థాయిలాండ్లోని ఓ హోటల్ యజమానులకు 1,446 ఏళ్ల జైలు శిక్ష... వాళ్లు చేసిన నేరం ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
తమ హోటల్లో ఆహార ఉత్పత్తుల కొనుగోలు విషయంలో వినియోగదారులను మోసం చేసినందుకు థాయిలాండ్కు చెందిన ఇద్దరు హోటల్ యజమానులకు థాయిలాండ్ కోర్టు 1,446 సంవత్సరాల జైలు శిక్షను విధించింది.
లీమ్గేట్ ఫుడ్ రెస్టారంట్ గత సంవత్సరం తమ హోటల్ ప్రచారంలో భాగంగా ఆహారాన్ని ముందుగానే కొనుక్కునే వోచర్లను అమ్మింది.
సుమారు 20,000 మంది వినియోగదారులు 5 కోట్ల రూపాయిల విలువైన వౌచర్లను కొనుక్కున్నట్లు థాయ్ పిబి ఎస్ అనే వార్తా సంస్థ తెలిపింది.
అయితే, ఈ డిమాండ్ ని తట్టుకోలేమని చెబుతూ హోటల్ యజమానులు కొన్ని రోజుల్లోనే హోటల్ ని మూసివేశారు.
దీని గురించి కొన్ని వందల మంది ఫిర్యాదు చేయడంతో హోటల్ యజమానులు అపిచార్ట్ బోవోర్న్బంచారక్ , ప్రపాసోర్న్ బోవోర్బంచను అరెస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Laemgate Seafood Restaurant/Facebook
నమోదైన ఫిర్యాదుల ప్రకారం సుదీర్ఘ కాలం జైలు శిక్ష విధించడం థాయిలాండ్లో మామూలే.
థాయిలాండ్ చట్టం ప్రకారం ఇలాంటి పబ్లిక్ మోసాలకు 20 సంవత్సరాల గరిష్ట శిక్ష ఉంటుంది.
గత సంవత్సరం లీమ్గేట్ రెస్టారంట్ కస్టమర్ల నుంచి అడ్వాన్స్ వసూలు చేసింది.
ఈ ప్రచారంలో భాగంగా తమ హోటల్లో 10 మంది విందుకు సుమారు 1600 రూపాయిలు చొప్పున వసూలు చేసింది. ఇది చాలా చౌక ఆఫర్ కావడంతో చాలా మంది ప్రజలు ఈ వోచర్లను కొనుక్కున్నారు.
మొదట్లో కొన్ని రోజులు కొంత మంది ఈ వోచర్లను వినియోగించుకుని హోటల్లో విందు చేసేవారు. అయితే , వినియోగదారుల డిమాండ్ చాలా ఉండటంతో ఇక్కడ భోజనానికి వెళ్ళడానికి కొన్ని నెలల ముందే సీటు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చిందని థాయ్ పీబీఎస్ చెప్పింది.
కానీ, లేంగేట్ ఇన్ఫినిట్ కంపెనీ డిమాండ్ తట్టుకోలేకపోతున్నామనే కారణంతో కొన్ని రోజులకే హోటల్ని మూసేసింది.

ఫొటో సోర్స్, Laemgate Seafood Restaurant/Facebook
వోచర్లు కొనుక్కున్న వారికి డబ్బులు తిరిగి ఇస్తామని కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. ఫిర్యాదు చేసిన 818 వినియోగదారుల్లో 375 మందికి వారి డబ్బులు తిరిగి అందాయి.
ఆ తర్వాత మరి కొన్ని వందల మంది కంపెనీ చేసిన మోసాలను చెబుతూ ఫిర్యాదులు చేశారు.
దీంతో హోటల్ యజమానులను తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసగించిన నేరం కింద అరెస్ట్ చేసారు.
వీరిద్దరిని మొత్తం 723 అభియోగాల పై ఒక్కొక్కరికి 1446 సంవత్సరాల శిక్ష విధించారు.
వారు తప్పు ఒప్పుకోవడంతో శిక్షను చెరొక 723 సంవత్సరాలకు తగ్గించారు. అయితే, నిజానికి వీరు గరిష్టంగా 20 సంవత్సరాలు శిక్ష అనుభవించవచ్చు.
వారి సంస్థ లీమ్గేట్ ఇన్ఫినిట్ కి కూడా జరిమానా విధించారు. మోసపోయినవారికి పరిహారం కూడా ఇవ్వమని సంస్థని ఆదేశించారు.
2017లో థాయ్ కోర్టు ఒక నేరస్థునికి 13 వేల ఏళ్ళ జైలు శిక్ష విధించింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: లాక్డౌన్ వారికి కొత్త కాదు... ఆ అందమైన దేశంలో అదొక చిరకాల సంప్రదాయం
- వందల ఏళ్ల క్రితమే క్వారంటైన్ విధానాన్ని అనుసరించిన పురాతన నగరం ఇది
- కోవిడ్-19: ‘నేను వెంటిలేటర్ తొలగించి రోగి మరణించడానికి సహాయపడతాను’
- లాక్డౌన్ 4.0.. స్టేడియంలను తెరవొచ్చు, ప్రేక్షకులు వెళ్ల కూడదు.. విమానాలు, మెట్రో రైళ్ల సేవలు రద్దు
- కరోనావైరస్: ఒంటరి వ్యక్తులు ‘సెక్స్ స్నేహితుల’ను వెదుక్కోండి – ప్రభుత్వ మార్గదర్శకాలు
- 800 మీటర్ల ఎత్తున్న శిఖరాల మీద నివసించే ప్రజలను పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్న చైనా
- ప్రపంచం మెరుగవుతోంది... ఇవిగో రుజువులు
- వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని చంపేసిన నరమేధం
- కరోనావైరస్: మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








