PUBG Game నిషేధం: మళ్లీ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం - పబ్‌జీ కార్పొరేషన్

పబ్‌జి

ఫొటో సోర్స్, PUBG

భారత్‌లో పబ్‌జీపై నిషేధం విధించడంపై పబ్‌జీ కార్పొరేషన్ స్పందించింది.

''భారత ప్లేయర్ల డేటా భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలను పబ్‌జీ కార్పొరేషన్ గౌరవిస్తోంది. డేటా భద్రతకు మేం కూడా పెద్ద పీట వేస్తున్నాం. ఇక్కడి నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా మళ్లీ ప్లేయర్లకు ఈ గేమ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం'' అని చెప్పింది.

''తాజా పరిణామాల అనంతరం భారత్‌ నుంచి పబ్‌జీ వెనక్కి తీసుకోవాలని కంపెనీ నిర్ణయించింది. భారతీయులకు మళ్లీ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఆరోగ్యకర వాతావరణంతోపాటు స్థానిక అంశాలనూ ప్రస్తుతం పరిగణలోకి తీసుకుంటున్నాం. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. ఇక్కడి ప్రజలు ఊహించని స్థాయిలో మద్దతు అందించారు. వారందరికీ ధన్యవాదాలు''అని సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.

పబ్‌జీ గేమ్ నిషేధం.. మొత్తం 118 మొబైల్ యాప్‌లు బ్లాక్.. కేంద్రం ఆదేశాలు

దేశంలో యువత విస్తృతంగా ఉపయోగిస్తున్న పబ్‌జీ గేమ్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.

దానితో పాటు దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు విఘాతకరమైన కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం ఉన్న 118 మొబైల్ యాప్‌లను బ్లాక్ చేయాలని నిర్ణయించినట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ బుధవారం సాయంత్రం ప్రకటించింది.

దేశ భద్రత, రక్షణ, శాంతిభద్రతలకు అవి విఘాతకరంగా ప్రవర్తిస్తున్నట్లు తమకు అందుబాటులో ఉన్న సమాచారం చెప్తోందని పేర్కొంది.

భారత్ - చైనా సరిహద్దులో లదాఖ్ వద్ద ఇరు దేశాల మధ్య తాజా ఉద్రిక్తతలు తలెత్తిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇంతకు ముందు కూడా.. లద్ధాఖ్‌లో సరిహద్దు వద్ద గాల్వన్ లోయలో ఘర్షణలు చెలరేగినపుడు.. టిక్‌టాక్ సహా పలు చైనా యాప్‌లను కేంద్రం నిషేధించిన విషయం తెలిసిందే.

భారత సార్వభౌమాధికారం, సమగ్రత, శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ టిక్‌టాక్, షేరిట్ సహా 59 యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ జూన్ 29 రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2009 లోని 69వ సెక్షన్ ప్రకారం ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు చెప్పింది. అప్పుడు నిషేధించిన 59 యాప్‌ల జాబితాలో టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, బైడూ మ్యాప్, షేరిట్ వంటి చైనా యాప్‌లు అధికంగా ఉన్నాయి.

తాజా ఆదేశాల్లో.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫారంలలో కొన్ని మొబైల్ అనువర్తనాల దుర్వినియోగంపై తమకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ తెలిపింది.

ఈ యాప్‌ల సహాయంతో డాటాను దొంగిలించి భారతదేశం వెలుపల ఉన్న సర్వర్లకు అందజేస్తున్నట్లు తమకు ఫిర్యాదులొచ్చాయని తెలిపారు. ఇది భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగిస్తుందని, ఈ అంశంలో తక్షణ చర్యలు చేపట్టడం అవసరమని వివరించారు.

భారత రక్షణ మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ కూడా ఈ యాప్‌లను నిషేధించమంటూ అనేకసార్లు కోరిందనీ...అలాగే, అనేకమంది ప్రజా ప్రతినిధులు కూడా ఈ యాప్‌ల దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తపరిచినట్లు సమాచారం.

భారత సార్వభౌమత్వానికి నష్టం కలిగిస్తూ, భారత ప్రజల గోప్యతకు భంగం కలిగించే యాప్‌లను నిషేధించవలసిందేనని అనేకమంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిపారు.

వీటన్నిటి ఆధారంగా, దేశ శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం ఈ యాప్‌లను నిషేధించిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)