మే నెలలో నాటో సేనలు అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపోయిన తరువాత తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న అత్యంత కీలక సరిహద్దు ప్రాంతం ఇష్కామిష్. హిందూకుష్ పర్వత శ్రేణిలో ఉంటుంది ఇది.
దక్షిణ హెల్మాండ్ను, ఆ తరువాత హిందూకుష్ పర్వతాల ప్రారంభంలో ఉండే ఉత్తర బుర్ఖా జిల్లానూ తాలిబాన్లు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.
ఆ సమయంలో అమెరికా సేనలు కాందహార్ ఎయిర్బేస్ నుంచి వెళ్లిపోయాయి. ఆ తరువాత తాలిబాన్లు ఒక్కటొక్కటిగా స్వాధీనం చేసుకుంటూ సాగిపోయారు.

''ప్రతి ఒక్కరూ భయపడిపోయారు'' అని 54 ఏళ్ల జన్ అఘా చెప్పారు. కాందహార్కు తూర్పున పాకిస్తాన్ సరిహద్దులో ఉండే అర్ఘిస్థాన్ జిల్లా అఘాది.
'ప్రజలు ఎవరికి వారు ఇళ్లకు తాళాలు వేసుకుని అందులోనే ఉండిపోయారని అఘా చెప్పారు.
కానీ, తాలిబాన్లు దాదాపుగా అన్ని గ్రామాలను స్వాధీనం చేసుకోవడంతో స్థానికులెవరూ వారి నుంచి తప్పించుకోలేకపోయారు.
‘‘ఉదయం, సాయంత్రం సాయుధ తాలిబాన్లు వీధుల్లో తిరుగుతారు. ఇళ్ల తలుపులు బాది తమకు ఆహారం కావాలని అడుగుతారు. ప్రజలు భయంతో వారడిగిన ఆహారం అందిస్తారు. లేదంటే ఏం జరుగుతుందో వారికి తెలుసు'' అన్నారు అఘా.
''ప్రతి ఇంట్లోనూ తాలిబాన్ల కోసం అదనంగా మూణ్నాలుగు రొట్టెలు కానీ, ఇతర వంటకాలు కానీ ఉంచుతారు'' అని పండ్లు విక్రయిస్తూ జీవనం సాగించే అఘా చెప్పారు.
ఎంత పేదవారైనా తాలిబాన్లు ఏమడిగితే అది ఇవ్వాల్సిందేనని.. ఒకవేళ ఇంట్లో ఉంటామంటే ఉండనివ్వాల్సిందేనని అఘా చెప్పారు.
జూన్లో తాలిబాన్లు అనేక రాష్ట్రాలను తమ అధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించుకున్నారు. తఖార్, ఫర్యాబ్ వంటి రాష్ట్రాలన్నీ వారి వశమయ్యాయి.
ఆ నెలలో మరో 2,500 మంది అమెరికా సైనికులు అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపోయారు.
అప్పటికి విమానాశ్రయ అవసరాల రీత్యా కాబుల్లో మాత్రం అమెరికా సైనికులు పెద్ద సంఖ్యలో ఉండేవారు.
సంకీర్ణ సేనలను వడివడిగా ఉపసంహరించుకోవడానికి చాలామంది అఫ్గాన్లు తప్పుపట్టారు.
అమెరికా, తాలిబాన్ల మధ్య గత రెండేళ్లుగా జరిగిన శాంతి చర్చలు తాలిబాన్లు తమ సంఖ్యాబలం పెంచుకోవడానికి, తమ లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి ఉపయోగపడ్డాయన్నది కొందరి వాదన.
ఇరవయ్యేళ్ల కిందట అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనల రాకతో అప్పటికి అయిదేళ్ల తాలిబాన్ పాలనకు తాత్కాలికంగా ముగింపు పలికినట్లయింది.. కానీ, పూర్తి ముగింపు మాత్రం దొరకలేదు.
జూన్లో తాలిబాన్లు మరింతగా పుంజుకోవడంతో గత రెండు దశాబ్దాలుగా ఎంతో కొంత అనుభవిస్తున్న సామాజిక, ఆర్థిక హక్కులన్నీ మళ్లీ పోయాయి.
''ఇప్పుడు ఎన్నో ఆంక్షలున్నాయి. బయటకు వెళ్లేటప్పుడు తాలిబాన్లు ఆదేశానుసారం నేను బురఖా ధరించాలి. తోడుగా కుటుంబంలోని పురుషులు నాతో ఉండాలి'' అంటూ ప్రస్తుత పరిస్థితులను వివరించారు నూరియా.
''ఇకపై గర్భిణులకు సేవలందించేందుకు జిల్లా అంతటా ప్రయాణించడం నాకు కష్టమవుతుంది. ఇకపై మగవాళ్లు గడ్డం గీయించుకోవడానికి వీల్లేదు. అలా చేయడం ఇస్లాంకు వ్యతిరేకమని తాలిబాన్లు చెబుతున్నారు''
తాలిబాన్లలోనే అమ్రి బిల్ మరోఫ్ అనే ఒక గ్రూప్ ఇలాంటి సాంఘిక కట్టుబాట్లను అమలు చేస్తుంది.
1990ల ప్రాంతంలో అమ్రి బిల్ మరోఫ్ అమలు చేసిన శిక్షలు భయంకరంగా ఉండేవి. రెండంచెల విధానం అమలు చేస్తూ.. మొదటి దశలో హెచ్చరించడం, రెండో దశలో తీవ్రమైన శిక్షలు వేయడం చేసేది.
''ఒక్కసారిగా మా స్వేచ్ఛ అంతా హరించేసినట్లయింది'' అని నూరియా అన్నారు.
''వారు చాలా క్రూరులు. వారేం చెబితే అది చేయాలి. సొంత ప్రయోజనాల కోసం వారు ఇస్లాంను ఉపయోగించుకుంటున్నారు. మేమే ముస్లింలు, వారి విశ్వాసాలు వేరు'' అన్నారామె.

ఫర్ఖార్ జిల్లాకు చెందిన టాక్సీ డ్రైవర్ ఆసిఫ్ అహాదీ మాట్లాడుతూ.. ''నేను రోజుకు 900 అఫ్గనీలు(సుమారు రూ. 854) సంపాదించేవాడిని. ఇప్పుడు తాలిబాన్ల రాకతో టూరిజం ఆగిపోయింది. నా సంపాదన ఉండదు' అన్నారు.
తాలిబాన్ల రాకతో ప్రజల సామాజిక జీవనంపైనా ప్రభావం పడుతుంది. ''ప్రతి శుక్రవారం రాత్రి ప్రజలు పార్టీలు చేసుకుంటారు. సంగీత, నృత్యాలతో ఆనందిస్తారు. అవన్నీ ఇప్పుడు నిషిద్ధం'' అన్నారు 35 ఏళ్ల ఆసిఫ్.
అఫ్గానిస్తాన్లోని అతి పెద్ద ఎయిర్బేస్ బగ్రామ్ నుంచి అమెరికా, నాటో సేనలు వెళ్లిపోయిన రెండు రోజుల తరువాత జులై 4న తాలిబాన్లు కాందహార్ రాష్ట్రంలోని పంజ్వాయీ జిల్లాను చేజిక్కించుకున్నారు.
అక్కడికి వారం రోజుల్లోనే ఇరాన్తో వాణిజ్య మార్గాలను, ఇస్లాం ఖాలా పోర్టును స్వాధీనం చేసుకున్నారు.
జులై మూడో వారం నాటికి 85 శాతం దేశాన్ని, 90 శాతం సరిహద్దు ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నట్లు తాలిబాన్లు ప్రకటించుకున్నారు.
''తాలిబాన్లు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి సమస్యకూ వెంటనే పరిష్కారం చూపించేస్తారు. వారు తీసుకునే నిర్ణయాలను ఎవరూ కాదనడానికి లేదు'' అన్నారు ఆసిఫ్.
తాలిబాన్లు ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి సొంతానికి వాడుకుంటారు.. ఆకాశాన్నంటిన ధరలకు తోడు ఈ పన్నుల ఒత్తిడి కూడా తప్పదు అన్నారు ఆసిఫ్.
తాలిబాన్ పాలనను గతంలో చూసినవారు చాలామంది ఉన్నారు. వారి ఆలోచనలు అప్పటిలాగే ఉన్నాయి. ఏమీ మారలేదని జన్ అఘా చెప్పారు.
తాలిబాన్లు ఇప్పటికే తమ ప్రాంతంలోని అన్ని పాఠశాలలను మూసివేశారని అఘా చెప్పారు.
ఏ విద్య అయినా ఇస్లామిక్ షరియా చట్టాలకు లోబడి ఉండాలని వారు ఆదేశించారు.
1996 నుంచి 2001 మధ్య తాలిబాన్లు అఫ్గానిస్తాన్ను పాలించినప్పుడు బాలికలు చదువుకోవడాన్ని.. మహిళలు ఉద్యోగాలు చేయడాన్ని నిషేధించారు. వారు ఆరోగ్య సేవలు పొందే హక్కునూ హరించారు.
అయితే, తాలిబాన్ పాలన ముగిసిన తరువాత మహిళలు ప్రజాజీవితంలోకి వచ్చారు. అక్కడి పార్లమెంటులో 25 శాతానికి పైగా స్థానాలను పొందారు.
ప్రాథమిక విద్యలో బాలికల సంఖ్య 50 శాతానికి పెరిగింది. అయితే, మాధ్యమిక విద్యలో మాత్రం అమ్మాయిల సంఖ్య 20 శాతానికే పరిమితమైంది. తాలిబాన్ పాలన ముగిసిన తరువాత మహిళల ఆయుర్దాయం 57 నుండి 66 ఏళ్లకు పెరిగింది. మళ్లీ ఇప్పుడు వారి రాకతో మహిళాభివృద్ధి తిరోగమిస్తుందన్న ఆందోళనలు నెలకొంటున్నాయి.
ఇవి కూడా చదవండి:
- అష్రఫ్ ఘనీ: దేశం విడిచి వెళ్లిపోయిన అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు
- తాలిబాన్లు ఎవరు?
- అఫ్గానిస్తాన్: తాలిబన్లు ఇంత వేగంగా ఎలా పట్టు సాధించారు
- అఫ్గానిస్తాన్ యుద్ధ బాధితులకు మానవతా సాయం ఎందుకు అందడం లేదు?
- ‘వాళ్లు పాశ్చాత్య సంస్కృతిని వీడటం లేదు, మేం వారిని చంపాల్సిందే’ - తాలిబన్లు
- ప్రయాణికులు దిగిన తర్వాత ఈ విమానాన్ని ఇలా రన్వేపైనే ఎందుకు ముక్కలు చేశారు
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)















